ఎర్రసముద్రంలో యుద్ధ జ్వాలలు.!
Publish Date:Jul 23, 2026
Advertisement
అంతర్జాతీయ వాణిజ్య మార్గమైన ఎర్రసముద్రంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే కీలక సముద్ర మార్గంలో రాకెట్లు, డ్రోన్ దాడుల మోత మోగుతోంది. సౌదీ అరేబియా నైరుతి తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న ఒక చమురు ట్యాంకర్పై జరిగిన క్షిపణి దాడి ప్రపంచ దేశాలను నివ్వెరపరిచింది. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్న తరుణంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ప్రపంచ ఇంధన రవాణాను సందిగ్ధంలో పడేసింది. యునైటెడ్ కింగ్డమ్ మేరిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ అధికారికంగా వెల్లడించిన వివరాల మేరకు.. సౌదీ అరేబియాలోని అల్ షుకైక్ ప్రాంతానికి నైరుతి దిశలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో నౌకలో ఉవ్వెత్తున భారీగా మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ ఈ క్షిపణి దాడిలో ప్రాణనష్టం సంభవించలేదు. ఈ వినాశకర దాడికి బాధ్యత వహిస్తూ యెమెన్కు చెందిన హౌతీ రెబెల్స్ వర్గం ప్రకటన విడుదల చేసింది. సౌదీ అరేబియాకు చెందిన రెండు చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి ఒడిగట్టినట్లు హౌతీలు పేర్కొన్నారు. సౌదీ ప్రభుత్వం తమ అధీనంలో ఉన్న ప్రాంతాలను దిగ్బంధించినందుకే ఆ దేశ నౌకలపై సముద్ర నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. సౌదీ అరేబియా నౌకలపై సముద్ర నిషేధం విధించినట్లు హౌతీ తిరుగుబాటుదారులు రెండు రోజుల కిందటే హెచ్చరికలు జారీ చేశారు. ఆ హెచ్చరికలు జారీ చేసిన రెండు రోజులకే బాబ్ ఎల్-మండేబ్ జలసంధికి సమీపంలో దాడికి పాల్పడ్డారు. ఇప్పటికే హర్మూజ్ జలసంధిలో నౌకాయానం దాదాపుగా నిలిచిపోగా, ఇప్పుడు హౌతీ దాడితో బాబ్ ఎల్-మండేబ్ జలసంధి గుండా నౌకాయానం భద్రత కాదని తేలడంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో పెట్రోలియం రవాణాపై సందిగ్దత నెలకొంది. ఈ దాడులకు అడ్డుకట్ట పడకపోతే, ప్రపంచ ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థిక సంక్షోభం నెలకొనే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్త మౌతోంది. wares in Red Sea, Houthi Rebels, Saudi Oil Tanker Attack, Bab el Mandeb Strait, Global Shipping Crisis, Maritime Security
http://www.teluguone.com/news/content/wares-in--red-sea-36-226829.html





