వైసీపీ నుంచి విజయమ్మ ఔట్?
Publish Date:Jun 10, 2022
Advertisement
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ... తన గౌరవాధ్యక్షురాలి పదవి రాజీనామా చేయడం ఖాయమేనా? అందుకు కౌంట్ డౌన్ మొదలైందా? మరి కొద్దిరోజుల్లో ఆమె ఆ పదవికీ రాజీనామా చేసి... హైదరాబాద్ లోటస్ పాండ్లోని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, తన కుమార్తె వైయస్ షర్మిల వద్దే ఉండనున్నారా? అంటే వైసీపీ వర్గీయుల నుంచి అవుననే సమాధానం వస్తోందీ. వచ్చే నెల 8, 9 తేదీల్లో అధికార వైసీపీ ప్రతిష్టాత్మంగా నిర్వహించనున్న ప్లీనరీ వేదికగా ఆమె తన పదవికీ రాజీనామా చేయనున్నారని సమాచారం. విజయవాడ - గుంటూరు జాతీయ రహదారిపై ఆచార్య నాగార్జున నగర్ సమీపంలోని మైదానంలో ప్లీనరీ నిర్వహించాలని వైసీపీ ఇప్పటికే నిర్ణయించింది. ఆ క్రమంలో అందుకు సంబంధించిన పనులు త్వరలో ప్రారంభకానున్నాయని తెలుస్తోంది. ఈ సభను జయప్రదం చేసేందుకు ఇప్పటికే.. ఆ పార్టీ అగ్రనేతలు దృష్టి సారించారు. 2017, జులై 8న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీని నిర్వహించిన సంగతి తెలిసిందే. నాటి ఈ సభకు భారీగా ప్రజలు తరలి రావడమే కాదు...ఈ సభా వేదికపైన వైయస్ విజయమ్మ, వైయస్ షర్మిల కూడా ఉన్నారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇక జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో షర్మిల, విజయమ్మ.. హైదరాబాద్ కు పరిమితమైపోయారు. ఆ క్రమంలో వైయస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి.. ఆ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తోంది. దీంతో దాదాపుగా జగన్కు సోదరి, తల్లిలతో గ్యాప్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్తో వీరిద్దరు ఎడముఖం పెడ ముఖంగా ఉంటున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి పరిస్థితిలో.. రాష్ట్రం కానీ రాష్ట్రంలో ఉంటూ.. అధికారంలో ఉన్న ఓ పార్టీకి గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగడం భావ్యం కాదనే ఆలోచనలో విజయమ్మ ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే తన పదవికీ రాజీనామా చేసి.. గౌరవంగా ఫ్యాన్ పార్టీ నుంచి తప్పుకోవాలని ఆమె భావించారని.. ఇదే విషయాన్ని తన కుమారుడు సీఎం వైయస్ జగన్ వద్ద విజయమ్మ ప్రస్తావించగా.. ప్లీనరీ వరకు వేచి ఉండాలంటూ జగన్ సూచించినట్లు గతంలో అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో జూలై 8వ తేదీన తన పదవికీ విజయమ్మ రాజీనామా ప్రకటిస్తారని తెలుస్తోంది. మరోవైపు.. ఈ ప్లీనరీకి ఎలాగో వైయస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల రారని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో విజయమ్మను ప్లీనరీకి షర్మిలా పంపుతారా? అంటే సందేహమే అనే చర్చ కూడా వైసీపీలో జరుగుతోంది. ఏదీ ఏమైనా గతంలో వైసీపీ ప్లీనరీకే కాదు.. నాడు ప్రతిపక్ష నేతగా జగన్ చేపట్టిన పాదయాత్రకు సైతం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులే కాదు.. పలు వర్గాల ప్రజలు కూడా జగన్ కు, ఆయన పార్టీకీ దూరమయ్యారన్న సంగతి విదితమే. అలాంటి పరిస్థితుల్లో జగన్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ ప్లీనరీకి జనం పొటెత్తుతారా? అంటే సందేహమే అని వైసీపీలోని ఓ వర్గం బల్లగుద్దీ మరీ చెబుతోంది. 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడానికి.. ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ ఎంతగా దోహదం చేశారో.. అంతగా విజయమ్మ, షర్మిల కూడా తోడ్పాటునందించారు. కానీ నేడు.. ప్రశాంత్ కిషోర్కు చెందిన ఐ ఫ్యాక్ సంస్థతో పాటు ఆ సంస్థ వ్యవస్థాపకుడు రుషి రాజ్ సింగ్ .. జగన్ వెంటనే ఉన్నారు. కానీ విజయమ్మ, షర్మిలలు.. జగన్ వెంట లేకపోవడం పెద్ద లోటేనని ఫ్యాన్ పార్టీలోని ఆ వర్గం నేతలు అభిప్రాయపడుతున్నారు. రానున్న ఎన్నికల్లో.. తల్లి చెల్లి లేకుండా జగన్ నెగ్గుకురాగలరా అంటే ఏమో అని ఆ పార్టీ నేతలే అనుమానం వ్యక్తం చేయడం పలు సందేహాలకు తావిస్తున్నట్లవుతోందని రాజకీయ విశ్లేషకులు కూడా పేర్కొనడం గమనార్హం.
http://www.teluguone.com/news/content/vijayamma-to-resign-ycp-25-137434.html





