ఇంకా పరారీలోనే భూం భూం వాసుదేవరెడ్డి
Publish Date:Aug 10, 2024
Advertisement
ఏపీఎస్బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వాసుదేవరెడ్డి చేసిన అక్రమాలు, అవినీతి వ్యవహారాలపై వస్తున్న ఫిర్యాదులను ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేస్తోంది. ప్రధానంగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విక్రయాలను ప్రభుత్వ దుకాణాల ద్వారా పెద్ద ఎత్తున జరిపించినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అవి ఎంత మేర జరిగాయన్న దానిపై విచారణ చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గడచిన ఐదేళ్లలో 99 వేల కోట్ల రూపాయల మేర నగదుగా మద్యం విక్రయాలు ఎందుకు జరిపారన్న అంశంపై వాసుదేవరెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. నకిలీ హోలోగ్రామ్లు అంటించిన మద్యం బాటిళ్లను కూడా మద్యం దుకాణాల ద్వారా విక్రయించి ఆ సొమ్మును దారిమళ్లించారని ఇప్పటికే ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి, డిస్టిలరీల నుంచి అక్రమమార్గాల్లో వచ్చిన నాన్ డ్యూటీపెయిడ్ లిక్కర్ వ్యవహారం కూడా వాసుదేవరెడ్డి కనుసన్నల్లో జరిగినట్టు తెలుస్తోంది. వైసీపీ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా వాసుదేవరెడ్డి పెద్ద ఎత్తున ఆక్రమాలకు పాల్పడ్డారని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే ఎక్సైజ్ శాఖలో గత వైసీపీ ప్రభుత్వం నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మద్యం సీసాలపై ముద్రించే సెక్యూరిటీ హాలోగ్రామ్స్ సరఫరా టెండర్ల వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా హోలోగ్రామ్ టెండర్లు చేపట్టినట్లు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు లేకుండానే టెండర్లు ఇచ్చినట్లు సమాచారం. హోలోగ్రామ్ కంపెనీలకు ఏపీఎస్బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఇష్టారీతిగా, నిబంధనలను తుంగలో తొక్కి మరీ టెండర్లు కట్టబెట్టినట్లు ఇప్పటికే విచారణలో వెల్లడైంది. మరోవైపు ప్రభుత్వానికి రిపోర్టు చేయకుండా వాసుదేవరెడ్డి ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. సీఐడీ ఇచ్చిన 41 ఏ నోటీసు ద్వారా విచారణకూ వాసుదేవరెడ్డి గైర్హాజరయ్యారు. దాదాపు రెండు నెలలుగా ఆయన పరారీలోనే ఉన్నారు. జూన్ 7న వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అప్పటికే వాసుదేవరెడ్డి అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి సీఐడీ బృందాలు ఆయన కోసం గాలిస్తూనే ఉన్నాయి. జగన్ ప్రభుత్వ పెద్దలు, వైసీపీ ముఖ్య నాయకులు సూత్రధారులుగా సాగించిన మద్యం కుంభకోణంలో ఏపీఎస్బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి కీలక పాత్రధారిగా ఉన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన దోపిడీకి సంబంధించిన కీలక ఆధారాలు, పత్రాలు, హార్డ్డిస్క్లను సైతం వాసుదేవరెడ్డి మాయం చేసేందుకు ప్రయత్నాలు చేసినట్లు ఇప్పటికే సీఐడీ గుర్తించింది.
http://www.teluguone.com/news/content/vasudevareddy-still-absconding-25-182650.html





