Top Stories

political-news-img

తెలంగాణ భవన్‌లో కేటీఆర్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ కుస్తీ పోటీలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో శుక్రవారం 'కేటీఆర్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్' పేరుతో కుస్తీ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, జీవన్ రెడ్డి, తలసాని సాయికిరణ్ యాదవ్ తదితర నాయకులు, రాష్ట్రంలోని పలు అఖాడాలకు చెందిన రెజ్లర్లు, క్రీడాకారులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. తన జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్‌లో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సాధారణంగా పుట్టినరోజు అంటే ప్రశాంతంగా గడపాలని అనుకున్నప్పటికీ, "మనం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం.. తెల్లారి లేస్తే పోరాటమే.. ఉదయం ధర్నా అయినా, సాయంత్రం కుస్తీ అయినా ఫైటింగ్ మోడ్‌లోనే ఉండాలి" అని తలసాని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని నవ్వుతూ పేర్కొన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబానికి కుస్తీతో ఎంతో అనుబంధం ఉందని, ఆయన తండ్రి కూడా ప్రముఖ పహిల్వాన్ అని గుర్తు చేశారు. అందుకే రెజ్లింగ్ క్రీడాకారుల అభివృద్ధిపై ఆయనకు ప్రత్యేకమైన అభిమానం ఉందన్నారు. రాష్ట్రంలోని సుమారు 70 అఖాడాలకు అవసరమైన సహాయం అందించడంతో పాటు, హైదరాబాద్ నుంచి జాతీయ స్థాయికి ఎంపికయ్యే సుమారు 150 మంది రెజ్లర్లకు షూలు, శిక్షణ, ఇతర ఖర్చులను భరించే బాధ్యతను తలసాని స్వయంగా తీసుకోవడం అభినందనీయమని కొనియాడారు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టేలా మౌలిక సదుపాయాలు, అభివృద్ధిపై విస్తృతంగా పనిచేశామని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే 2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని విశ్వాసం వ్యక్తం చేసిన కేటీఆర్, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి అన్ని రకాల క్రీడలకు పెద్దపీట వేసేలా సమగ్ర విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తలసాని వంటి నాయకులు క్రీడాకారులకు అండగా ఉంటారని, తాను కూడా ఎల్లప్పుడూ వారికి అండగా నిలుస్తానని కేటీఆర్ భరోసా ఇచ్చారు. రెజ్లర్లకు ఎలాంటి అవసరం వచ్చినా బీఆర్ఎస్ నాయకత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తన జన్మదినం సందర్భంగా తరలివచ్చిన కార్యకర్తలు, మహిళలు, అభిమానులు, నాయకులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని మల్లయుద్ధానికి మహాభారత కాలం నుంచే గొప్ప చరిత్ర ఉందన్నారు. హైదరాబాద్ నుంచి ప్రతి ఏడాది సుమారు 150 మంది రెజ్లర్లు జాతీయ స్థాయికి ఎంపికవుతున్నారని తెలిపారు. వారికి అవసరమైన శిక్షణ, క్రీడా సామగ్రి, ఇతర సదుపాయాలన్నింటినీ అందించే బాధ్యతను తాను తీసుకుంటున్నానని చెప్పారు. భవిష్యత్తులో కూడా రెజ్లింగ్ క్రీడాకారులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కుస్తీ పోటీలు తెలంగాణ భవన్‌లో ఉత్సాహభరిత వాతావరణంలో సాగగా, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన రెజ్లర్లు తమ ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు.

Publish Date: Jul 24, 2026 9:38PM

political-news-img

తప్పుడు వ్యక్తిని గెలిపించా క్షమించండి.. రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

మందుల సామేల్ వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి స్పందన..! ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. తుంగతుర్తి శాసనసభ్యుడు మందుల సామేల్ చేసిన వ్యాఖ్యలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ శ్రేణులకు ఆయన బహిరంగంగా క్షమాపణలు తెలియజేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. భువనగిరి కలెక్టరేట్ వేదికగా మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే సామేల్ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత శాసనసభ ఎన్నికల్లో పార్టీ అధిష్ఠానంతో మాట్లాడి, తాను ప్రత్యేకంగా కోరిన రెండు సీట్లలో తుంగతుర్తి ఒకటని, సామేల్‌కు టికెట్ ఇప్పించి విజయం కోసం శ్రమించానని గుర్తుచేశారు. తనను, తన నాయకత్వాన్ని నమ్మి సామేల్‌ను గెలిపించినందుకు తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తనను క్షమించాలని రాజగోపాల్ రెడ్డి కోరారు. తన మద్దతుతో గెలిచిన వ్యక్తినేడు తనపైనే అనుచిత వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందంటూ, ఆ విమర్శలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు. సొంత పార్టీలో నిజమైన, నిబద్ధత కలిగిన కార్యకర్తలను కాపాడుకోవడమే తన ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడిన శ్రేణుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తాను ఎలాంటి త్యాగానికైనా వెనుకాడనని తేల్చిచెప్పారు. ఇటీవల పార్టీలోకి వచ్చి చేరుతున్న కొత్త నాయకులు పాత కార్యకర్తలను విస్మరించడమే కాకుండా, వారిని ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సామేల్ వైపు నుంచి ఎలాంటి విమర్శలు, ఆరోపణలు వచ్చినా కోమటిరెడ్డి అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు శాంతితో, సహనంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. పార్టీలోని పాత, కొత్త నాయకుల మధ్య నెలకొన్న ఈ అసంతృప్తులపై కాంగ్రెస్ అధిష్ఠానం తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. నిజమైన కార్యకర్తలకు న్యాయం జరిగేలా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. తాజా పరిణామాలతో తుంగతుర్తి నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ అధిష్ఠానం వేగంగా స్పందించి ఈ విభేదాలకు ముగింపు పలుకుతుందో, లేక ఈ మాటల యుద్ధం మున్ముందు మరిన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. Mandula Samuel, Komatireddy Rajagopal Reddy, Telangana Congress News, Tungathurthi MLA, Nalgonda Politics, Tungaturthi Congress Politics

Publish Date: Jul 24, 2026 9:22PM

political-news-img

కాంగ్రెస్, బీజేపీ పోరులో నలిగిపోతున్న విద్యార్థి ఉద్యమాలు..!

దేశంలో ప్రస్తుతం నిరుద్యోగ యువత విద్యార్థుల భవిష్యత్తు తీవ్ర గందరగోళంలో పడింది. నీట్ (NEET) ఎంట్రన్స్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ అంశం లక్షలాది మంది అభ్యర్థుల జీవితాలను ఆందోళనలోకి నెట్టివేసింది. అయితే, ఈ గంభీరమైన సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కలిగిన అధికార, ప్రతిపక్ష పార్టీల వైఖరి తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.సామాజిక మాధ్యమాల ద్వారా సంఘటితమైన 'కాక్రోచ్ మూవ్‌మెంట్' వంటి స్వచ్ఛంద యువజన వేదికలు తమ హక్కుల కోసం, విద్యాశాఖ మంత్రి రాజీనామా కోసం సుదీర్ఘకాలంగా శాంతియుత పోరాటం సాగిస్తున్నాయి. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ వడ్డే వెంకటేశ్వరరావు మరో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్‌ రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ టోన్‌ న్యూస్ నిర్వహించింది. కానీ, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ మరియు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఈ సమస్యపై పార్లమెంటు వేదికగా నిర్మాణాత్మకమైన చర్చ జరిపి పరిష్కారం వెతకడంలో విఫలమయ్యాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దిల్లీలో ప్రధానమంత్రి నివాస ముట్టడి మొదలుకొని, తెలంగాణలో గాంధీ భవన్, లోక్ భవన్‌ల వద్ద ఆందోళనలు, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల వరకు పరిణామాలు గమనిస్తే సమస్య తీవ్రత కంటే రాజకీయ ప్రతీకార చర్యలకే ప్రాధాన్యం లభిస్తున్నట్లు స్పష్టమవుతోంది. రాజకీయ వ్యూహాలు పరిణామాలుఈ ఘర్షణల వెనుక స్పష్టమైన రాజకీయ వ్యూహాలు కనిపిస్తున్నాయి ఉద్యమాల హైజాక్: స్వచ్ఛందంగా ఉద్భవించిన యువజన, విద్యార్థి ఆందోళనలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధాన పార్టీలు స్వీకరించి, వాటిని బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వైషమ్యంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయి. జాతీయ వేదికల విస్మరణ: పార్లమెంటు బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) ద్వారా సమస్యను అత్యవసర అంశంగా లేవనెత్తి విద్యా వ్యవస్థలో సంస్కరణలు సాధించాల్సింది పోయి, రోడ్డెక్కి కార్యాలయాలపై దాడులు చేసుకోవడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం. బీఆర్ఎస్, వైఎస్సార్‌సీపీ, డిఎమ్‌కే వంటి ప్రాంతీయ పార్టీలు కేంద్ర పెద్దల వద్ద ఉన్న రాజకీయ సమీకరణాలు లేదా భయాల కారణంగా ఈ అంశంపై జాతీయ స్థాయిలో తగినంత గళం విప్పకపోవడం గమనార్హం. ఈ పరిణామాల వల్ల అసలు విద్యార్థుల సమస్యలు, నీట్ అక్రమాలపై జరగాల్సిన చర్చ పక్కదారి పట్టి, రాజకీయ హింస మరియు పోలీసుల బలప్రయోగం వైపు ప్రాధాన్యం మళ్లింది.భవిష్యత్తు రాజకీయ ప్రభావంప్రజాస్వామ్యంలో యువత నిరాశ, అసహనానికి లోనైతే దాని తీవ్రత తీవ్రంగా ఉంటుంది. గత పదేళ్లుగా నెరవేరని ఉద్యోగ ప్రకటనలు, వరుస పేపర్ లీకేజీలు మోదీ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారాయి. యువత తిరుగుబాటు: విద్యార్థులు మరియు ఉద్యోగార్థులు రాజకీయ పార్టీల ఉచ్చులో పడకుండా స్వతంత్రంగా తమ ప్రశ్నలను లేవనెత్తుతుండడం రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వానికైనా ముప్పుగా పరిణమిస్తుంది. రాజకీయ విశ్వసనీయత కోల్పోవడం క్షేత్రస్థాయి ఆందోళనలను హింసాత్మకం చేయడం ద్వారా కాంగ్రెస్, బిజెపిలు రెండూ ప్రజా సమస్యలను రాజకీయం చేస్తున్నాయనే భావన పౌర సమాజంలో బలపడుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలకు విఘాతం: పార్లమెంటును కాదని రోడ్లపై జరిపే ఆధిపత్య పోరాటాలు చట్టసభల ప్రాధాన్యతను తగ్గిస్తాయి.ముగింపుగా, నీట్ బాధితులకు న్యాయం జరగాలంటే ప్రజాప్రతినిధులు ప్రతీకార రాజకీయాలను వీడి, విద్యావ్యవస్థలో కఠినమైన సంస్కరణలు తెచ్చేందుకు కృషి చేయాల్సి ఉంది. ఇలాంటి అంశాలపై పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి. NEET Paper Leak, Congress vs BJP Protest, Cockroach Movement Politics, Rahul Gandhi, PM House Protest, Telugu States Politics, Gandhi Bhavan Protests

Publish Date: Jul 24, 2026 8:59PM

political-news-img

నీట్ పేపర్ లీక్ వివాదం.. కేంద్రం సంచలన నిర్ణయం..!

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్-యూజీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ కీలక అడుగు వేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పనితీరుపై వస్తున్న తీవ్ర విమర్శలు, ఆందోళనల నేపథ్యంలో, ఏజెన్సీ ప్రక్షాళన మరియు పరీక్షల నిర్వహణ వ్యవస్థలో భారీ సంస్కరణలకు సంబంధించి కేంద్రం నేడు రాత్రి కీలక ప్రకటన చేయనుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతున్న నిరసనల మధ్య కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షలలో పారదర్శకత, గోప్యత, భద్రతను పెంపొందించేలా సమగ్ర మార్పులను విద్యాశాఖ రూపకల్పన చేసింది. ఎన్‌టీఏ ప్రక్షాళన చర్యలలో భాగంగా ఇప్పటికే అంతర్గతంగా పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం వహించిన పలువురు అధికారులను విధుల నుంచి తప్పించడమే కాకుండా, పేపర్ లీకేజీ వంటి తీవ్రమైన కేసుల విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సమాయత్తమవుతున్నారు. రాబోయే రోజుల్లో నిర్వహించే పరీక్షల్లో ఎలాంటి సాంకేతిక, భద్రతా లోపాలు తలెత్తకుండా సరికొత్త డిజిటల్ ప్రోటోకాల్స్ అమలు చేయాలని భావిస్తున్నారు. ప్రశ్నాపత్రాల రూపకల్పన నుంచి పరీక్షా కేంద్రాల ఎంపిక వరకు కట్టుదిట్టమైన మార్గదర్శకాలను పాటించేలా నూతన నిబంధనలు రూపొందించారు. మరోవైపు, దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ సహా వివిధ ప్రాంతాల్లో విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి. పరీక్షల వ్యవస్థలో పారదర్శకత పునరుద్ధరించాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికే ప్రధాని హామీ ఇచ్చారు. ఇటీవల విద్యాశాఖ ఉన్నత స్థాయిలో జరిగిన అధికారుల బదిలీలు కూడా ఈ సంస్కరణల ప్రక్రియలో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే ఎలాంటి శక్తులపైనా దాపరికం లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. కేంద్ర విద్యాశాఖ వెల్లడించనున్న ఈ నూతన విధానాలు మరియు ఎన్‌టీఏ ప్రక్షాళన మార్గదర్శకాలు జాతీయ స్థాయి పరీక్షలపై విద్యార్థులకు మళ్లీ నమ్మకాన్ని కలిగిస్తాయని భావిస్తున్నారు. విద్యాశాఖ చేయబోయే ప్రకటనపై ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. NTA Reforms, Education Ministry NTA Announcement, NEET Paper Leak Controversy, National Testing Agency, Central Education Ministry

Publish Date: Jul 24, 2026 8:46PM

political-news-img

బంగ్లాదేశ్ అధ్యక్షుడు రాజీనామా.. ఎందుకో తెలుసా..!

పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత మళ్లీ తీవ్ర రూపం దాల్చింది. ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ తన పదవికి హఠాత్తుగా రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తన ఐదేళ్ల పదవీకాలం పూర్తికావడానికి ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ, ఊహించని విధంగా ఆయన తప్పుకోవడం అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. అనారోగ్య కారణాల వల్లనే తాను అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు షహబుద్దీన్ అధికారికంగా వెల్లడించారు. అయితే, దీని వెనుక తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల దేశంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంతో విభేదాలు రావడం, మాజీ ప్రధాని షేక్ హసీనాతో ఆయనకు ఉన్న సన్నిహిత సంబంధాలే ఈ నిర్ణయానికి కారణమని సమాచారం. గతంలో విద్యార్థుల ఉధృత ఉద్యమం కారణంగా మాజీ ప్రధాని షేక్ హసీనా తన పదవిని కోల్పోయి, భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. అయితే, డిసెంబర్ నాటికి తాను తిరిగి బంగ్లాదేశ్‌కు చేరుకుంటానని హసీనా ఇటీవల ప్రకటించారు. ఈ కీలక ప్రకటన వెలువడిన కొన్ని రోజుల వ్యవధిలోనే అధ్యక్షుడు రాజీనామా చేయడం విశేషం. వాస్తవానికి 2023లో షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ పార్టీ మద్దతుతోనే మహమ్మద్ షహబుద్దీన్ ఏకగ్రీవంగా దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2028 ఏప్రిల్ వరకు కొనసాగాల్సి ఉంది. హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత నాటి పాలనకు గుర్తుగా అగ్ర రాజ్యాంగ పదవిలో మిగిలిన చివరి కీలక వ్యక్తి కూడా ఈయనే. హసీనా దేశం విడిచి వెళ్లిన సమయం నుంచే షహబుద్దీన్‌పై పదవి నుంచి వైదొలగాలనే ఒత్తిళ్లు పెరిగాయి. తాత్కాలిక పాలనా యంత్రాంగంతో సమన్వయం లోపించడం, పాత ప్రభుత్వ మద్దతుదారుడిగా ముద్ర పడటంతో ఆయనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. బంగ్లాదేశ్ రాజ్యాంగ నిబంధనలను అనుసరించి, అధ్యక్ష పదవి ఖాళీ అయినందున పార్లమెంట్ స్పీకర్ హఫీజుద్దీన్ అహ్మద్ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. నూతన అధ్యక్షుడి ఎన్నిక పూర్తయ్యే వరకు ఆయనే దేశ అత్యున్నత బాధ్యతలను పర్యవేక్షిస్తారు. ఈ హఠాత్ పరిణామం బంగ్లాదేశ్‌ను మరింత అనిశ్చితిలోకి నెట్టే ప్రమాదముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో దేశంలో సాధారణ పరిస్థితులు పునరుద్ధరణ పొందుతాయా లేదా కొత్త ఉద్రిక్తతలు మొదలవుతాయా అనేది రాబోయే రోజుల్లో స్పష్టం కానుంది. Mohammed Shahabuddin, Bangladesh President Resignation, Sheikh Hasina, Bangladesh Political Crisis

Publish Date: Jul 24, 2026 8:14PM

political-news-img

నల్గొండ జిల్లా కోమటిరెడ్డి బ్రదర్స్ రాజ్యామా..ఎమ్మెల్యే సామేల్ ఆగ్రహం..!

నా నియోజకవర్గానికి జోలికి వస్తే మీకు మర్యాద దక్కదు.. ఘాటు హెచ్చరిక..! తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయం తీవ్ర దుమారం రేపుతోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైఖరిపై తుంగతుర్తి శాసనసభ్యుడు మందుల సామేల్ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జిల్లా తమ సొంత రాజ్యం కాదని, ఇతర ప్రజాప్రతినిధుల హక్కులను కాలరాసే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి ఇటీవల తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగడం లేదంటూ చేసిన వ్యాఖ్యలపై సామేల్ మండిపడ్డారు. ముందుగా తన సొంత నియోజకవర్గమైన మునుగోడులో ఏం అభివృద్ధి జరుగుతుందో చూసుకోవాలని హితవు పలికారు. మునుగోడులో తీవ్ర అసంతృప్తి వాతావరణం ఉందంటూ తమకు కూడా నివేదికలు వచ్చాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఎవరి దయాదాక్షిణ్యాలపైనా గెలవలేదని తుంగతుర్తి ఎమ్మెల్యే గుర్తుచేశారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం 60 వేల మెజారిటీతో, తాను 50 వేల పైచిలుకు మెజారిటీతో ప్రజల ఆమోదంతో విజయం సాధించామని తెలిపారు. తమ ప్రజాస్వామ్య విజయాన్ని తక్కువ చేసి మాట్లాడటం సరికాదని హితవు పలికారు. తన నియోజకవర్గ పరిధిలో తొమ్మిది మండలాల అధ్యక్షుల నియామకాన్ని తానే స్వయంగా పూర్తి చేశానని స్పష్టం చేశారు. స్థానిక రాజకీయాల్లో రాజగోపాల్ రెడ్డి జోక్యం చేసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. తన నియోజకవర్గ వ్యవహారాల్లో వేలు పెడితే ఊరుకునేది లేదని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లి రాహుల్ గాంధీని విమర్శించి, ఎన్నికల సమయంలో తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని సామేల్ గుర్తుచేశారు. తనపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తే కాంగ్రెస్ అధిష్టాన నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు నేరుగా ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. రాష్ట్రంలో మిగిలి ఉన్న మంత్రివర్గ విస్తరణపై కూడా ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన లంబాడీ, యాదవ సామాజిక వర్గాలకు మిగిలిన రెండు మంత్రి పదవులను కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ నాయకుల మధ్య పెరుగుతున్న ఈ విభేదాలు పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రజాప్రతినిధులు పరస్పరం బహిరంగ విమర్శలు చేసుకోవడం అధికార పార్టీ వర్గాల్లో కొత్త కలకలాన్ని రేపుతోంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది. జిల్లాల్లో అంతర్గత పొరపొచ్చులు తీవ్రతరం కాకుండా చూడటానికి పార్టీ పెద్దలు వెంటనే జోక్యం చేసుకుంటారా లేక సమన్వయం కుదురుస్తారా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. Mandula Samuel, Komatireddy Rajagopal Reddy, Telangana Congress News, Tungathurthi MLA, Nalgonda Politics

Publish Date: Jul 24, 2026 7:47PM

MOVIE NEWS