political-news-img

సీతారాం కేసుల్లో ట్విస్ట్...భర్త చనిపోయిన నెలరోజులకే ప్రియుడితో పెళ్లి

హైదరాబాద్‌ పరిధిలోని బాచుపల్లిలో జరిగిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సీతారాం ఆత్మహత్య కేసు రాష్ట్రవ్యా ప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో మరో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.. భర్త చనిపోయి కేవలం నెలరో జులు కూడా కాకముందుకే భార్య అందరికీ ఓ ట్విస్ట్ ఇచ్చింది... అది విన్న కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. మొదట సాధారణ కుటుంబ వివాదంగా భావించిన ఈ కేసు, తర్వాత బయటపడిన విషయాలతో ఒక్కొక్కటిగా కొత్త కొత్త మలుపులు తిరుగుతోంది. సీతారాం ఐటీ కంపెనీలో పనిచేస్తూ భార్య రేణుక, ఇద్దరు పిల్లలతో కలిసి బాచుపల్లిలో నివసించేవాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తన భార్యకు అనేక అక్రమ సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో సీతారాం తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఫిబ్రవరి నెలలో ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు. అయితే సీతారాం ఆత్మ హత్య చేసుకోబోయే ముందు ఒక 19 పేజీల సూసైడ్ నోట్ రాసి అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సూసైడ్ నోట్ ద్వారా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి... తన భార్యకు ఆరుగురు ప్రేమికులు ఉన్నారని అతను తన సూసైడ్ నోట్లో రాశాడు. ఈ విషయం తెలిసిన తర్వాత తన భార్యను పలుమార్లు మందలించానని అయినా కూడా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదని దీంతో విసుగు చెంది తాను ఆత్మహత్య చేసుకుంటున్నా నని సీతారాం తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. అయితే ఇదిలా ఉండగా ఈ కేసులో మరో ట్విస్ట్ బయటపడింది.. ఒకవైపు సాఫ్ట్వేర్ ఉద్యోగి సీతారాం మరణించడంతో కుటుంబ సభ్యులందరూ విషాదంలో మునిగిపోయారు. ఇక మరోవైపు భర్త సీతారాం చనిపోయి నెల రోజులు కూడా గడవక ముందే, మార్చి నెలలో రేణుక మరో వివాహం చేసుకుంది కుటుంబ సభ్యులకు ఎవరికి తెలియకుండా రహస్యంగా రేణుక తాను గాఢంగా ప్రేమిస్తున్న ప్రియుడిని పెళ్లి చేసుకుంది... ఈ విషయం బయటకు రావడంతో కేసు దిశ పూర్తిగా మారింది. పోలీసుల దర్యాప్తులో రేణుక తన మాజీ ప్రియుడు రమణారెడ్డిని వివాహం చేసుకున్నట్లుగా వెల్లడైంది. ఈ వివాహం త్వరగా జరగడం, అలాగే సీతారాం ఆత్మహత్యకు ముందు ఉన్న వివాదాల నేపథ్యంలో పోలీసులు ఈ కేసును అనుమానాస్పద మరణంగా పరిగణించి విచారణ వేగ వంతం చేశారు. సీతారాం కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు, సేకరించిన సాక్ష్యాలు, కాల్ డేటా, సందేశాలు తదితర వివరాల ఆధారంగా పోలీసులు కేసును లోతుగా పరిశీలించారు. దర్యాప్తులో బయటపడిన అంశాల ఆధారంగా బాచుపల్లి పోలీసులు రేణుకతో పాటు రమణారెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇంకా మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. సీతారాం ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, ఎవరి పాత్ర ఎంత ఉందన్న కోణంలో విచారణ కొనసాగుతోందని పోలీసులు చెప్తున్నారు. ఈ సంఘటన హైదరాబాద్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Publish Date: May 1, 2026 8:49PM

political-news-img

ట్రంప్ మానసిక స్థితి సరిగ్గానే ఉందా?

అమెరికా అధ్యక్షుడి మానసిక స్థితి సరిగ్గానే ఉందా.. అన్న అంశం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా అమెరికా పార్లమెంటులో రక్షణ మంత్రిని పీట్ హెగ్సెత్‌ను ను ఎంపీ సారా జాక్సబ్ ..మీ అధ్యక్షుడికి మతి స్థిమితం ఉందా? అని ప్రశ్నించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన పీట్ హెగ్సెత్ ఇలాంటి ప్రశ్న మీరు ఎప్పుడైనా యూఎస్ మాజీ ప్రెసిడెంట్ బైడెన్‌ను అడిగారా అంటూ ఎదురు దాడి చేశారు. దీనికి సారా జాకబ్స్ కూడా ఏడాదిన్నరగా అధ్యక్షుడిగా ఉంది ట్రంపే నంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం ముదురుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వ పటిమపై విపక్షాలు విరుచుకు పడుతున్నాయి. ముఖ్యంగా ఆయన సోషల్ మీడియా చేస్తున్న పోస్టులు, అర్ధరాత్రి పూట చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో 'ట్రంప్ మానసిక స్థితి అసలు నిలకడగానే ఉందా" అనే చర్చ తెరపైకి వచ్చింది. దీనిపై కాపిటల్ హిల్‌లో జరిగిన విచారణలో.. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌ను డెమోక్రాట్ ఎంపీలు నిలదీశారు. కాంగ్రెస్ విచారణలో డెమోక్రాట్ సభ్యురాలు సారా జాకబ్స్ నేరుగా రక్షణ మంత్రిని ..అమెరికా సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా వ్యవహరించేందుకు ట్రంప్ మానసిక స్థితి సరిగ్గా ఉందా? అని నిలదీశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన పీట్ హెగ్సెత్.. గత నాలుగేళ్లలో జో బైడెన్ విషయంలో ఎప్పుడైనా ఇలాంటి ప్రశ్నలు అడిగారా? అంటూ ఎదురుదాడికి దిగారు. దానికి జాకబ్స్ స్పందిస్తూ .. బైడెన్ ఇప్పుడు అధ్యక్షుడు కాదు. ఏడాదిన్నరగా ట్రంప్ అధికారంలో ఉన్నారని బదులిచ్చారు. దీనిపై మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన హెగ్సెత్.. తమ అధ్యక్షుడిని కించపరిచేలా అడిగే ఈ ప్రశ్నలకు తాను సమాధానం ఇవ్వనని, ఆయన సైన్యాన్ని అగ్రస్థానంలో నిలిపే గొప్ప నాయకుడని వెనకేసుకొచ్చారు. ఇరాన్‌తో శాంతి చర్చలు విఫలమవుతున్న తరుణంలో.. ట్రంప్ తన సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు అమెరికా ప్రజలను కలవర పెడుతున్నాయి. ఒక సందర్భంలో ఆయన.. "ఇరాన్ నా డిమాండ్లను అంగీకరించకపోతే.. నేటి రాత్రే వారి నాగరికత అంతమైపోతుంది" అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అంతేకాకుండా తనను తాను దైవంగా చిత్రించుకునేలా ఏఐ ద్వారా రూపొందించిన చిత్రాన్ని పోస్ట్ చేసి విమర్శల పాలయ్యారు. తన చేతుల నుంచి దివ్య కాంతి వస్తున్నట్లు ఉన్న ఆ ఫోటోను తర్వాత తొలగించిన ట్రంప్.. తాను ప్రజల కష్టాలు తీర్చే డాక్టరు లాంటి వాడినని సర్దిచెప్పుకున్నారు. ఆ క్రమంలో ట్రంప్ మెంటల్ బ్యాలెన్స్‌పై తిరిగి చర్చ మొదలవ్వడంప్రాధాన్యత సంతరించుకుంది.

Publish Date: May 1, 2026 8:26PM

political-news-img

సన్‌రైజర్స్ స్టార్ క్లాసెన్‌పై పీటర్శన్ అపార నమ్మకం

ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న హెన్రిచ్ క్లాసెన్ ప్రదర్శనపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ప్రశంసలు కురిపించాడు. ముంబై ఇండియన్స్‌పై క్లాసెన్ చేసిన అజేయ హాఫ్ సెంచరీ (30 బంతుల్లో 65) తర్వాత పీటర్సన్ సోషల్ మీడియా వేదికగా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకు ఒక విజ్ఞప్తి చేశాడు. 2027లో స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో సఫారీలు విజేతగా నిలవాలంటే, క్లాసెన్ వంటి ఆటగాడు జట్టులో ఉండాలని సూచించాడు. ఇందుకోసం క్లాసెన్ రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకునేలా అధికారులు ఒప్పించాలని కోరాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ పరుగులు వరద పారిస్తున్నాడు. ప్రతీ మ్యాచులోనూ పరుగులు చేస్తూ.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బుధవారం (29-4-26న)ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఈ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ 30 బంతుల్లోనే 65 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడిన క్లాసెన్.. సుమారు 60 సగటుతో 414 పరుగులు స్కోరు చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో ప్లేసులో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన హెన్రిచ్ క్లాసెన్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అప్పటి నుంచి కేవలం ఫ్రాంఛైజీ క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు.

Publish Date: May 1, 2026 8:16PM

political-news-img

సగర్వంగా నిల‘బడి’.. టెన్త్‌లో ప్రభుత్వ స్కూళ్ల ఘనత

మామూలుగా టెన్త్, ఇంటర్ వంటి రిజల్ట్స్ అంటే వార్తా పత్రికల్లో మరుసటి రోజంతా ఆ హడావుడే కనిపిస్తుంది. వార్తా పత్రికల ఫస్ట్ పేజీలో కార్పొరేట్ స్కూళ్ల ప్రకటనలు కనిపించడం సహజం. తమ స్కూల్ విద్యార్థులు సాధించిన మార్కులు, వచ్చిన ర్యాంకులతో యజమాన్యాలు ఫుల్ పేజీ యాడ్స్ ఇస్తుంటాయి. అయితే ఈసారి ఏపీలో టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చాక సరికొత్త ట్రెండ్ కనిపించింది. ఏపీ ప్రభుత్వమే పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను చేర్పించాలని కోరుతూ.. సర్కారు బడుల్లో చదివి స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్థుల ఫొటోలను ప్రచురించడం విశేషం ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలను గురువారం వెల్లడించారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా ఫలితాలను రిలీజ్ చేశారు. ఈ సంవత్సరం టెన్త్ క్లాసులో 85.15 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు సైతం కార్పొరేట్ స్కూళ్లలో చదువుతూన్న విద్యార్థులకు ధీటుగా మార్కులు సాధించారు. దీంతో ఏపీ ప్రభుత్వం, పాఠశాల విద్యా శాఖ.. సగర్వంగా నిల‘బడి’ అంటూ.. ప్రభుత్వ బడులను ప్రమోట్ చేస్తూ దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. సర్కారు బడుల్లో చదివినప్పటికీ స్టేట్ ర్యాంక్ స్థాయి మార్కులు సాధించిన విద్యార్థినీ విద్యార్థుల ఫొటోలు, వారు సాధించిన మార్కులు, చదువుకున్న పాఠశాల వివరాలను ఈ ప్రకటనలో ప్రచురించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన నలుగురు విద్యార్థినులకు ఏకంగా 596 మార్కులు రాగా.. 9 మంది 595 మార్కుల చొప్పున సాధించడం విశేషం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారిలో 13 మంచి ర్యాంకులు సాధిస్తే.. అందులో 12 మంది బాలికలే కావడం విశేషం. మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ.. ఇందుకు కారణమైన టీచర్లు, సిబ్బందికి విద్యాశాఖ ధన్యవాదాలు తెలిపింది. ‘అమ్మలా శిక్షణ.. నాన్నలా రక్షణ.. స్నేహపూర్వక బోధన.. ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించండి.. వారి బంగారు భవితకు బాటలు వేయండి’ అని ఏపీ విద్యా శాఖ పిలుపునిచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడానికి, విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దడానికి ఏపీ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోంది. కూటమి ప్రభుత్వం లెర్నింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (ఎల్ఈఏపీ) లాంటి కొత్త ప్రాజెక్టులతో విద్యా రంగం స్వరూపాన్ని మార్చేస్తోంది. విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఏఐ టెక్నాలజీ, డిజిటల్ టూల్స్ వినియోగంపై వర్క్ షాప్‌లు నిర్వహిస్తున్నారు. 2029 నాటికి విద్యారంగంలో ఏపీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో నారా లోకేశ్ ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారులు పని చేస్తున్నారు.

Publish Date: May 1, 2026 8:04PM

political-news-img

గ్లోబల్ ఇంధన రాజకీయాల్లో కొత్త శకం?!..

అంతర్జాతీయ చమురు రాజకీయాల్లో దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా వెలుగొందుతున్న ఒపెక్ కూటమికి కోలుకోలేని దెబ్బ తగిలింది. శుక్రవారం (మే1) నుంచి నుంచి ఒపెక్ కూటమి నుండి అధికారికంగా వైదొలగుతున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది కేవలం ఒక దేశం సభ్యత్వాన్ని వదులుకోవడం మాత్రమే కాకుండా, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో శక్తి సామర్థ్యాల మార్పుకు, అలాగే అమెరికన్ డాలర్ ఆధిపత్యం తగ్గుముఖం పట్టే అంటే డీ-డాలరైజేషన్ ప్రక్రియకు సంకేతంగా దీనిని నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఈ నిర్ణయం గల్ఫ్ ప్రాంతంలో కొత్త ఆర్థిక ధృవాల ఏర్పాటుకు దారితీసే అవకాశం ఉందంటున్నారు. యూఏఈ ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన ఆర్థిక కారణాలు కనిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా యూఏఈ తన చమురు ఉత్పత్తి సామర్థ్యాన్ని రోజుకు సుమారు 5 మిలియన్ బ్యారెళ్లకు పెంచుకోవడానికి భారీగా పెట్టుబడులు పెట్టింది. అయితే.. ఒపెక్ నిర్దేశించిన ఉత్పత్తి కోటాల వల్ల తన పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోలేకపోయింది. రోజుకు కేవలం 3.2 నుండి 3.5 మిలియన్ బ్యారెళ్లకు మాత్రమే పరిమితం కావాల్సి రావడం వల్ల ఆ దేశం ఆర్థికంగా నష్టపోతోంది. తన సొంత జాతీయ ప్రయోజనాల దృష్ట్యా.. మార్కెట్ స్వేచ్ఛను కోరుకుంటూ యూఏఈ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. మరోవైపు, హార్ముజ్ జలసంధి ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు కూడా యూఏఈని ప్రత్యామ్నాయాల వైపు నడిపించాయి. ఇరాన్ తీరం వెంబడి ఉండే ఈ కీలక మార్గంలో డ్రోన్ దాడులు, మిసైల్ ప్రయోగాలు చమురు సరఫరాకు నిరంతరం అడ్డంకులు సృష్టిస్తున్నాయి. ఒక దశలో యూఏఈ ఎగుమతులు భారీగా పడిపోవడం ఆ దేశాన్ని ఆందోళనకు గురిచేసింది. ప్రాంతీయ భద్రత, సరఫరా మార్గాల నిర్వహణలో ఒపెక్ లేదా గల్ఫ్ కూటములు ఆశించిన స్థాయిలో భరోసా ఇవ్వలేకపోవడంతో, యూఏఈ తనదైన శైలిలో స్వతంత్రంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. 1960లో ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, వెనిజులా కలిసి ఒపెక్ ను స్థాపించాయి. ఒపెక్ లక్ష్యం సభ్య దేశాల చమురు విధానాలను సమన్వయం చేయడం, ఉత్పత్తిని నియంత్రించి అంతర్జాతీయ మార్కెట్లో ధరలను స్థిరీకరించడం. 1967లో అబుదాబీ ఒపెక్ లో చేరింది. 971లో యూఏఈ ఏర్పడిన తర్వాత కూడా సభ్యత్వం కొనసాగింది. యూఏఈ,.. ప్రస్తుతం ఒపెక్ లో సౌదీ, ఇరాక్ తర్వాత మూడో అతిపెద్ద ఉత్పత్తిదారు, ప్రపంచ చమురు ఉత్పత్తిలో సుమారు నాలుగు శాతం వాటా కలిగిన దేశం. అటువంటి యూఏఈ ఇప్పుడు ఒపెక్ నుంచి బయటకు రావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అంతర్జాతీయంగా ఇప్పుడు అందరి దృష్టి పెట్రోడాలర్ వ్యవస్థపైనే ఉంది. సాధారణంగా చమురు వ్యాపారం డాలర్లలోనే జరుగుతుంది, ఇది అమెరికా కరెన్సీకి ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని డిమాండ్‌ను కల్పిస్తోంది. అయితే.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మారిన పరిస్థితుల్లో చమురు వ్యాపారాన్ని స్థానిక కరెన్సీల్లో రూపాయి, యువాన్, రూబుల్ జరపాలనే ప్రతిపాదనలు బలపడ్డాయి. యూఏఈ ఇప్పుడు ఒపెక్ కట్టుబాట్ల నుండి బయటకు రావడంతో, ఇతర దేశాలతో నేరుగా తమకు నచ్చిన కరెన్సీలో ఒప్పందాలు చేసుకునే అవకాశం ఏర్పడింది. ఇది దీర్ఘకాలంలో డాలర్ ఆధిపత్యానికి పెద్ద సవాలుగా మారవచ్చు. భారతదేశానికి యూఏఈ అత్యంత కీలకమైన భాగస్వామి. మన దేశానికి అవసరమైన చమురులో గణనీయమైన భాగం అక్కడి నుండే వస్తుంది. యూఏఈ స్వతంత్రంగా వ్యవహరించడం వల్ల భారత్ వంటి దేశాలకు కొన్ని ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. ముఖ్యంగా రూపాయి, దిర్హామ్ ఆధారిత వాణిజ్యం పెరగడానికి ఇది దోహదపడుతుంది. దీనివల్ల విదేశీ మారకద్రవ్య నిల్వలపై ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా.. ఒపెక్ నియంత్రణ లేకపోతే యూఏఈ నుండి పోటీ ధరలకు చమురు పొందే అవకాశం కూడా భారత్‌కు లభించవచ్చు. యూఏఈ నిష్క్రమణ వార్త వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల్లో భారీ మార్పులు రాకపోయినప్పటికీ, దీర్ఘకాలంలో మాత్రం ఒడిదుడుకులు తప్పవని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 110 డాలర్ల వద్ద స్థిరంగా ఉన్నప్పటికీ.. యూఏఈ తన ఉత్పత్తిని గరిష్ట స్థాయికి పెంచితే మార్కెట్లో సరఫరా పెరిగి ధరలు తగ్గే అవకాశం ఉంది. అయితే, సరఫరా మార్గాల్లోని భద్రతా సమస్యలు పరిష్కారం కానంత వరకు ఈ ధరల తగ్గింపు వినియోగదారులకు పూర్తిస్థాయిలో చేరకపోవచ్చు. సౌదీ అరేబియా నేతృత్వంలోని ఒపెక్ విధానాలకు యూఏఈ దూరం జరగడం గల్ఫ్ దేశాల మధ్య అంతర్గత విభేదాలను సూచిస్తోంది. ఇన్నాళ్లూ ఐక్యంగా నిర్ణయాలు తీసుకున్న గల్ఫ్ దేశాలు, ఇప్పుడు ఎవరి ఆర్థిక ప్రయోజనాల కోసం వారు విడివిడిగా అడుగులు వేయడం ప్రారంభించారు. ఇది కేవలం ఇంధన రంగానికి మాత్రమే పరిమితం కాకుండా, భవిష్యత్తులో రాజకీయ, రక్షణ రంగాల్లో కూడా కొత్త కూటముల ఏర్పాటుకు దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తానికి, యూఏఈ నిర్ణయం ప్రపంచ ఇంధన చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. చమురు ఉత్పత్తిదారుల గుత్తాధిపత్యాన్ని సవాలు చేస్తూ, ఒక దేశం తన సొంత అభివృద్ధి లక్ష్యాల కోసం అంతర్జాతీయ కూటమి నుండి బయటకు రావడం గమనార్హం. రాబోయే రోజుల్లో మిగిలిన ఒపెక్ దేశాలు ఎలా స్పందిస్తాయి? అమెరికా తన డాలర్ ఆధిపత్యాన్ని ఎలా కాపాడుకుంటుంది? భారత్ ఈ మార్పులను తనకు అనుకూలంగా ఎలా మలుచుకుంటుంది? అనే అంశాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. 21వ శతాబ్దపు ఇంధన ఆర్థిక వ్యవస్థలో ఇదొక కొత్త అధ్యాయం అనడంలో సందేహం లేదు. -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే https://www.teluguone.com ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.

Publish Date: May 1, 2026 6:47PM

political-news-img

ఓఆర్ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురు మృతి

శంషాబాద్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఒక కార్‌లో ఏడుగురు వ్యక్తులు సరదాగా మాట్లాడుకుంటూ వస్తున్న సమయంలో శంషాబాద్ సమీపంలోని ఆర్ఆర్ ఎగ్జిట్ 16 వద్ద ఆగి ఉన్న లారీని అత్యంత వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీ కొట్టారు. దీంతో కారు మొత్తం ధ్వంసం అయింది. TS23F2298 గల కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఢీ కొట్టిన తీవ్రత ఎక్కువగా ఉండడంతో కారులోపల ప్రయాణం చేస్తున్న ఆరుగురి వ్యక్తులు రోడ్డుమీద చెల్లా చెదురుగా పడిపోయి ప్రాణాలు కోల్పోయారు.. అది చూసిన వాహనదారులు భయభ్రాంతులకు గురై వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న ఔటర్ రింగ్ రోడ్డు సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. తీవ్ర గాయాలైన వ్యక్తిని సమీపంలోని హాస్పిటల్ కి తరలించారు. కానీ అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వైద్యులు వెల్లడించారు. ప్రమాదంలో మృతి చెందిన ఆరు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. ప్రాథమిక విచారణలో డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రైవర్ కునుకు పట్టడంతో ముందు ఉన్న లారీని గుర్తించలేక ఢీకొట్టినట్లుగా భావిస్తున్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. ఈ ఘటనను చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు..

Publish Date: May 1, 2026 6:46PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img