యూపీఐ యూజర్లకు షాక్ తప్పదా? MDR ఛార్జీలు, కేంద్ర బిల్లుపై RBI క్లారిటీ!
Publish Date:Aug 7, 2026
Advertisement
దేశంలో ప్రతి చిన్న లావాదేవీకి డిజిటల్ విధానంలో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్లను ఉపయోగించడం నిత్యకృత్యంగా మారింది. సాధారణ టీ కొట్టు నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాళ్ళ వరకు రూపాయి నుంచి లక్షల రూపాయల వరకు చెల్లింపులు చిటికెలో జరిగిపోతున్నాయి. అయితే, గత కొంతకాలంగా యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు పడతాయా, ఒకవేళ పడితే ఆ భారాన్ని ఎవరు మోస్తారు అనే చర్చ దేశవ్యాప్తంగా తీవ్రంగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నూతన బిల్లు నేపథ్యంలో ఈ సందేహాలు మరింతగా ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆర్థిక, బ్యాంకింగ్ రంగాలలో తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో 'పన్నులు, ఇతర చట్టాల (సవరణ) బిల్లు, 2026'ను ప్రవేశపెట్టిన మరుసటి రోజే ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ అంశంపై స్పందించడం గమనార్హం. చెల్లింపుల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి మరియు ఏ ఎలక్ట్రానిక్ చెల్లింపు పద్ధతులు ఉచితంగా ఉండాలో నిర్ణయించే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మరింత విచక్షణాధికారాన్ని కల్పించేలా ఈ బిల్లును రూపొందించారు. ఈ నేపథ్యంలో యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) ఛార్జీలను అనుమతిస్తే ఆ భారాన్ని ఎవరు మోయాలనే ప్రశ్నకు సంజయ్ మల్హోత్రా స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. "ఇప్పుడే దీని గురించి మాట్లాడటం చాలా తొందరపాటు అవుతుంది, కానీ ఆ ఖర్చులను ఎవరో ఒకరు భరించాల్సిందే" అని ఆయన అభిప్రాయపడ్డారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ నిరంతరం సమర్థవంతంగా నడవాలంటే దానికి అయ్యే ఖర్చులను ఎవరో ఒకరు ఖచ్చితంగా భరించాల్సిందేనని ఆర్బీఐ గవర్నర్ వివరించారు. సాధారణ వినియోగదారులపై ఈ భారం నేరుగా పడుతుందా అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ప్రత్యేక లావాదేవీ రుసుముగా ఇది స్పష్టంగా కనిపించనప్పటికీ, చెల్లింపు మౌలిక సదుపాయాల నిర్వహణ కోసం వినియోగదారులు ఇప్పటికే ఏదో ఒక రూపంలో పరోక్షంగా చెల్లిస్తూనే ఉన్నారని స్పష్టం చేశారు. అయితే ఈ ఛార్జీల భారాన్ని కేవలం ఒకే వర్గంపై వేయకుండా, ప్రభుత్వం, వ్యాపార సంస్థలు లేదా విస్తృత ఆర్థిక వ్యవస్థ పంచుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అత్యంత సురక్షితమైన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో నిరంతరం పెట్టుబడులు పెట్టడం, ఆ మౌలిక సదుపాయాల ఖర్చులకు అవసరమైన నిధులను ఎలా సమకూర్చాలో నిర్ణయించడమే తమ ప్రధాన ప్రాధాన్యత అని ఆయన తేల్చి చెప్పారు. ప్రస్తుతానికి వినియోగదారులకు కానీ, వ్యాపారులకు కానీ లేదా ఏ కేటగిరీ యూపీఐ లావాదేవీలపైనా ఎలాంటి రుసుములను లేదా ఛార్జీలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదని స్పష్టమవుతోంది. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 'పన్నులు, ఇతర చట్టాల (సవరణ) బిల్లు, 2026'లో యూపీఐ గురించిన ప్రత్యక్ష ప్రస్తావన గానీ, ఎండీఆర్ రేట్ల నిర్ధారణ గానీ లేదా రూ. 2,000 పరిమితి నిర్ణయం గానీ జరగలేదని నిపుణులు గుర్తు చేస్తున్నారు. సాధారణంగా మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) అంటే ఒక డిజిటల్ లావాదేవీని ప్రాసెస్ చేసి పూర్తి చేసే బ్యాంకుకు లేదా చెల్లింపు సేవా సంస్థకు వ్యాపారి చెల్లించే రుసుము. నిర్వచనం ప్రకారం ఇది చెల్లింపులు చేసే సాధారణ వినియోగదారుడిపై నేరుగా విధించే ఛార్జ్ కాదని పేర్కొన్నారు. rbi sanjay malhotra on upi mdr charges,will upi payments be charged in india.
http://www.teluguone.com/news/content/upi-transaction-charges-rbi-governor-statement-36-228252.html





