పీఆర్సీ పంచ్.. జగన్పై షర్మిల సంచలనం.. కేసీఆర్పై ధర్మయుద్ధం.. టాప్న్యూస్@7pm
Publish Date:Jan 7, 2022
Advertisement
1. పీఆర్సీ విషయంలో ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీవ్ర నిరాశ మిగిల్చింది. ఫిట్మెంట్ 23 శాతంగానే ప్రకటించింది. కొత్త జీతాలు 2022 జనవరి 1 నుండి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే 27 శాతం ఐఆర్ తీసుకుంటున్నామని.. ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ తీసుకోవాలా? అని ప్రశ్నిస్తున్నారు. 2. పీఆర్సీలో ప్రభుత్వం హెచ్ఆర్ఏ ఊసెత్తలేదు. హెచ్ఆర్ఏ తగ్గించాలని ఇప్పటికే సీఎస్ కమిటి సిఫార్స్ చేసింది. సీసీఏ (సిటి కాంపెన్సేటరి ఎలవెన్స్) గురించి ప్రభుత్వ ప్రస్తావించలేదు. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు అడిషనల్ క్వాంటం పెన్షన్పై స్పష్టత లేదు. 3. ప్రజలెవరూ ఓటీఎస్ కట్టొద్దని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేస్తే చెల్లదని, ఆ పేపర్లు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావని చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఇంటి పట్టాలను రిజిస్టేషన్ చేసి ఇస్తానని తెలిపారు. ఈ ప్రభుత్వానికి రంగులపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని తప్పబట్టారు. 4. పంజాబ్లో ప్రధాని నరేంద్ర మోదీకి ఎదురైన సంఘటన దురదృష్టకరమైనదని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రధాని ప్రయాణంలో 20 నిమిషాలు ముందుకు వెళ్లలేక రహదారిపైనే కారు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడడం అవాంఛనీయమన్నారు. ప్రజాస్వామ్య దేశంలో నిరసన వ్యక్తం చేయడం ప్రజల హక్కే అయినప్పటికీ ప్రధాని భద్రతకు ఇబ్బంది కలిగేలా నిరసన ఉండకూడదని పవన్ కల్యాణ్ అన్నారు. 5. ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టడంపై షర్మిల మరోసారి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. "ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టొచ్చు.. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు.. అధికారంలో ఉన్న వారు ఎప్పటికీ అధికారంలో ఉండలేరు.. అలా అనుకుంటే మూర్ఖత్వం. పాలిటిక్స్ అంటే.. అప్స్ అండ్ డౌన్స్" అంటూ మళ్లీ కలకలం రాజేశారు షర్మిల. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను, జగన్ను ఉద్దేశించే అంటున్నారు. 6. వారం రోజులు గడువు ఇస్తున్నా.. తనపై అనర్హత వేటు వేయాలని వైపీపీని ఛాలెంజ్ చేశారు రఘురామ. ఈ వారం తనపై వేటు వేయలేకపోతే.. ఆ తర్వాత తానే తన పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రకటించారు. ఎన్నికలకు వెళ్లి.. వైసీపీపై ఎంత వ్యతిరేకత ఉందో తెలియజేస్తానని రఘురామ సవాల్ చేశారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలించేందుకు, రాజధానిగా అమరావతే కొనసాగేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు రఘురామ చెప్పారు. 7. కేసీఆర్ పాలనను తరిమికొట్టేందుకు ధర్మయుద్ధం ప్రారంభమైందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తాము ఎవరికీ భయపడేది లేదని, జైలుకెళ్లడం ఇది తొమ్మిదోసారని చెప్పారు. సీఎం కేసీఆర్ నిరుద్యోగులు, ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నారని మండిపడ్డారు. కేసులు, అరెస్టులను ముఖ్యమంత్రి నమ్ముకుంటే.. జైళ్లను ఉద్యమాలకు అడ్డాగా మార్చుకుంటామని హెచ్చరించారు బండి సంజయ్. 8. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిరికివాడని.. ఇలాంటి సీఎంను తానెక్కడా చూడలేదని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఉద్యమిస్తే భయపడి.. అక్రమంగా, దౌర్జన్యంగా అరెస్టు చేసి జైల్లో వేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్కు కలలో కూడా బండి సంజయ్ గుర్తొస్తున్నారన్నారు. "కేసీఆర్.. నేను కూడా సీఎంనే. నువ్వు రెండోసారి సీఎం కావొచ్చు.. నేను నాలుగోసారి సీఎం. అయినా, మీలాగా సంస్కార హీనంగా వ్యవహరించడం లేదు. బీజేపీ అంటే బిర్యానీ అనుకున్నారా?" అంటూ మండిపడ్డారు సీఎం శివరాజ్సింగ్ చౌహాన్. 9. తనపై జరిగిన దాడి పోలీసుల సహాయంతో జరిగిందని వైసీపీ నేత సుబ్బారావు గుప్తా ఆరోపించారు. తనపై దాడి జరిగిన ఘటనపై సీఐడి విచారణ జరిపి.. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. త్వరలో జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అమిత్ షాని కలుస్తానని.. అప్పటికీ న్యాయం జరగకపోతే వేరే రాష్ట్రం వెళ్లి బతుకుతానన్నారు సుబ్బారావు గుప్తా. 10. భారత్లో కొవిడ్ వ్యాక్సినేషన్ కీలక మార్క్కు చేరుకుంది. ఇప్పటి వరకూ 150 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 94 లక్షల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు తెలిపింది.
http://www.teluguone.com/news/content/top-news--7pm-39-129835.html





