బ్యానర్ పట్టిన బాబు.. అచ్చెన్న విజయం.. దిగొచ్చిన దొర.. టాప్ న్యూస్@1PM
Publish Date:Nov 18, 2021
Advertisement
ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు వీడాలంటూ టీడీపీ శాసన సభ్యులు నినాదాలు చేపట్టారు. నిరసన ప్రదర్శనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, శాసనసభ్యులు బ్యానర్ పట్టుకుని అసెంబ్లీ వరకు పాదయాత్రగా వచ్చారు. ఈ సందర్భంగా భారంగా మారిన పెట్రో ధరలు తగ్గించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయన్నారు. జగన్ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్తపై పన్ను వేసిన చెత్త ప్రభుత్వం అంటూ టీడీపీ అధినేత మండిపడ్డారు
---------
ఏపీ శాసన మండలి బీఏసీలో గందరగోళం పరిస్థితి నెలకొంది. శాసన మండలి, శాసన సభ నిర్వహణపై చెరో రకమైన నిర్ణయం వెలువడింది. ఈ నెల 26 వరకు శాసన సభ ఉంటుందని అసెంబ్లీ బీఏసీ నిర్ణయం తీసుకోగా... శాసన మండలి ఒక్కరోజు మాత్రమే అని మండలి బీఏసీలో ప్రకటించారు. ఇందుకు నిరసనగా మండలి బీఏసీ నుంచి కౌన్సిల్ ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు వాక్ ఔట్ చేశారు
------
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఈ కేసులో కీలక అనుమానితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సన్నిహితుడు, వైసీపీ నేత, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ హైదరాబాద్ లో అరెస్ట్ చేసింది. బుధవారం శివశంకర్ రెడ్డిని అదుపులోనికి తీసుకున్న సీబీఐ.. ఉస్మానియాలో వైద్యపరీక్షల తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచింది. తర్వాత ట్రాన్సిట్ వారెంట్పై శివశంకర్రెడ్డిని కడపకు తరలించింది సీబీఐ
--------
అసెంబ్లీ ముట్టడికి పలువురు టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు యత్నించారు. అసెంబ్లీ ప్రధాన మార్గం వరకూ వచ్చి నినాదాలు చేశారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుంటే నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు లేదా అని మండిపడ్డారు. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను నాశనం చేసే ప్రభుత్వ జీవోలు 42 ,50, 51 లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
------
ప్రధాని మోదీ దేశాభివృద్ధిని అమ్ముకుంటున్నారని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ విమర్శలు గుప్పించారు. బీజేపీ పాలనలో పెట్రోల్, డీజీల్, నిత్యావసర వస్తువుల ధరలు పెరగటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రధాని మోదీ 16 వేల కోట్లు ఖర్చు చేసి రెండు విమానాలు కొనుగోలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత దేశంలో సోషలిజాన్ని అమ్మి.... క్యాప్టలిజాన్ని మోదీ ప్రోత్సహిస్తున్నారని వ్యాఖ్యానించారు.
----------
తెలంగాణ ముఖ్యమంత్రి రోడ్డెక్కారు. రైతుల కోసమంటూ ధర్నాకు దిగారు. వరి ధాన్యం విషయంలో కొన్ని రోజులుగా కేంద్రంతో పోరాటం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అధికార పార్టీగా ఉండి కూడా ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. తాజాగా ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరి స్పష్టం చేయాలంటూ అధికార టీఆర్ఎస్ పార్టీ వద్ద మహాధర్నాకు దిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు.
---
మహాదర్నాలో మోడీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కేసీఆర్. కేంద్రం తన విధానాలను మార్చుకోవాలన్న డిమాండ్తో ఈ యుద్ధాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఈ యుద్ధం ఒక్కరోజుతో ఆగేది కాదు.. ఇది ఆరంభం మాత్రమేనని హెచ్చరించారు. వరి కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద్వ ప్రమాణాలను నిరసిస్తూ మహా ధర్నాకు దిగినట్టు కేసీఆర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.
---
వరి పండించిన రైతుల పరిస్థితి అత్యంత దయనీయమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మాది కాదు అంటే మాది కాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పించుకుంటున్నాయని మండిపడ్డారు. కేంద్రం ప్రకటించిన 13 మద్దతు ధర పంటల్లో వరి కూడా ఉందని తెలిపారు. మద్దతు ధర ప్రకటించడం అంటే ప్రభుత్వం కొనుగోలు చేయడం అని అర్థమన్నారు. ఇప్పటి వరకు 11 లక్షల క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని చెప్పారు
----
పది నెలల్లో బీజేపీ ఎమ్మెల్యే ప్రతాప్ భీల్ పై రెండుసార్లు అత్యాచారం కేసులు నమోదు అయిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగుచూసింది. ప్రతాప్ భీల్ రాజస్థాన్ రాష్ట్రంలోని గోగుండా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే.రెండు సందర్భాల్లోనూ ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చి, పెళ్లి సాకుతో మహిళలపై ఎమ్మెల్యే ప్రతాప్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉద్యోగం ఇప్పిస్తానని ప్రతాప్ భీల్ తనపై అత్యాచారం చేశాడని తాజాగా ఓ మహిళ అంబామాత జిల్లా ఎస్పీని ఆశ్రయించింది.
---
పోక్సో చట్టం కింద లైంగిక వేధింపుల నేరం కేసులో ‘స్కిన్-టు-స్కిన్’ కాంటాక్ట్ తప్పనిసరి అని బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టి వేసింది.స్పర్శ అనే పదాన్ని ‘స్కిన్-టు-స్కిన్’ కాంటాక్ట్కి పరిమితం చేయడం సంకుచితమైన, అసంబద్ధమైన వివరణకి దారి తీస్తుందని,చట్టం యొక్క ఉద్దేశాన్ని నాశనం చేస్తుందని న్యాయమూర్తులు జస్టిస్ లలిత్, ఎస్ రవీంద్ర భట్, బేలా త్రివేదిలతో కూడిన సుప్రీం ధర్మాసనం పేర్కొంది.
http://www.teluguone.com/news/content/top-news-25-126612.html