మేళ తాళాలతో మద్యం షాపుకు ఎమ్మెల్యే.. జగనన్న పాలనలో వెరైటీ సీన్?
Publish Date:Nov 18, 2021
Advertisement
అంచలవారీగా సంపూర్ణ మధ్య నిషేధం, ఇదీ వైసీపీ ఇచ్చిన హామీ ... పాదయాత్ర ప్రతి అడుగులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు, బామ్మలు తెలుగింటి ఆడపడుచులు అందరికీ పేరుపేరున ఇచ్చిన హామీ. మాట తప్పను,మడమ తిప్పను అంటూ మహిళలకు ఇచ్చిన హామీ. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట, మడమే కాదు, మొత్తంగా మధ్య నిషేధం హమీనే జగన్ రెడ్డి ప్రభుత్వం తలకిందులు చేసింది. పాలసీని మార్చేసింది. మద్యంపై వచ్చే ఆదాయమే ఆర్థిక వ్యవస్థకు ఆధారంగా మద్యం విధానాన్ని మార్చేసింది. ఇచ్చిన హామీకి విరుద్ధంగా అంచలంచెలుగా మద్యం ఆదాయాన్ని పెంచుకుంటూ పోవడం వైసీపీ ప్రభుత్వం నూతన విధానంగా ప్రకటించి, అమలు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలో మద్యం షాపుల సంఖ్య తగ్గించి, అంచెలవారీ మధ్య నిషేధంలో తొలి ముందడుగు పడిందని, ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్పుకున్నారు. కానీ, నెలరోజుల క్రితం ప్రకటించిన కొత్త మద్యం పాలసీలో, షాపుల సంఖ్యను యధాతధంగా కొనసాగించాలని, నిర్ణయించింది. అంతే కాదు అది చాలదు అన్నట్లుగా, గతంలో ప్రకటించిన వాకిన్ స్టోర్స్ను విధానాన్ని కొనసాగించాలని, అందుకు అడనంగా టూరిజం సెంటర్లలో లిక్కర్ అవుట్ లెట్స్ తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరోవంక, మద్యం విక్రయాల ద్వారా గత ఏడాది 18 వేల కోట్ల రూపాయాలకు పైగా ఆదాయం రాగా.. ఈ సారి అది 20 వేల కోట్ల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ అన్నింటినీ మించి మద్యం అమ్మకాలపై వచ్చే రేపటి ఆదాయాన్నిఈ రోజే తాకట్టు పెట్టి 15 ఏళ్ల పాటు రాష్ట్రంలో మద్యం అమ్మకాలు దిగ్విజయంగా కొనసాగిస్తామన్న హామీతో రూ. 25 కోట్లు అప్పుతెచ్చుకుని పబ్బం గడుపుకుంటోంది వైసీపీ ప్రభుత్వం. అంతే కాదు, ఇదే ఖాతాలో ఇంకొంత అప్పు తెచ్చుకునేందుకు ఇటీవల కొత్త ఆలోచనలు కూడా చేసింది. మద్యంపై విధిస్తున్న ‘వ్యాట్’ ఆదాయాన్ని ప్రభుత్వం రెండు ముక్కలు చేసింది. రాష్ట్ర ఖజానాకు రావలసిన వాటాకు గండి కొట్టి, బేవరేజెస్ కార్పొరేషన్ ఆదాయం పెంచే విధంగా వ్యాట్ ఆదాయాన్ని పంకాలు చేసింది.దీంతో అంచెలవారీ మద్య నిషేధాన్ని ప్రభుత్వం దిగ్విజయంగా అటకెక్కించిందని వేరే చెప్పనక్కరలేదు. జగన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్నిమధ్యాంద్ర ప్రదేశ్’ గా మారుస్తున్న తీరు పట్ల ప్రజలు, ప్రతిపక్షలు ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారు. రాష్ట్రంలో వినూత్న నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా జగన్ రెడ్డి ప్రభుత్వం బండారాన్ని బయట పెట్టేందుకు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మేళ, తాళాలతో లిక్కర్ మాల్లోకి వెళ్లారు. అక్కడ ఉన్న స్టాక్ను పరిశీలించారు. అనంతరం ఆ మాల్లో పనిచేస్తున్న సిబ్బందికి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. మద్యం మరింత అందుబాటులోకి తెచ్చేందుకు.. షాపుల్ని పెంచడమే కాకుండా మాల్ను పాలకొల్లులో ప్రారంభించారని ఎద్దేవా చేశారు. ఇదేనా మద్యపాన నిషేధమా అని ప్రశ్నించారు. అందుకే సిబ్బందిని సన్మానించినట్లు చెప్పుకొచ్చారు. మూడేళ్లు గడుస్తున్నా షాపుల్ని పెంచి మాల్స్ పెంచడం మద్య నిషేధమా అంటూ ప్రశ్నించారు రామానాయుడు. ఇప్పుడు ఈ వీడియొ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే, రాబోయే 15 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మద్యంపై ఎంత ఆదాయం వస్తుందో చూపించి.. జగన్ రెడ్డి ప్రభుత్వం రూ.25వేల కోట్లు అప్పులు తెచ్చుకుందని, ఆ అప్పు తీర్చడం కోసం రాబోయే 15 ఏళ్లు మద్యం తాగించడం ప్రభుత్వ ఉద్దేశమా అని ప్రశ్నించారు. అప్పు తీర్చడానికి మహిళల తాళిబొట్లు తాకట్టు పెట్టడం మద్యపాన నిషేధమా అన్నారు. రాష్ట్రంలో పిచ్చి బ్రాండ్లు తయారు చేసి అమ్ముతున్నారని.. నాలుగు రెట్లు ధరలు పెంచి పేదల జేబుల కొట్టడమే కాకుండా.. వారి ఆరోగ్యాన్ని హరించడం నిషేధమా అంటూ జగన్ సర్కార్’కు ప్రశ్నలు సంధించారు. అయితే ఇంతటితో జగన్ ప్రభుత్వం మత్తు దిగుతుందా అంటే అనుమానమే ...
http://www.teluguone.com/news/content/tdp-mla-rama-naidu-fecilitate-wine-shop-employes-25-126610.html