ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు పైగానే..!
Publish Date:Apr 15, 2026
Advertisement
ఈ వేసవి తెలుగు రాష్ట్రాలను నిప్పుల గుండంగా మారుస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ నెల 19 నుండి వచ్చే నెల 31 వరకు ఎండల తీవ్రత విపరీతంగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయికి చేరుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 50 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈ సమయంలో సూర్యుడి నుండి వెలువడే అతినీలలోహిత కిరణాల ప్రభావం భూమిపై నేరుగా పడే అవకాశం ఉన్నందున, చర్మ సంబంధిత వ్యాధులు రావడమే కాకుండా, వడదెబ్బ తగిలే ప్రమాదం కూడా ఉంది కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైనా లేదా నీరసంగా అనిపించినా తక్షణమే వైద్యులను సంప్రదింలని చెబుతున్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో వాహనదారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కార్లలో గ్యాస్ లైటర్లు, పెర్ఫ్యూమ్ బాటిళ్లు, బ్యాటరీలు లేదా కార్బోనేటెడ్ డ్రింక్స్ ఉంచడం చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. అధిక వేడి వల్ల ఇవి పేలిపోయే అవకాశం ఉంది. అలాగే వాహనాల్లో ఇంధనాన్ని పూర్తిగా నింపకుండా కొంత ఖాళీ ఉంచడం, టైర్లలో గాలి మరీ ఎక్కువగా లేకుండా చూసుకోవడం అవసరమని చెబుతున్నారు. ఇళ్లలో ఉండేవారు గదుల్లో గాలి ధారాళంగా ఆడేలా కిటికీలు తెరిచి ఉంచాలనీ, అలాగే విద్యుత్ పరికరాలపై లోడ్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలనీ సూచిస్తున్నారు. ఇక పోతే గ్యాస్ సిలిండర్లను నేరుగా సూర్యరశ్మి పడే చోట ఉంచకూడదు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చల్లని పానీయాలైన మజ్జిగ, నిమ్మరసం వంటివి తీసుకోవడం ద్వారా డీహైడ్రుషన్ ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశాలుంటాయి. ఇక పెంపుడు జంతువుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు ఏసీలను 24-25 డిగ్రీల వద్ద ఉంచుకోవడం వల్ల విద్యుత్ ఆదా అవడమే కాకుండా ఆరోగ్యం కూడా దెబ్బతినదు. రాబోయే రెండు నెలలు భానుడి ప్రతాపం అధికంగా ఉంటుంది కనుక అందరూ జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/this-summer-temparatures-above-50-degrees-36-217380.html





