గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల మొదటి తేదీన జీతాలు : సీఎం రేవంత్
Publish Date:May 26, 2026
Advertisement
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని 50 వేల మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెలా మొదటి తేదీననే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఐఏఎస్ అధికారులకు సమయానికి జీతాలు అందినట్లే గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా ఆలస్యం లేకుండా జీతాలు చెల్లించాలని పేర్కొన్నారు. సిబ్బంది జీతాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెల రూ.50 కోట్లు ప్రత్యేకంగా విడుదల చేస్తామని వెల్లడించారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ అనే తేడా లేకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగులకు మొదటి తేదీననే వేతనాలు అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఉద్యోగుల జీతాలు ఒక్కరోజు ఆలస్యమైనా సహించేది లేదని స్పష్టం చేశారు.గ్రామపంచాయతీల స్వంత ఆదాయాలపై వాటి స్వతంత్రతను దెబ్బతీసేలా గత ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనను రద్దు చేసి, పాత విధానాన్ని పునరుద్ధరించేందుకు సీఎం అంగీకారం తెలిపారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018లోని సెక్షన్ 70(3)లో సవరణలు చేసి, గ్రామపంచాయతీల స్వంత ఆదాయాన్ని ట్రెజరీ ఖాతాల్లో కాకుండా బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెన్షన్ల పంపిణీ విధానంపై కూడా సీఎం కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం పోస్టల్ శాఖ ద్వారా అందిస్తున్న పెన్షన్లను ఇకపై నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించారు. అర్హులకే పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని, ఓటర్ ఐడీ, ఆధార్, SEEEPC డేటా ఆధారంగా పెన్షన్ వ్యవస్థను మరింత పారదర్శకంగా, క్రమబద్ధంగా రూపొందించాలని సూచించారు. కొత్తగా మంజూరు చేసే పెన్షన్లలో ఒంటరి మహిళలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం అధికారులకు ఆదేశించారు.
http://www.teluguone.com/news/content/telangana-panchayat-raj-36-220968.html




