తెలంగాణ కొత్త సీఎస్గా సంజయ్ జాజు!
Publish Date:Jun 24, 2026
Advertisement
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియామకం దాదాపు ఖరారైంది. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయనను, తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా రిలీవ్ చేసింది. ప్రస్తుత సీఎస్ కె. రామకృష్ణారావు పదవీ కాలం ఈ నెల 30తో ముగియనున్న సంగతి తెలిసిందే. దీంతో.. అదే రోజున సంజయ్ జాజు నూతన సీఎస్గా బాధ్యతలు చేపట్టనున్నారని విశ్వసనీయ సమాచారం. 1992 బ్యాచ్, తెలంగాణ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన సంజయ్ జాజు.. దాదాపు 13 ఏళ్లు కేంద్ర సర్వీసుల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శిగా, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (కార్యదర్శిగా కీలకమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. ప్రస్తుత సీఎస్ కె. రామకృష్ణారావు పదవీ విరమణకు సరిగ్గా వారం రోజుల ముందు ఆయనను సొంత కేడర్కు పంపుతూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో సంజయ్ జాజు తెలంగాణ సీఎస్ గా బాధ్యతలు చేపట్టడం ఖాయమని తేలిపోయింది. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు సంజయ్ జాజును ఆయన సొంత కేడర్కు తిరిగి పంపేందుకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపిందని కేంద్ర ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. గతంలో సంజయ్ జాజు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్గా, అప్పటి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేశారు. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీనియర్ అధికారులు జయేష్ రంజన్, వికాస్ రాజ్ వంటి వారి పేర్లను పక్కన పెట్టి మరి సంజయ్ జాజు వైపు మొగ్గు చూపడానికికారణం.. సంజయ్ జాజుకు కేంద్రంలో ఆయనకున్న విస్తృత అనుభవం, ఢిల్లీ స్థాయిలో ఉన్న పలుకుబడి అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, కొత్త విమానాశ్రయాల అభివృద్ధి, ఫ్యూచర్ సిటీ వంటి మెగా ప్రాజెక్టులకు కేంద్రం నుంచి త్వరితగతిన అనుమతులు, భారీగా నిధులు సాధించాలంటే కేంద్ర మంత్రిత్వ శాఖలతో సమన్వయం అవసరమని భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. సంజయ్ జాజుకున్న సుదీర్ఘ అనుభవం, అక్కడి పనివిధానంపై అవగాహన ఉన్న సంజయ్ జాజువైపు మొగ్గు చూపారని చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/telangana-new-cs-sanjayjaju-36-223977.html





