టీ-బిల్లుపై చర్చలేకుండా గ్రీన్ సిగ్నల్
Publish Date:Jan 2, 2014
Advertisement
కాంగ్రెస్ ప్రభుత్వం తన రాజకీయ లబ్దికోసం రాష్ట్ర విభజనపై ఏవిధంగా వ్యవహరించినప్పటికీ, రాష్ట్రపతి బిల్లుపై చర్చకు రాష్ట్ర శాసనసభకు 40రోజులు గడువు ఇచ్చి రాజ్యాంగ బద్దంగా వ్యవహరించారు. కానీ మన ప్రజా ప్రతినిధులు తమ పార్టీ ప్రయోజనాల కోసం సభ జరగనీయకుండా అడ్డుపడుతూ ఆయనిచ్చిన ఈ అమూల్యమయిన అవకాశాన్ని పూర్తిగా దుర్వినియోగం చేయడమే కాకుండా, బిల్లులో ఉన్న అనేక లోపాలను క్షుణ్ణంగా చర్చించి, వాటికి పరిష్కారం చూపకుండా చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. కానీ, వారు సభ సజావుగా జరిగేందుకు సహకరించకపోయినా, మీడియా ముందుకు వచ్చి సభలో బిల్లుపై చర్చ జరగాలని గట్టిగా కోరుకొంటునట్లు చెపుతుంటారు. అయితే అందుకు సభలో మిగిలినవారు సహకరించడం లేదని, స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరిచడం లేదని ఇతరులను నిందిస్తూ సభలో తాము మాత్రమే చాలా బాధ్యాతాయుతంగా వ్యవహరించినట్లు భుజాలు చరుచుకోవడం కూడా మరిచిపోరు. మొత్తం మీద ఉభయ సభలలో రాష్ట్ర విభజన బిల్లుపై మొదటి మూడు నాలుగు రోజుల్లో చర్చ జరగడం అనుమానమే. ఆ తరువాతయినా జరుగుతుందని గ్యారంటీ ఏమీ లేదు కూడా. సమావేశాలు మొదలయిన తరువాత మారే పరిస్థితులను బట్టి, ఎప్పటికప్పుడు పార్టీలు తమ వ్యూహాలు కూడా మార్చుకొంటూ జనవరి23వరకు రోజులు దొర్లించేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉభయసభలలో ప్రజాప్రతినిధులు తమకూ, తమ పార్టీకి లబ్ది చేకూరేవిధంగా మాత్రమే వ్యవహరిస్తారు. ఒకవేళ బిల్లుపై చర్చ జరిగే పరిస్థితి ఏర్పడితే, దానిని నేతలు గంటల కొద్దీ ఉపన్యాసాలు చేసి విలువయిన ఆ కొద్దిపాటి సమయాన్ని కూడా హరించివేస్తారు. తద్వారా అనేక కీలక అంశాలపై తమ పార్టీ అభిప్రాయాలు చెప్పకుండా తప్పించుకొనే వీలు కలుగుతుంది. బిల్లుపై చర్చ జరిగినా, జరుగకపోయినా రాష్ట్రపతి ఇచ్చిన గడువు-జనవరి23నే శాసనసభ సమావేశాలు కూడా ముగుస్తాయి గనుక, ఆరోజున బిల్లు రాష్ట్రపతికి తిరిగి వెళ్ళిపోవడం ఖాయం. బిల్లుపై ఎటువంటి చర్చ జరుగకపోతే, దానిపై ఎటువంటి అభ్యంతరాలు కూడా ఉండవు గనుక, దానిపై రాష్ట్రపతి ఆమోద ముద్రవేసి కేంద్ర క్యాబినెట్ కు పంపేస్తారు. రాష్ట్ర శాసనసభలో టీ-బిల్లుపై ఎటువంటి అభ్యంతరాలు, అవాంతరాలు లేకుండా చేసి రాష్ట్రపతి ఆమోదం పొందేలా చేయడానికి బహుశః కాంగ్రెస్ అధిష్టానమే ముఖ్యమంత్రి మరియు టీ-కాంగ్రెస్ నేతల ద్వారా సభలో ఈ గందరగోళ పరిస్థితులు సృష్టించి కధనడిపించి ఉన్నాఆశ్చర్యం లేదు. బహుశః అందుకేనెమో కాంగ్రెస్ అధిష్టానం అసలు ఈ బిల్లు గురించి ఈమధ్య కాలంలో ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా చాలా ధీమాగా వేరే వ్యవహారాలలో తలమునకలయి ఉంది. ఇక్కడ రాష్ట్రంలో టీ-బిల్లు కధ ఏవిధంగా ముగియబోతోందో దాదాపు స్పష్టమయింది. ఇక పార్లమెంటుకి చేరుకొన్న తరువాత కొత్త డ్రామా మొదలవుతుంది. దాని గురించి మాట్లాడుకొనేందుకు ఇంకా చాలా సమయం ఉంది.
http://www.teluguone.com/news/content/telangana-bill-37-28965.html