తమ్మినేని కుమారుడి ముందస్తు బెయిల్ కు హైకోర్టు నో.!
Publish Date:Jul 28, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, వైసీపీ సీనియర్ నాయకుడు తమ్మినేని సీతారాం కుటుంబం భూకబ్జా కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలు చేసుకున్న యాంటిసిపేటరీ బెయిలు విషయంలో తీర్పు ఆ కుటుంబానికి పాక్షిక ఊరట మాత్రమే లభించింది. ఈ కేసులో తమ్మినేని కుమారుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగ్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ తోసిపుచ్చిన హైకోర్టు.. తమ్మినేని సీతారాం, ఆయన సతిమణి వాణిశ్రీలకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. శ్రీకాకుళానికి చెందిన కట్టా జయకిశోర్ అనే వ్యక్తికి చెందిన 4 కోట్ల రూపాయల విలువైన భూమిని కబ్జా చేసేందుకు ఆ స్థల యజమాని బతికి ఉండగానే.. మరణించినట్లు నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారంటూ తమ్మినేని సీతారాం, ఆయన సతీమణి, కుమారుడిపై పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టును తప్పించుకునేందుకు తమ్మినేని సీతారాం కుమారుడితో సహా పరారయ్యారు. పరారీలో ఉండగానే వీరు యాంటిసిపేటరీ బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ వై. లక్ష్మణరావు నేతృత్వంలోని న్యాయస్థానం విచారణ జరిపి.. తమ్మినేని కుమారుడిపై నమోదైన అభియోగాలు తీవ్రమైనవని పేర్కొంటూ ముందస్తు బెయిలు నిరాకరించింది. కాగా ఇదే కేసులో నిందితులుగా ఉన్న తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణిశ్రీ లకు మాత్రం ముందస్తు బెయిల్ మంజూరుర చేసింది. అయితే బెయిల్ మంజూరు చేసినప్పటికీ, తమ్మినేని సీతారాం మంగళవారం (జులై 29) దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. పోలీసు దర్యాప్తునకు సహకరించాలని, ఒకవేళ విచారణాధికారులకు సహకరించకపోతే మంజూరు చేసిన యాంటిసిపేటరీ బెయిల్ను రద్దు చేస్తామని తీవ్ర హెచ్చరించింది. ఈ కేసులో దాఖలైన సాధారణ బెయిల్ పిటిషన్లపై తదుపరి విచారణను హైకోర్టు వచ్చే నెల 17కి వాయిదా వేసింది. Tammineni Sitaram Land Case, Chiranjeevi Nag Bail Petition, AP High Court Verdict, Srikakulam Land Forgery Case, YSRCP Leaders Land Issue
http://www.teluguone.com/news/content/tammineni-sitaram-land-case-36-227321.html





