ఫైనల్ పోరులో భారత్ ముందు 5 పెను సవాళ్లు
Publish Date:Mar 8, 2026
Advertisement
మరికొద్ది గంటల్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టీ-20 ప్రపంచకప్-2026 ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ స్టేడియంలో ఇటీవలి కాలంలో భారత్కు మెరుగైన రికార్డు లేదు. ఈ స్టేడియంలోనే 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోయింది. ఆ క్రమంలో న్యూజిలాండ్తో జరగనున్న తుదిపోరులో భారత్ ముందు 5 ప్రధాన సవాళ్లు కనిపిస్తున్నాయి. టీ 20 వరల్డ్ కప్ చరిత్రతో న్యూజిలాండ్పై భారత్కు గెలుపు రికార్డు లేదు. ఇప్పటి వరకు తలపడిన మూడు సార్లు కివీస్ జట్టే విజయం సాధించింది. ఈ సారి ఆ చరిత్ర తిరగరాయడం టీంఇండియాకు పెద్ద సవాలే. ఇక గత 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఇదే వేదికపై ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. అలాగే ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో టీమిండియాకు ఎదురైన ఏకైక ఓటమి కూడా ఈ పిచ్లోనే. సూపర్-8 దశలో అహ్మదాబాద్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓటమి పాలైంది . ఓపేనర్ అభిషేక్ శర్మ వరుసగా విఫలమవుతుండటం భారత్ అభిమానులను, జట్టు మేనేజ్మెంట్ను కలవరపరుస్తోంది. ఫైనల్ లాంటి కీలక మ్యాచుల్లో అతనితో పాటు సంజూశామ్సన్, సూర్యకుమార్ యాదవ్ సహా టాప్ ఆర్డర్ మొత్తం రాణించాల్సి ఉంది. బౌలర్ వరుణ్ చక్రవర్తి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసినప్పటికీ, సెమీఫైనల్లో అతను భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అతను మునుపటి ఫాం అందిపుచ్చుకోవాల్సి ఉంది. వరుణ్ను తప్పించి..కుల్దీప్ను తీసుకోవాలని సీనియర్లు సూచిస్తున్నారు. అలాగే సెమీఫైనల్లో కేవలం 33 బంతు్లో సెంచరీ బాదిన కివీస్ ఓపెనర్ ఫిల్ అలెన్ భీకర్ ఫామ్లో ఉన్నాడు. అతన్ని త్వరగా కట్టడి చేయడంపైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. భారత్ తుది జట్టు కూర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్పై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఒక స్పష్టమైన సూచన చేశాడు. ఫైనల్ మ్యాచ్ కోసం అభిషేక్ శర్మకు విశ్రాంతినివ్వాలని, అతడి స్థానంలో ఫామ్లో ఉన్న రింకూ సింగ్ను తీసుకోవాలని కైఫ్ అభిప్రాయపడ్డాడు. కాగా, ప్రస్తుతం ఫైనల్ మ్యాచ్ కోసం తయారు చేసిన పిచ్, గతంలో టీమిండియా ఓడిపోయినప్పుడు ఉపయోగించిన పిచ్ల కంటే చాలా భిన్నంగా ఉందట. పిచ్ను పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలంగా మార్చేశారట. పిచ్ మీద గడ్డిని పూర్తిగా తొలగించి ఫ్లాట్గా మార్చేశారట. ప్రస్తుత పిచ్ చక్కటి బౌన్స్తో బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందట. అలాగే దూకుడుగా ఆడే స్ట్రోక్ప్లేయర్లకు స్వర్గధామంగా ఉంటుందట. అయితే పిచ్ పూర్తి ఫ్లాట్గా ఉండడం వల్ల స్పిన్నర్ల విషయంలో కెప్టెన్లు ఇద్దరూ ఆలోచనలో పడ్డారట . పిచ్ నుంచి స్పిన్నర్లకు సహాయం లభించకపోవచ్చనే అంచనాల నేపథ్యంలో వరుణ్ చక్రవర్తిని పక్కన పెట్టి, మరో పేసర్ను ఆడించాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోందట. అక్షర్ పటేల్ రూపంలో మరో స్పిన్నర్ అందుబాటులో ఉంటాడు కాబట్టి, వరుణ్ను పక్కన పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఏదేమైనా, సెమీ-ఫైనల్ తరహాలతోనే ఫైనల్ మ్యాచ్లో కూడా పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది. అహ్మదాబాద్లో ఆదివారం వాతావరణం చాలా వేడిగా, పొడిగా ఉండనుంది. అక్యూవెదర్ నివేదికల ప్రకారం, వర్షం పడే అవకాశం అస్సలు లేదు. పగటి ఉష్ణోగ్రతలు 34 నుండి 41 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉంది. సాయంత్రం కూడా వాతావరణం 30 డిగ్రీల వరకు ఉంటూ కాస్త ఉక్కపోతగా అనిపించవచ్చు. వర్షం ముప్పు లేనందున అభిమానులు పూర్తి మ్యాచ్ను ఆస్వాదించవచ్చు.
http://www.teluguone.com/news/content/t20-world-cup-final-36-215207.html





