సీఎం కుర్చీకి స్కెచ్?.. గంటా కాపు పాలిటిక్స్!
Publish Date:Jan 5, 2022
Advertisement
ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. రెండేళ్లుగా సోదిలో కూడా లేరు. ఏ పార్టీలో ఉన్నారో అర్థం కాదు. అప్పుడెప్పుడో విశాఖ ఉక్కు కోసమంటూ రాజీనామా చేశారు. అది ఇంతవరకూ ఆమోదం పొందలేదనుకోండి. ఆ తర్వాత వైసీపీలో చేరుతారంటూ లీకులిచ్చారు. అవంతి అడ్డుపుల్ల వేశారంటూ కవర్ చేసుకున్నారులెండి. అప్పటి నుంచి మళ్లీ కనిపిస్తే ఒట్టు. లేటెస్ట్గా ఉన్నట్టుండి.. హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యారు. ఏపీ కాపు నేతల సమావేశానికి నేను సైతమంటూ విచ్చేశారు. గంటా, సోము, కన్నా, జేడీ.. అబ్బో అంతా హేమాహేమీలే. కాపులకు రాజ్యాధికారంలో అన్యాయం జరుగుతోందని.. కాపు రాజ్యం రావాల్సిందేనని అంతా కలిసి తీర్మానించుకున్నారు. ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. అయితే, ఆ మీటింగ్కు వెళ్లొచ్చినప్పటి నుంచి గంటాకు మనశ్శాంతి లేదంటున్నారు. కాపుల కోసం మరింత పోరాటం చేసి తీరాల్సిందేనని గంటా గట్టిగా ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. సంక్రాంతి ఫెస్టివల్కి ముందుగానే.. భోగి మంటలు వేయకముందే.. రాజకీయ మంట రాజేయాలని గంటా భావిస్తున్నారట. ఇటీవల హైదరాబాద్లో జరిపినట్టు.. త్వరలోనే విశాఖలో మరో కాపు మీటింగ్-2 పెట్టాలనే యోచనలో గంటా శ్రీనివాసరావు ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రముఖులతో ఇండోర్ మీటింగా? అందరితో అవుట్డోర్ సభనా? అనేది ఇంకా డిసైడ్ కాలేదని అంటున్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో కాపుల సంఖ్య అధికంగా ఉంటుంది కాబట్టి.. విశాఖలో మీటింగ్ పెడితే పెద్ద సంఖ్యలో కాపు వర్గీయులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. ఇలా కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్తో మళ్లీ పాలిటిక్స్లో యాక్టివ్ కావాలనేది గంటా ఎత్తుగడలా కనిపిస్తోంది. ఇటీవల గంటా చేసిన కామెంట్లు సైతం ఆ దిశగా సిగ్నల్స్ ఇస్తున్నాయి. విశాఖ జిల్లా పాయకరావుపేటలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత ఏపీలో కాపు ముఖ్యమంత్రి వస్తాడని, కాపులు బలమైన రాజకీయ శక్తిగా అవతరిస్తారంటూ.. చెప్పుకొచ్చారు. అయితే, కాపులందరినీ ఏకీకృతం చేసి.. మరో కాపును సీఎం కుర్చీపై కూర్చోబెడతారా? లేక, తానే ఆ ముఖ్యమైన కుర్చీలో కూర్చోవాలని ఆశపడుతున్నారా? అనేది ముందుముందు తెలుస్తుంది. అయితే, ఇప్పటికే ముద్రగడ పద్మనాభం కాపుల కోసం గట్టిగానే పోరాడారు. అటు, జనసేనాని పవన్కల్యాణ్, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ.. కాపులకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు. సోము వీర్రాజు బీజేపీలోనే నెగ్గుకురాలేకపోతున్నారు. జేడీ లక్ష్మినారాయణకు రాజకీయ ఓనమాలు కూడా తెలీవంటారు. మరి, కాపుల నుంచి ముఖ్యమంత్రి అయ్యేది ఎవరు? ఏ పార్టీకి కాకుండా పోయిన గంటాకు అంత సీన్ ఉందా? కాపు రాజకీయం ఏ పార్టీకి కలిసొస్తుంది? గంటా ఆధ్వర్యంలో కొత్తగా కాపు పార్టీ పుట్టుకురాబోతోందా? ముద్రగడ ఇప్పటికే ప్రతిపాదించినట్టు.. కాపులు, బీసీలు, దళితులు.. ఏకమై ఏపీలో ప్రభంజనం సృష్టిస్తారా? ఇలా అనేక ప్రశ్నలు.
http://www.teluguone.com/news/content/strategy-behind-ganta-srinivasarao-kapu-politics-39-129685.html





