జగన్ ఢిల్లీ టూర్.. గుట్టురట్టు!
Publish Date:Jun 4, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రెండురోజుల తాజా ఢిల్లీ పర్యటనపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి.. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలదే అత్యంత కీలక పాత్ర.. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ జరిగిందంటూ మీడియాలో ఓ ప్రచారం హోరెత్తింది. మరోవైపు ప్రధానితో సీఎం జగన్ భేటీకీ సరిగ్గా రెండు రోజుల క్రితమే.. ఒడిశా సీఎంతో కూడా ప్రధాని మోదీ భేటీ అయ్యారని.. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాల సీఎంలతో మోదీ వరుస భేటీలు జరుగుతున్నాయంటూ మీడియా పలు కథనాలను వండి వార్చింది. అయితే ప్రధాని మోదీతో సీఎం జగన్ తాజా భేటీ వెనుక అర్థం, పరమార్థం, అంతర్థం వేరే ఉందనే ఓ టాక్ తాడేపల్లి ప్యాలెస్లో హాట్ హాట్ గా నడుస్తోంది. పీఎం మోదీ, సీఎం జగన్ మధ్య దాదాపు 45 నిమిషాల భేటీ జరిగిందని.. ఈ భేటీలో టీటీడీ జేఈవో ఏ.వి.ధర్మారెడ్డి డిప్యూటేషన్ పొడిగింపు అంశం ప్రధానంగా చర్చకు వచ్చిందనీ తాడేపల్లి ప్యాలెస్ చర్చల సారాంశం. అలాగే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో జరిగిన భేటీలో కూడా సీఎం జగన్ ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. ఏవీ ధర్మారెడ్డి కేంద్ర సర్వీస్ అధికారి అన్న సంగతి అందరికీ తెలిసిందే. వైయస్ జగన్ అధికారంలోకి రాగానే.. ఏవీ ధర్మరెడ్డిని తమ రాష్ట్రానికి డిప్యూటేషన్పై పంపాలంటూ కేంద్ర హోం శాఖకు లేఖ రాశారు. దాంతో ఆయన్ని ఆంధ్రప్రదేశ్కు పంపింది కేంద్ర ప్రభుత్వం. దాంతో ఏవీ ధర్మారెడ్డిని టీటీడీ స్పెషల్ ఆఫీసర్గా జగన్ ప్రభుత్వం ఆఘమేఘాల మీద నియమించింది. నాటి నుంచి ఆయన ఆ పోస్టులోనే ఉంటూ ఆ కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి సేవలో కొనసాగుతున్నారు. మరోవైపు టీటీడీ ఈవోలుగా ఎవరు వచ్చి.. వెళ్లినా.. తాను మాత్రం పక్కా లోకల్ అన్నట్లు ధర్మారెడ్డి మాత్రం తిరుమలలోనే పాతుకుపోయారు. మరోవైపు అనిల్ కుమార్ సింఘాల్ తర్వాత టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన జవహర్ రెడ్డి కూడా మళ్లీ .. అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లిపోయారు. దీంతో టీటీడీ ఈవోగా ఎఫ్ఏసీ హోదాలో ఏవీ ధర్మారెడ్డిని కొనసాగిస్తూ ఈ వైయస్ జగన్ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 2022, మే 14తో డిప్యూటేషన్పై ఏపీకి వచ్చిన ఏవీ ధర్మారెడ్డి పదవి కాలం ముగిసింది. దాంతో ఆయన మళ్లీ అంటే.. 2022 మే 15వ తేదీ కేంద్ర హోం శాఖకు రిపోర్ట్ చేయాలి. కానీ ఈ ధర్మారెడ్డి మాత్రం ఆనంద నిలయాన్ని వదిలి .. హస్తినకు వెళ్లలేదు. దీంతో టీటీడీ ఉద్యోగులే కాదు.. తెలుగు ప్రజలు సైతం ధర్మారెడ్డి మళ్లీ పేరెంట్ కేడర్కు ఎందుకు వెళ్లలేదనే సంశయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు... ఏవీ దర్మారెడ్డిని టీటీడీలో కొనసాగించాలని జగన్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని తెలుస్తోంది. ఏవీ దర్మరెడ్డి మరో రెండేళ్లలో రిటైర్మెంట్ కానున్నారు. అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కూడా మరో రెండేళ్ల సమయం ఉంది. ఏవీ ధర్మారెడ్డిని డిప్యూటేషన్పై ఏపీలోనే కొనసాగించాలంటూ ప్రధానమంత్రి కార్యాలయానికి విజ్జప్తి చేస్తూ.. అందుకు సంబంధించిన దస్త్రాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం గతంలో పంపిందట. అయితే ఈ దస్త్రంపై ప్రధాన మంత్రి కార్యాలయం కోర్రిలు మీద కోర్రిలు వేసి.. పక్కన పెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఒకానొక దశలో ఈ ఏవీ దర్మారెడ్డి చేత.. కేంద్ర ప్రభుత్వ ఉధ్యోగానికి రాజీనామా చేయించి.. ఆయనను ఏపీ సివిల్ సర్వీస్ అధికారిగా తీసుకోవాలనే నిర్ణయానికి కూడా సీఎం జగన్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఫ్యాన్ పార్టీలోని కీలక నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతేకాదు.. దీని వల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కవాల్సి వస్తుందని.. సీఎం జగన్కు వారు సూచించినట్లు తెలుస్తోంది.
ఓ సారి ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో భేటీ అయి.. ఏవీ ధర్మారెడ్డి డిప్యూటేషన్ పొడిగింపు అంశంపై చర్చిస్తే.. ఫలితం ఉండే అవకాశం ఉంటుందని సీఎం జగన్కు ఆయన ముఖ్య సలహాదారు సూచించారట. ఆ క్రమంలో జగన్.. హస్తనకు పరుగు తీసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే సీఎం జగన్.. ఢిల్లీ వెళ్లి ప్రధాని, హోం మంత్రి అమిత్ షాతో బేటీ అయినట్లు సమాచారం. మరి ధర్మారెడ్డి డిప్యూటేషన్ అంశంపై మోదీ, అమిత్ షా ద్వయం ఏ నిర్ణయం తీసుకోనున్నారనేది త్వరలో తేలనుంది. ఓ వైపు రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నీకు ఇది... నాకు ఇది (క్విడ్ ప్రోకో) తరహా రాజకీయం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదనే టాక్ పార్టీ వర్గాల నుంచే వినిపిస్తోంది.
మరోవైపు.. పాదయాత్ర సందర్బంగా నాటి ప్రతిపక్ష నేతగా జగన్.. ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామని అందుకోసం..ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ పెద్దల మెడలు సైతం వంచుతామంటూ ప్రగల్భాలు పలికిన సంగతి తెలిసిందే. పాదయాత్ర సందర్భంగా జగన్ ఎన్నో చెప్పారని.. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వైయస్ జగన్ పలుమార్లు ఢిల్లీకి వెళ్లి.. వచ్చినా.. ఆయన మాత్రం ప్రధానితో జరిగిన భేటీలో ఏం జరిగిందో.. కనీసం పెదవి విప్పి కూడా చెప్పరన్న సంగతి తెలుగు ప్రజలందరికీ తెలిసిందే. ఇక వీరిద్దరి మధ్య చర్చకు వచ్చిన అంశాలు ఏమిటనేది కూడా మూడో కంటికి సైతం తెలియదన్న సంగతి కూడా తెలిసిందే. కానీ తాజాగా జగన్ ఢిల్లీ టూర్.. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి కోసమే అంటూ తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా జోరుగా చర్చ జరగడం మాత్రం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది... అవుతోంది.
http://www.teluguone.com/news/content/secreat-behind-jagab-delhi-tour-25-137052.html





