అమరావతి రైతుల ఉద్యమానికి 900 రోజులు.. సుదీర్ఘ ఉద్యమంగా చరిత్రలో చిరస్థాయి
Publish Date:Jun 4, 2022
Advertisement
అమరావతి రాజధాని ఉద్యమం సుదీర్ఘ కాలంగా నిర్విరామంగా కొనసాగుతున్న ఉద్యమంగా చరిత్రపుటల్లో నిలిచిపోతుంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు, మహిళలు నిర్విరామంగా చేస్తున్న ఉద్యమం శనివారం నాటికి 900 రోజులకు చేరింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు చేపట్టిన ఉద్యమం నిరంతరాయంగా సంవత్సరం నాలుగు నెలల రెండు రోజులు కొనసాగింది. అంటే 427 రోజులు కొనసాగిందన్నమాట. దేశంలో జరిగిన ఉద్యమాల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కూడా ఒకటి. అయితే.. అమరావతి ఉద్యమం 900 రోజులకు చేరుకోవడమే కాకుండా ఇంకా కొనసాగుతుండడం గమనించదగ్గ అంశం. అడ్డగోలు విభజనతో అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించి, దాని అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అమరావతి రైతులు 33 వేలకు పైగా ఎకరాలను ప్రజా రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చారు. చంద్రబాబు పర్యవేక్షణలో సరికొత్త అమరావతి నగర నిర్మాణం వేగంగా జరుగుతున్న క్రమంలో 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాంతో అమరావతి నగర నిర్మాణ వేగం తగ్గిపోయింది. అంతే కాకుండా 2019 డిసెంబర్ లో ఆయన మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చి అమరావతిని కేవలం శానస రాజధాని చేస్తామని ప్రకటించారు. దీంతో అప్పటి వరకు అమరావతికి ఎంతో కష్టపడి తెచ్చిన బ్రాండ్ ఇమేజ్ ఒక్కసారిగా తుడిచిపెట్టుకు పోయింది. కొన్ని లక్షల కోట్ల సంపద ఒక్కసారిగా ఆవిరైపోయింది. సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం అమరావతి రైతుల ఆశల్ని చిదిమేసినట్లయింది. వేలాది ఎకరాల భూమిని ఇచ్చిన రైతుల్లో ఆందోళన నెలకొంది. అమరావతిని రాజధానిగా నిర్మించేందుకే తామంతా తమ భూములు ఇచ్చామని, రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి ప్రాంత రైతులు 2019 డిసెంబర్ 17న అమరావతి పరిరక్షణ ఉద్యమం ప్రారంభించారు. నిరాహార దీక్షలతో పాటు వివిధ రూపాల్లో రైతులు ఉద్యమాలు కొనసాగిస్తున్నారు. అయితే.. రైతుల ఉద్యమానికి ప్రభుత్వం, పోలీసులు తొలుత అనుమతించకపోవడంతో కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నారు. అమరావతి రాజధాని రైతుల ఉద్యమంలో రైతులు, మహిళలు, కవులు రైతులు, చిన్నా పెద్దా తేడా లేకుండా వేలాది మంది పాల్గొంటున్నారు. ఉద్యమంలో భాగంగా నిరాహార దీక్షలు చేశారు. సభలు నిర్వహించారు. దేవుళ్లు, దేవతలకు మొక్కులు కట్టారు. జలదీక్షలు చేశారు. న్యాయస్థానం టూ దేవస్థానం పేరిట అమరావతిలోని హైకోర్టు ప్రాంతం నుంచి తిరుపతి వెంకన్న ఆలయం వరకూ పాదయాత్ర చేశారు. పోలీసుల లాఠీ దెబ్బలు రుచిచూశారు. అరెస్టులు అయ్యారు. అమరావతి రైతులు తీవ్ర నిర్బంధాలకు గురయ్యారు. వైసీపీ మంత్రుల నిందారోపణలు భరించారు. ఆకలి దప్పులతో అలమటించి కూడా అన్నదాతలు తమ ఉద్యమాన్ని నిరంతరాయంగా కొనసాగించడం విశేషం. ప్రధాని మోడీ స్వయంగా వచ్చి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసినా.. బీజేపీ మాత్రం ముందుగా రైతుల ఉద్యమానికి ప్రత్యక్షంగా మద్దతివ్వలేదు.‘న్యాయాలయం టూ దేవాలయం’ పాదయాత్రకు ముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుపతి వచ్చినప్పుడు వార్నింగ్ ఇచ్చిన క్రమంలో బీజేపీ ఏపీ నేతలు అమరావతి రైతుల ఉద్యమానికి ప్రత్యక్షంగా మద్దతు ప్రకటించడం, ఉద్యమిస్తున్న రైతులతో కలిసి నడవడం గమనార్హం. అమరావతి ఉద్యమం 250 రోజులైన సందర్భంగా టీడీపీ అధినేత తన ట్విట్టర్ వేదికగా ‘ఇంత సుదీర్ఘ ఉద్యమాలు అరుదు. ఇంత జరుగుతున్నా.. ఆందోళనకారుల బాధను వినడానికి ముందుకు రాని పాలకులు కూడా అరుదే. పైగా వేలాది మంది ఉద్యమకారులపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపింది’ అంటూ ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. జగన్ రెడ్డి సర్కార్ జగమొండిగా వ్యవహరించి మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. చివరికి కోర్టు మొట్టికాయలు వేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని చెప్పింది. అటు కేంద్ర ప్రభుత్వం నుంచి, ఇటు న్యాయస్థానం నుంచి మొట్టికాయలు పడిన కారణంగా మూడు రాజధానుల బిల్లుల్ని నిలిపివేసింది. అయితే.. అమరావతి నగర నిర్మాణాన్ని మాత్రం ముందుకు సాగనివ్వడంలేదు. కోర్టు ఆదేశాలతో ఆందోళన చేస్తున్న రైతుల్లో సంతోషం కలిగినా.. రాజధానిగా అమరావతినే కొనసాగించే వరకు తమ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని ఆ ప్రాంత రైతులు ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. చివరికి మళ్లీ సుప్రీంకోర్టు కలగజేసుకుని.. అమరావతి నగర నిర్మాణం కొనసాగించాలని గడువు విధించింది. అలాగే వైసీపీ సర్కార్ రద్దు చేసిన సీఆర్ డీఏను పునరుద్ధరించాలని ఆదేశించింది. భూములు తీసుకున్న రైతులకు ప్రభుత్వం ఒప్పుకున్న ప్రకారం అభివృద్ధి చేసిన స్థలాలు నిర్ణీత గడువులోగా అప్పగించాలని ఆదేశించింది. ఆ క్రమంలో రైతులు తమ తమ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ప్రభుత్వ అధికారులు పిలుపు ఇస్తున్నారు. అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేయాలన్న జగన్ రెడ్డి సర్కార్ దుర్నీతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి మూడు దశాబ్దాలు వెనకబడిపోయిందనే విమర్శలు, ఆవేదనలు వ్యక్తం అవుతున్నాయి.
http://www.teluguone.com/news/content/historic-amarawati-agitation-900-days-25-137054.html





