ఆర్టీసీ సమ్మె.. మంత్రి తీరుపై సీఎం ఆగ్రహం!
Publish Date:Apr 24, 2026
Advertisement
రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె తీవ్రరూపం దాల్చడం, తద్వారా ప్రభుత్వం ఇబ్బందుల్లో పడటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని సరిగ్గా డీల్ చేయలేకపోయారంటూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్పై సీఎం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీ సమ్మె అంశం చర్చకు రాగా, ముఖ్యమంత్రి మంత్రుల తీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు. సమ్మె ఇంతవరకు వెళ్లే వరకు ఏం చేస్తున్నారని, కార్మికులను కట్టడి చేయడంలో ఎందుకు విఫలమయ్యారని ఆయన మంత్రిని పరోక్షంగా నిలదీసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సాధారణ సమస్యలను కూడా ముందుగా పసిగట్టి, వ్యూహాత్మకంగా వ్యవహరించి పరిష్కరించాల్సింది పోయి, వాటిని తన స్థాయి వరకు తీసుకురావడంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఆర్టీసీ డ్రైవర్లు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్న ఘటనలు కార్మికులను మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయని, సమ్మె ఉధృతమైతే పరిస్థితి మరింత అదుపుతప్పే ప్రమాదం ఉందని సీఎం హెచ్చరించారు. ఇలాంటి సున్నితమైన విషయాల్లో అధికారులు, మంత్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రభుత్వ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉందని సీఎం భావిస్తున్నారు. అందుకే, రవాణా శాఖపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రికి సూచించినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశంలో జరిగిన ఈ పరిణామాలు రవాణా శాఖలో కలకలం రేపుతున్నాయి. సమ్మెను తక్షణమే నిలిపివేసి, కార్మికులతో చర్చలు జరిపి సాధారణ పరిస్థితిని నెలకొల్పాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించడంతో, మంత్రి పొన్నం ప్రభాకర్ తదుపరి కార్యాచరణపై అందరి దృష్టి నెలకొంది.
http://www.teluguone.com/news/content/rtc-strike-36-218159.html





