బిల్లు అడిగితే కత్తులతో దాడి… సరూర్నగర్లో రౌడీ షీటర్ల దౌర్జన్యం
Publish Date:May 6, 2026
Advertisement
హైదరాబాద్ నగరంలో మరోసారి రౌడీ షీటర్ల దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక రెస్టారెంట్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. బిల్లు చెల్లించమని అడిగిన సిబ్బందిపై కత్తులు, కట్టెలతో విరుచుకుపడిన దుండగులు హింసకు దిగడంతో ఈ ఘటన నగరంలో రచ్చ రచ్చ సృష్టించింది. ఈ నెల 2వ తేదీన రాత్రి సమయంలో కొంతమంది యువకులు సరూర్నగర్లోని అర్బన్ రెస్టారెంట్కు వచ్చి భోజనం చేశారు. భోజనం అనంతరం రెస్టారెంట్ సిబ్బంది బిల్లు చెల్లించమని కోరగా, మొదట వాగ్వాదానికి దిగారు. క్షణాల్లోనే ఆ వాగ్వాదం తీవ్రరూపం దాల్చి, దుండగులు రెస్టారెంట్ సిబ్బంది మరియు యాజమాన్యంపై దాడికి పాల్పడుతూ హంగామా సృష్టించారు. దుండగులు ముందే సిద్ధంగా వచ్చినట్లు అనిపించేలా కత్తులు మరియు కట్టెలతో హోటల్ సిబ్బందిపై విరచికుపడుతూ హోటల్లో ఉన్న అద్దాలు ఫర్నిచర్ మరియు ప్లేట్లు పగలగొడుతూ కస్టమర్లను బయటకు వెళ్లి పొమ్మంటూ బెదిరింపులకు గురి చేస్తూ నానా హల్చల్ సృష్టించారు. రెస్టారెంట్లో ఉన్న కస్టమర్లు ఒక్కసారిగా భయంతో బయటకు పరుగులు తీశారు. కొద్దిసేపట్లోనే అక్కడి వాతావరణం యుద్ధరంగంలా మారిపోయింది. ఈ దాడిలో పలువురు సిబ్బంది తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం బాధితులు హాస్పటల్లో చికిత్స పొందుతున్నారు. రెస్టారెంట్ యాజమాన్యం ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సేకరించి నిందితుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా నేరచరిత్ర కలిగిన ఏదుల ప్రసన్ రెడ్డి మరియు ఏదుల యశ్వంత్ రెడ్డి అనుచరుల పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ప్రసన్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి పరారీలో ఉన్నారు. వారిని పట్టు కునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. గతంలో వనస్థలిపురంలో సొంత అక్క భర్త లలిత్ను ప్రసన్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి ఈ ఇద్దరు దారుణంగా హత్య చేశారు. ఈ నిందితులను పట్టుకునేం దుకు పోలీసులు జల్లడ పడుతున్నారు. ఈ ఘటనతో సరూర్నగర్ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని, రౌడీ షీటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ సంఘటన మరోసారి నగరంలో రౌడీ షీటర్ల అల్లర్లు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో చూపిస్తోంది. .
http://www.teluguone.com/news/content/rowdy-sheeters-violence-in-saroornagar-36-219042.html





