కేసుల ఆరాటం..భంగపాటుతో ఆయాసం..ఆర్కే నైజం!
Publish Date:May 11, 2022
Advertisement
నారాయణ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు పొంగూరు నారాయణకు బెయిల్ మంజూరైంది. టెన్త్ ప్రశ్నాపత్రాల లీక్ తో ఆయనకు సంబంధం ఉందని చిత్తూరు జిల్లా పోలీసులు మంగళవారం నారాయణను అదుపులోకి తీసుకున్నది మొదలు రాత్రి పొద్దుపోయేదాకా పెద్ద డ్రామాయే నడిచింది. అయితే.. టీడీపీ హయాంలో అమరావతి భూముల వ్యవహారంలో మంగళగిరి ఎమ్యెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన కేసును తెరమీదకు తెస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, అప్పటి మున్సిపల్ మంత్రి నారాయణ తదితరులపై ఆర్కే అప్పట్లో కోర్టులో కేసు వేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి చరిత్ర కోర్టులు, కేసులతోనే ముడిపడి ఉందనేది వాస్తవం. అయితే.. ఆర్కే వేసిన ఏ కేసు కూడా సక్సెస్ అయిన దాఖలాలు లేవు. పైగా కోర్టు నుంచే ఆర్కేకు అక్షింతలు కూడా పడుతుంటాయి. అయినా.. మళ్లీ ఏదో ఒక అంశం మీద కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉండడం ఆర్కే నైజం అంటారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర తేల్చాలంటూ ఆర్కే వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో బాధితులు ఎవరికీ లేని శ్రద్ధ మీకు ఎందుకంటూ హైకోర్టు ఆర్కేని ప్రశ్నించింది. ముందుగా ఆర్కే సీబీఐ కోర్టులో కేసు వేశారు. సీబీఐ కోర్టు తీర్పుపై చంద్రబాబు హైకోర్టును ఆశ్రయిస్తే.. ఆర్కే సుప్రీంకోర్టుకు వెళ్లారు. అమరావతిలో అక్రమాలు జరిగాయంటూ ఆర్కే కేసులు పెట్టారు. చంద్రబాబు సహా అప్పటి ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నవారిని ఇరికించాలని ఆర్కే యత్నించారు. చివరికి సుప్రీంకోర్టు వరకు వెళ్లి భంగపడ్డారు. అయినా.. కేసుల ఆరాటం ఆర్కేకి తగ్గలేదంటారు. అమరావతిలో వెయ్యని ఇన్నర్ రింగ్ రోడ్డును అడ్డం పెట్టుకుని చంద్రబాబును ఏ1గా, అప్పటి మున్సిపల్ మంత్రి నారాయణను ఏ2 గా సహా ఇంకా పలువురిపై కేసులు పెట్టారు ఆర్కే. అమరావతిని రాజధాని చేయాలనే ప్రతిపాదన వచ్చినప్పటి నుంచే ఆర్కే ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. అమరావతి ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే అయినా అక్కడ రాజధాని ఏర్పాటుకు ఆర్కే అడ్డుపడుతూనే ఉంటారు. అమరావతికి భూ సమీకరణ సందర్భంగా మున్సిపల్ మంత్రి నారాయణ సభకు ఆళ్ల అడ్డుపడ్డారు. సీఆర్డీయే అధికారులపై దాడి చేశారు. తమ విధులకు ఆర్కే ఆటంకం కలిగించారంటూ అధికారులు కేసు పెట్టారు. అయితే.. ఆర్కేపై నమోదైన ఈ కేసును విజయవాడలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆ తర్వాత కొట్టివేసింది. మంత్రి నారాయణ ఆదేశాలతోనే అధికారులు తనపై కేసులు పెట్టారని ఆళ్ల కక్ష పెంచుకున్నారని రైతులు చెబుతారు. నారాయణపై ప్రతీకారం తీర్చుకునేందుకే అసంబద్ధ ఆరోపణలతో సీఐడీకి ఫిర్యాదు చేశారంటారు. రాజధాని ప్రాంతంలో దళితులను బెదిరించి భూములు లాక్కున్నారనేది ఎమ్మెల్యే ఆర్కే ఆరోపణ. రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందే దళితుల అసైన్డ్ భూములు తక్కువ ధరలకు కొనేసి, తన మనుషులకు చంద్రబాబు కట్టబెట్టి, వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆర్కే ఆరోపణ. రాజధాని నిర్మాణానికి భూములను తాము సమ్మతితో ఇచ్చామని దళితులే చెప్పడంతో ఆర్కేవి తప్పుడు ఆరోపణలే అని తేలిపోయింది. చంద్రబాబుపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోకపోతే దళిత రైతులంతా కలిసి ఎమ్మెల్యే ఆర్కేపైనే అట్రాసిటీ కేసులు పెడతామని దళిత నేత మార్టిన్ హెచ్చరించే దాకా విషయం వెళ్లింది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కోర్టుల్లో రకరకాల కేసులు వేసి అప్పటి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు యత్నించేవారు ఆర్కే. గుంటూరు జిల్లా ఆత్మకూరులోని టీడీపీ కార్యాలయాన్ని వాగు పోరంబోకు స్థలంలో నిర్మించారని, దానికి ఇచ్చిన లీజ్ ను రద్దు చేయాలంటూ హైకోర్టులో ఆర్కే పిటిషన్ వేశారు. అయితే.. పిల్ వేయడంలో ఆర్కే ఆసక్తి ఏమిటని ప్రశ్నించిన కోర్టు ఆ పిటిషన్ ను కొట్టేసింది. చంద్రబాబు ప్రభుత్వం 150 రూపాయలకే ఫైబర్ నెట్ ద్వారా ఫోన్, టీవీ, ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు యత్నిస్తే.. హైకోర్టులో ఆర్కే కేసు వేసి అడ్డుపడేందుకు యత్నించారు. 2014 ఎన్నికల అఫిడవిట్ లో నకిలీ డిగ్రీ పట్టా పెట్టడాన్ని టీడీపీ నేతలు పసిగట్టారు. ఆ డిగ్రీ కాస్తా 2019 ఎన్నికల నాటికి డిప్లమా డిగ్రీగా మార్చేయడం గమనార్హం. ఎంతసేపూ కేసులు, కోర్టులు, పోలీస్ స్టేషన్లు అంటూ తిరిగే తమ ఎమ్మెల్యే ఆర్కే కనిపించడం లేదని మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో రైతులు కేసు పెట్టారు. ఆర్కే పెట్టే పెట్టే ఏ కేసులోనూ బాధితులు ఉండరు. తమకు నష్టం జరిగిందనే వారూ ఉండరు. లబ్ధిదారులు ఉండరు. ఫలానా వారికి లాభం కలిగిందనే వారు కూడా ఉండరు. కేవలం ఆర్కే మాత్రమే ఏదో జరిగిపోయిందని కేసులు పెడుతుంటారు.
http://www.teluguone.com/news/content/rk-always-busy-with-cases-25-135754.html





