‘రాయల్’సీమ.. చంద్రబాబు ట్వీట్
Publish Date:May 9, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక పురోగతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారు. మరీ ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతంగా ముద్రపడిన రాయలసీమను పారిశ్రామిక, ఆటోమొబైల్ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు. తాజాగా సత్యవేడులో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'రాయల్ ఎన్ఫీల్డ్' తన యూనిట్ను ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చంద్రబాబు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఆసక్తికర పోస్టు ఇప్పుడు తెగ వైరల్ అయ్యింది. రాయలసీమ కేవలం పేరులోనే కాదు, అభివృద్ధిలోనూ 'రాయల్' అనిపించుకోవాలన్నదే తన సంకల్పమని ఆ పోస్టులో పేర్కొన్న చంద్రబాబు రాయల్ ఎన్ఫీల్డ్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ గడ్డపైకి రావడం పారిశ్రామిక ప్రగతికి శుభసూచకంగా అభివర్ణించారు. సీమ జిల్లాలను ఒకప్పుడు ఫ్యాక్షనిజానికి చిరునామాగా చూసేవారనీ, అయితే ఇప్పుడు రాయల సీమలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా మారిపోయిందని పేర్కొన్న ఆయన, ప్రపంచ స్థాయి బ్రాండ్లు ఇక్కడ కొలువుదీరడానికి క్యూకడుతున్నాయని పేర్కొన్నారు. రాయలసీమ కాదు ఇప్పుడు ఇది రాయల్ సీమ అని పేర్కొన్నారు. గతంలోనే శ్రీసిటీ ఏర్పాటుతో చిత్తూరు జిల్లా ముఖచిత్రం మారిపోయింది. అక్కడ ఇప్పటికే క్యాడ్బరీ, పెప్సికో, ఫాక్స్కాన్ వంటి బహుళజాతి కంపెనీలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. దీనికి కొనసాగింపుగా అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ రాకతో ఈ ప్రాంతం గ్లోబల్ ఆటోమొబైల్ మ్యాప్లో చోటు దక్కించుకుంది. అమర రాజా బ్యాటరీస్, డిక్సన్ టెక్నాలజీస్ వంటి సంస్థలు ఇప్పటికే వేల సంఖ్యలో స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తున్నాయి. ఇక కడప జిల్లాలో జేఎస్డబ్ల్యూ వంటి ఉక్కు పరిశ్రమలు, కర్నూలు జిల్లాలో ఏర్పాటవుతున్న భారీ సోలార్ పవర్ పార్కులు రాయలసీమను ఇంధన, తయారీ రంగాలకు కేంద్ర బిందువుగా మారుస్తున్నాయి. ఉత్తరాంధ్రను ఐటీ రంగంలో అభివృద్ధి చేస్తూనే.. రాయలసీమను మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో అగ్రగామిగా నిలపాలన్న స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచేలా ప్రభుత్వం అనుసరిస్తున్న బ్రాండ్ మేనేజ్మెంట్ వ్యూహం సత్ఫలితాలిస్తోంది.
http://www.teluguone.com/news/content/rayalaseema-no-more-factionseema-36-219288.html





