రాజకీయ ప్రయోజనాల కోసమే రాయల తెలంగాణా
Publish Date:Dec 3, 2013
Advertisement
కర్ణుడి చావుకి వేయి కారణాలన్నట్లు, మళ్ళీ ఆఖరినిమిషంలో తెర మీదకు తెచ్చిన రాయల తెలంగాణా ప్రతిపాదనకు కూడా అన్నే కారణాలున్నాయి. అయితే అవి కాంగ్రెస్ పెద్దల ముచ్చట్లలో చాలా అద్భుతంగా అనిపించవచ్చునేమో కానీ వాస్తవ పరిస్థితుల్లో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉండటం ఖాయం. ఇక ఈ ప్రతిపాదనకు కారణాలు చెప్పుకొంటే: 1. తెలంగాణకు రెండు కొత్త జిల్లాలను అతికించడం ద్వారా తెలంగాణాలో తన రాజకీయ ప్రత్యర్దులయిన తెదేపా, తెరాస మరియు బీజేపీలను దెబ్బతీయడం. కేవలం తెలంగాణాకే పరిమితమయిన తెరాస, బీజేపీలకు అదనంగా వచ్చి జేరిన ఈ రెండు జిల్లాలో ఎటువంటి పట్టు లేదు గనుక కాంగ్రెస్ మజ్లిస్ పార్టీతో కలిసి లాభపడవచ్చును. 2. ఈవిధంగా విభజిస్తే సీమాంధ్రలో కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చును. రెండు రాష్ట్రాల మధ్య యంపీ, యంయల్యేల సంఖ్య సరిసమానమవుతుంది గనుక సీమాంధ్రలో నష్టపోయినా రాయల తెలంగాణా లో లాభపడవచ్చును. 3. రాయలసీమకు చెందిన 28 మంది కాంగ్రెస్ నేతలు ఈ విభజన ప్రతిపాదనకు అంగీకరిస్తున్నందున కిరణ్ కుమార్ రెడ్డి వర్గంలో ప్రస్తుతం 153మంది సభ్యుల బలం కాస్త 125కి తగ్గిపోతే, అప్పుడు శాసనసభలో తెలంగాణా కోరుకొంటున్న సభ్యుల సంఖ్య 119 నుండి 147కు చేరుకొంటుంది గనుక బిల్లు రాజ్యంగా బద్దంగా శాసనసభ అమోదం పొంది రాష్ట్రపతి వద్దకు చేరుకొంటే, ఆయన కూడా ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేరు. 4. పది జిల్లాలతో కూడిన తెలంగాణా ఏర్పడితే, ఇంతవరకు రాజ్యాధికారం అనుభవించిన కాంగ్రెస్ పార్టీలో రెడ్డి కులస్తులు, ఇక ముందు వెనుకబడిన తరగతుల నేతల క్రింద పనిచేయవలసి ఉంటుంది. అది వారికి చాలా కష్టమే గనుక అనంతపురం, కర్నూలు జిల్లాలలో అధికంగా ఉన్న రెడ్డి వర్గం నేతలు కూడా వారికి తోడయితే మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడం సాధ్యం అవుతుంది. అదేసమయంలో రాయలసీమలో రెడ్ల ప్రాబల్యం తగ్గడంతో వారిపైనే ప్రధానంగా ఆధారపడిన జగన్మోహన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి కోరలు తీసిన పాములవుతారు. వారిరువురు తెలంగాణా కాలుపెట్టే పరిస్థితి లేదు గనుక, ఇక కాంగ్రెస్ పార్టీకి రాయల తెలంగాణాలో ఎదురుండదు. ఆ రెండు ప్రాంతాలలో బలంగా ఉన్న తెదేపా, వైకాపాలను ఘోరంగా దెబ్బ తీయవచ్చును. 5. కరువు ప్రాంతాలయిన అనంతపురం, కర్నూల్ జిల్లాలను తెలంగాణాలో కలిపితే, నీటి సమస్యలు ఉండవు. 6. ముఖ్యంగా ఇక తెరాస, వైకాపాలపై ఇకపై ఆధారపడనవసరం లేదు. 7. ప్రతిపాదిస్తున్నది రాయల తెలంగాణాయే అయినప్పటికీ దానిపేరు మాత్రం తెలంగాణా అని మాత్రమె ఉంటుంది. అదేవిధంగా రెండు జిల్లాలను తెలంగాణాలో ప్రస్తుతం ఉన్నపది జిల్లాలలో కలిపివేయడం ద్వారా మళ్ళీ పది జిల్లాలతో కూడిన తెలంగాణాయే ఇస్తున్నందున ఇది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించిన నిర్ణయం ప్రకారమే ఉంది గనుక ఎవరూ తప్పు పట్టలేరు. అందువల్ల పార్లమెంటులో కూడా ఎవరూ బిల్లుని వ్యతిరేఖించలేరు. ఈ ఆలోచనలు, వ్యూహాలు డిల్లీలో కూర్చొని ఆలోచిస్తుంటే చాలా అద్భుతంగా కనబడవచ్చును. కానీ, ఫలితాలు మాత్రం పూర్తి భిన్నంగా ఉంటాయని కాంగ్రెస్ అనుభవ పూర్వకంగానే తెలుసుకోవాలనుకొంటే ఎవరు మాత్రం ఏమిచేయగలరు. ఈ విభజన ద్వారా బీజేపీతో సహా రాష్ట్రంలోని తన రాజకీయ ప్రత్యర్దులందరినీ దెబ్బ తీయాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటులో బహుశః ఏ రాజకీయ పార్టీ కూడా మద్దతు ఈయకపోవచ్చును. ఆరిపోయే దీపం బాగా వెలుగుతుంది. గతంలో బీజేపీ కూడా భారత్ వెలిగిపోతోందని ప్రచారం చేసుకొని చివరికి తానే ఆరిపోయింది. అదే విదంగా ఇప్పుడు కాంగ్రెస్ బుర్రలు కూడా రకరకాల ఆలోచనలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి.
http://www.teluguone.com/news/content/rayala-telangana-37-28000.html