ఇక్కడ జగన్, అక్కడ రాహుల్ ఆక్రోశం
Publish Date:Dec 27, 2013
Advertisement
రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచేందుకు ఎవరూ తనకు సహకరించడం లేదని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాపోతుంటే, అవినీతిని అరికట్టేందుకు ప్రతిపక్షాలు తమకు సహకరించడం లేదని అక్కడ రాహుల్ గాంధీ డిల్లీలో ఆక్రోశిస్తున్నారు. అక్కడ రాహుల్ అవినీతి గురించి మాట్లాడుతుంటే ఇక్కడ జగన్ సమైక్యాంధ్ర గురించి మాట్లాడుతున్నారు. అయితే ఇద్దరి వాదనలలో కూడా నిజాయితీ లోపించడమే చాలా విచిత్రమయిన విషయం. రాహుల్ గాంధీ తాను అవినీతిని అరికట్టేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నానని చెప్పుకొంటూ ప్రజలను ఆకట్టుకొని ప్రధాని అవ్వాలని భావిస్తుంటే, జగన్ సమైక్యాంధ్ర కోసం పోరాడుతూ జనాలను ఆకట్టుకొని (సీమాంధ్ర) ముఖ్యమంత్రి అవ్వాలని తహతహలాడుతున్నారు. ఇద్దరి వేర్వేరు అంశాలు ఎత్తుకొన్నావారి లక్ష్యాలు మాత్రం ఒకటే. అధికారం సంపాదించడం. ప్రధాని పదవి చెప్పట్టేందుకు అన్ని విధాలా అర్హుడని ప్రధాని మన్మోహన్ సింగ్ తో సహా అందరి నుండి కితాబులు అందుకొంటున్న రాహుల్ గాంధీ ప్రభుత్వాన్నిశాసించే స్థాయిలో ఉన్నపటికీ ఈ తొమ్మిదేళ్లలో ఏనాడు కూడా అవినీతిలో మునిగితేలుతున్నతమ యూపీయే ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనలేదు. కనీసం దానిని గాడిన పెట్టె ప్రయత్నం కూడా చేయలేదు. కనీసం అన్నాహజారే నేతృత్వంలో దేశవ్యాప్తంగా ప్రజలందరూ అవినీతికి వ్యతిరేఖంగా జనలోక్ పాల్ బిల్లుకోసం పోరాడినప్పుడు కూడా రాహుల్ గాంధీ ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు ఎన్నికలు తరుముకొస్తున్నందున హడావుడిగా లోక్ పాల్ బిల్లును ఆమోదింపజేసి, అవినీతిపై తన పోరాటంలో ఎవరూ కలిసి రావడం లేదని వాపోతున్నారు. అవినీతిపై ఈ పోరాటాన్ని రాహుల్ గాంధీ తొమ్మిదేళ్ళ క్రితమే మొదలుపెట్టి ఉంటే, నేడు ఆయనకీ, కాంగ్రెస్ పార్టీకి ఈ తిప్పలు ఉండేవే కావు. ఇక జగన్ విషయానికి వస్తే మొదట తెలంగాణా సెంటిమెంటుని గౌరవిస్తామని చెప్పి, ఆ తరువాత ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్ర విభజన చేయమని లేఖ కూడా ఇచ్చి, తరువాత సమన్యాయం ఆ తరువాత సమైక్యాంధ్ర అంటూ అధికారం కోసం మడమ తిప్పూతూనే ఉన్నారు. ఇన్నిమార్లు తన వైఖరి మార్చుకొన్న జగన్మోహన్ రెడ్డి నేటికీ కూడా నిజాయితీగా వ్యవహరించడం లేదు. రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు పోరాడుతున్నాని చెపుతూనే రాష్ట్రం విడిపోతే సీమాంధ్రకి ముఖ్యమంత్రి అయిపోవాలని తెగ తహతహలాడిపోతున్నారు. అతను ముప్పై యంపీ సీట్లు సాధించడం, డిల్లీలో చక్రం తిప్పడం గురించి మాట్లాడుతుంటే, ఆయన బాకా మీడియా జగన్ ముఖ్యమంత్రి అవ్వాలని ప్రజలందరూ ముక్త కంటంతో కోరుకొంటున్నారని ప్రచారం చేస్తూ ఆయన ‘ఆశయానికి’ అద్దం పడుతోంది. ఈవిధంగా ఇద్దరు యువనేతలు కూడా నిత్యం నీతి నిజాయితీల గురించి మాట్లాడుతూ, వాటిని ఆమడ దూరంలో ఉంటూ అధికారం కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు.
http://www.teluguone.com/news/content/rahul-gandhi-37-28803.html