స్పూర్తిదాయకమయిన అరవింద్ కేజ్రీవాల్ ఉపన్యాసం
Publish Date:Dec 28, 2013
Advertisement
అరవింద్ కేజ్రీవాల్ డిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రజలనుద్దేశ్యించి మాట్లాడుతూ, “ఇది పూర్తిగా మా విజయమేనని మేము భావించడం లేదు. ఇది డిల్లీ ప్రజల విజయం. మీరందించిన తోడ్పాటుతో అధికారం చేపడుతున్నమేము, దానిని మీ కోసమే వినియోగిస్తామని హామీ ఇస్తున్నాము. మీ ప్రతినిధులుగా బాధ్యతలు చేపడుతున్నమాకు అధికారము, దర్పము చలాయించాలనే ఆలోచన లేదు. అధికారం కోసమో, డబ్బు సంపాదన కోసమో లేక మంత్రి పదవుల కోసమో మేము రాజకీయాలలోకి రాలేదు. ఇంతవరకు మంత్రుల, ప్రభుత్వం చేతిలో ఉన్నపరిపాలనను తిరిగి ప్రజల చేతికే అందజేయాలనే లక్ష్యంతో వచ్చాము." "రాజకీయ దిగ్గజాల అహాన్నిఎదుర్కొని వారికి గుణపాటం నేర్పెందుకే మన పార్టీ ఆవిర్భవించింది గనుక మళ్ళీ మనం కూడా వారిలాగే ప్రవర్తించి, రేపు మన అహాన్ని అణచివేసేందుకు మరో కొత్త పార్టీ పుట్టే పరిస్థితి తెచ్చుకోవద్దని నా మనవి. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్ననా సహచరులందరూ ఎట్టి పరిస్థితిలో తాము మంత్రులమనే గర్వం, అహాన్ని ప్రదర్శించవద్దని కోరుతున్నాను. మనకి ఈ బాధ్యతలు కట్టబెట్టిన ప్రజల ముందు మంత్రులందరూ కూడా సదా వినమ్రతతో మెలుగుతూ వారి సమస్యలని పరిష్కరించాలని కోరుతున్నాను." "మన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేవిషయంలో మనకంటే ఇతర పార్టీలే మల్ల గుల్లాలు పడుతున్న సంగతి మనకందరికీ తెలుసు. అయితే వారు ఎంతకాలం మద్దతు ఇస్తారు? శాసనసభ లో మనకి మెజార్టీ వస్తుందా లేదా? అనే విషయాల గురించి మనం చింతించనవసరం లేదు. ఎందుకంటే అదిమన సమస్య కానే కాదు. మన లక్ష్యం మీదనే దృష్టి కేంద్రీకరించి ముందుకు సాగుతూ ఉండటమే మన కర్తవ్యం. మనకి మద్దతు ఉన్నంత కాలం మన పని మనం చేసుకుపోదాము. అది పోయిననాడు మళ్ళీ ప్రజల వద్దకే వెళదాము. వారికి మన పని తీరు నచ్చినట్లయితే వారే ఈసారి మనకి పూర్తి మెజార్టీ కట్టబెడతారు. మనకి అవకాశం ఉన్నంత వరకు ప్రజా సమస్యలను పరిష్కరించడానికే సమయాన్ని సద్వినియోగం చేసుకొందాము,” అని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ తన ఉపన్యాసం ముగించిన తరువాత చివరిలో స్వర్గీయ మన్నాడే పాడిన ఒక దేశభక్తి గీతం స్వయంగా పాడారు. ఆయనతో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన అనుచరులు, సభకు వచ్చిన వేలాది ప్రజలు కోరస్ పాడటం గమనిస్తే ఆమాద్మీ పార్టీతో ప్రజలు ఎంతగా మమేకమయ్యారో అర్ధం అవుతుంది. ఇక మరో విశేషం ఏమిటంటే సభ ముగిసిన తరువాత అరవింద్ కేజ్రీవాల్ ప్రజలనుద్దేశ్యించి మాట్లాడుతూ “ఇక నుండి ప్రభుత్వాధికారి ఎవరయినా మిమ్మల్నిఏదయినా పని చేసి పెట్టేందుకు లంచం అడిగితే కాదనకండి. అందరం కలిసి అటువంటి అవినీతిపరుల భారతం పడదాము. మరొక రెండు మూడు రోజుల్లో మీకు ఒక ప్రత్యేక ఫోన్ నెంబర్ ఇస్తాము. ఈసారి ఎవరయినా అధికారి లంచం అడిగినట్లయితే వారి వివరాలు ఆ నెంబరుకి పంపితే అటువంటి వారిని వలేసి పట్టుకొందాము” అని చెప్పడంతో ప్రజలు పెద్ద ఎత్తున హర్షద్వానాలు పలికారు. అరవింద్ కేజ్రీవాల్ మరియు అతని సహచరులు ఇదే స్పూర్తిని సదా కొనసాగించి సామాన్యులకు సేవ చేసే ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థని, ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని ఆశిద్దాము. వారి స్పూర్తితో ఈ ఉద్యమం వంటి సుపరిపాలన దేశమంతటా వ్యాపించి అవినీతిరహిత భారతదేశం ఏర్పడాలని కోరుకొందాము.
http://www.teluguone.com/news/content/arvind-kejriwal-37-28841.html