బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. పోటీకి ప్రశాంత్ కిశోర్ దూరం
Publish Date:Oct 15, 2025
Advertisement
బీహార్ లో రాజకీయ వేడి రగులుకుంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడిన వేళ ఎన్డీయే కూటమి, ఇండియా కూటమి..అదే మహాఘట్ బంధన్ లు సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. వాటి కంటే ముందు.. రాజకీయవేత్తగా మారిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తన జన సురాజ్ పార్టీ తరఫున ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించేశారు. ఇక ఎన్డీయేలో సీట్ల సర్దుబాటు విషయం ఓ కొలిక్కి వచ్చింది. భాగస్వామ్య పార్టీలలో ఏ పార్టీ ఎన్ని స్థానాలలో పోటీ చేయాలన్న ఒక క్లారిటీకి వచ్చింది. బీజేపీ అయితే తొలి జాబితా రెడీ చేసేసుకుంది. మరో వైపు మహాఘట్ బంధన్ లో మాత్రం సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి రాలేదు. ఈ విషయంలో భాగస్వామ్య పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. అదలా ఉంటే.. ఎన్నికల వేళ జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ తాను ఈ సారి పోటీలో దిగడం లేదని ప్రకటించి సంచలనం సృష్టించారు. మొదటి నుంచీ ఆయన మహాఘట్ బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ కీలక నేత తేజస్వి ప్రసాద్ పోటీ చేసే రాఘోపుర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ప్రశాంత్ కిషోర్ ప్రకటించిన తొలి జాబితాలో రాఘోపుర్ ఉన్నప్టికీ, అక్కడ నుంచి పోటీకి ఆయన మరో అభ్యర్థి పేరు ప్రకటించారు. దీంతో ఆయన పోటీ చేస్తారా లేదా అన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ సారి ఎన్నికలలో తాను పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ విషయం చెప్పారు. తాను ఈ సారి ఎన్నికలలో పూర్తిగా పార్టీ విజయం కోసం మాత్రమే పని చేస్తాననీ, పోటీలో ఉండననీ తేల్చి చెప్పారు. రాఘోపుర్ ఎమ్మెల్యేగా తేజస్వీ యాదవ్పై పోటీకి మరో అభ్యర్థిని నిలబెట్టినట్లు చెప్పారు. పార్టీ ప్రయోజనాల కోసం తాను పోటీకి దూరం అయ్యాననీ, తాను పోటీ చేస్తే పార్టీ వ్యవహారాలపై దృష్టిని పూర్తిగా కేంద్రీకరించడానికి అవకాశం ఉండదన్న ఉద్దేశంతో తానీ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
http://www.teluguone.com/news/content/prashant-kishor-wount-contest-39-207955.html





