సికిందరాబాద్ స్టేషన్లో కాల్పులు.. ఒకరి మృతి
Publish Date:Jun 17, 2022
Advertisement
త్రివిధ దళాల్లో రిక్రూట్మెంట్ కోసం రక్షణశాఖ చేపట్టిన అగ్నిపథ్ నియామకాలపై నిరసనలు దేశవ్యాప్తంగా భగ్గుమన్నాయి. నాలుగేళ్లు సర్వీస్ అంటూ కేంద్రం తమను పిచ్చివాళ్లను చేస్తోందని సైనిక నియామక రిక్రూట్మెంట్కు ప్రిపేర్ అవుతున్న యువత మండి పడుతోంది. దేశ వ్యాప్తంగా యువత ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయి. బీహార్ ,ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ , పంజాబ్ , హర్యానా రాష్ట్రాల్లో హింస చెలరేగింది. తాజాగా గురువారం యువత ఆగ్రహజ్వాలల్లో సికిందరాబాద్ స్టేషన్లో రైలు దగ్ధమైంది. రైలు పట్టాలపై పార్సిల్ సామాన్లను కాల్చివేసి… నిరసన తెలిపారు. కేంద్రం వెంటనే అగ్నిపథ్ను రద్దు చేసి… యథావిధిగా సైనిక ఎంపిక జరపాలని డిమాండ్ చేశారు. రైల్వే పోలీసులు రంగప్రవేశం చేసి కొందరు ఆందోళనకారులను అదుపులోనికి తీసుకున్నారు. దీంతో కొందరు నిరసనకారులు పోలీసులపై రాళ్ల రువ్వారు. ప్రతిగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా యువత ఆందోళన దిగడానికి కేంద్రం ‘అగ్నిపథ్’ పేరుతో నిరుద్యోగుల ఆశలపై నీళ్లు పోయడమే కారణమని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అగ్నిపథ్ పేరున ఆర్మీ రిక్రూట్ మెంట్లు యువత భవిష్యత్ ను సర్వనాశనం చేస్తాయన్న విమర్శలు మేధావి వర్గం నుంచి కూడా వెల్లువెత్తుతున్నాయి.
http://www.teluguone.com/news/content/police-open-fire-in-secunderabad-railway-station-one-dead-25-137833.html





