మీడియా నెత్తిన పీఐబీ అక్షింతలు..
Publish Date:Jan 7, 2022
Advertisement
సినిమా పేరు గుర్తు లేదు కానీ, సీన్ గుర్తుంది. ధర్మవరపు సుబ్రమణ్యం (డాక్టర్) సునీల్ (పేషెంట్). డాక్టర్ చెప్పేది పూర్తిగా వినకుండానే, పేషెంట్ ఏదో అనేసుకుంటాడు. ఇప్పుడు మీడియా పని కూడా అలాగే వుంది. ముఖ్యంగా కొవిడ్ కవరేజ్ విషయంలో, అధికారులు ఏమి చెపుతున్నారో, మీడియా ఎలా అర్థం చేసుకుంటుందో గానీ, మొత్తానికి జనాలను కన్ఫూజ్ చేసి, చిత్రం చూస్తున్నారు. ఒక విధంగా అటు మీడియా ఇటు ధికారులు కూడా నవ్వుల పాలవుతున్నారు. త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో, ఎన్నికల నిర్వహణకు కొవిడ్ పరిస్థితులు ఎంతవరకు అనుకూలంగా ఉన్నాయనే విషయం చర్చించేందుకు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు, ఈ నెల (జనవరి) 6న కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఎన్నికల సంఘం అధికారులకు ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలతో పాటుగా దేశంలో, ప్రపంచంలో నెలకొన్న కొవిడ్, ఒమిక్రాన్ పరిస్థితులను వివరించారు. అదే విధంగా పెరుగతున్న కొవిడ్ కేసులను ఎదుర్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేరకు సంసిద్ధంగా ఉన్నాయో, ఇంకా ఎలాంటి చర్యలు అవసరమో కూడా వివరించారు. అదే విధంగా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల ఇరుగు పొరుగు రాష్ట్రాల పరిస్థితిని ప్రెజెంటేషన్ రూపంలో వివరిచారు. అదే విషయాన్ని మీడియాకు తెలిపారు. అయితే రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నట్లుగా, కొన్ని మీడియా, వార్తా సంస్థలు, దిన పత్రికలు, ఆయన చెప్పిందంతా విని, చూసి “దేశంలో కరోనా పరిస్థితి గురించి ఆందోళన చెందవలసిన అవసరమే లేదు” అనిన్నూ, “ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు పెరిగే ప్రమాదం లేదు” అనిన్నూ ఆరోగ్య శాఖ కార్యదర్శి భరోసా ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. కొన్ని పత్రికలు అయితే, ఈరోజో రేపో ఎన్నికల ప్రకటన వచ్చేస్తుందనే విధంగా వార్తలు వండేశాయి. ఇలా ‘కాళిదాసు కవిత్వం కొంత మన పైత్యం కొంత’ అన్నట్లుగా అల్లిన వార్త కథనాలు సత్యానికి చాలా దూరంగా, తప్పుడు సమాచారం ఇచ్చే విధంగా ఉన్నాయని, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) వివరణ ఇచ్చింది. ఇలా కరోన మహమ్మారి, కొవిడ్, ఒమిక్రాన్ మహమ్మారి ఉరుముతున్న సమయంలో మీడియా అసత్య ప్రచారం చేయడం అభ్యంతరకరమని ..అక్షింతలు కూడా వేసింది. ఇది ఈ రోజే కాదు, ప్రతి రోజూ ఉన్నదే ... ఇదే విధంగా మీడియా కరోనా తప్పులో కాలేయడం పీఐబీ అక్షింతలు వేయడం రోజువారీ కార్యక్రమంగా మారిపోయింది.
http://www.teluguone.com/news/content/pib-angry-on-media-coverage-on-five-state-election-cec-review-39-129839.html





