ఓలా డ్రైవర్ నిర్వాకం: ఎగ్జామ్ టైంలో నడిరోడ్డుపై వదిలేస్తే.. కోర్టు ఏం చేసిందంటే?
Publish Date:Jun 12, 2026
Advertisement
ప్రస్తుత రోజుల్లో నగరాల్లో ప్రయాణం చేయాలంటే చాలామంది ఓలా, ఉబర్ లాంటి క్యాబ్ లేదా ఆటో సర్వీస్ యాప్స్నే పూర్తిగా నమ్ముకుంటున్నారు. అత్యవసర సమయాల్లో ఇవి ఎంతగానో ఆదుకుంటాయని భావిస్తారు. అయితే కొన్నిసార్లు ఈ యాప్స్ నడుపుతున్న డ్రైవర్లు చేసే పనులు ప్రయాణికులకు తీవ్ర మానసిక ఆందోళనను, చుక్కలను చూపిస్తుంటాయి. సరిగ్గా ఇలాంటి ఒక షాకింగ్ ఘటనే ఆంధ్రప్రదేశ్లో వెలుగుచూసింది. తన కెరీర్లోనే అత్యంత కీలకమైన ఒక పరీక్ష రాయడానికి వెళ్తున్న యువతిని, ఓలా ఆటో డ్రైవర్ నడిరోడ్డుపై ఒంటరిగా వదిలేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ యువతి సదరు సంస్థను కోర్టుకు ఈడ్చింది. తాజాగా ఈ కేసులో కర్నూలు జిల్లా వినియోగదారుల ఫోరమ్ సంచలన తీర్పునిస్తూ ఓలా కంపెనీకి గట్టి బుద్ధి చెప్పింది. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. అసలు ఏం జరిగిందంటే, ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక యువతి తన తల్లితో కలిసి 'ఆంధ్రప్రదేశ్ జూనియర్ సివిల్ జడ్జ్ మెయిన్స్ ఎగ్జామ్' రాయడానికి సిద్ధమైంది. గుంటూరు నుండి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉన్న ఎగ్జామ్ సెంటర్కు సకాలంలో చేరుకోవాలని భావించింది. దీని కోసం ఆమె ఓలా యాప్లో ఒక ఆటోను బుక్ చేసుకుంది. అయితే ఆటో రాగానే ఆమెకు ఒక వింత అనుభవం ఎదురైంది. యాప్లో చూపించిన నెంబర్ ప్లేట్ కాకుండా వేరే వెహికల్ అక్కడికి వచ్చింది. డ్రైవర్ మొండిగా ప్రయాణం మొదలుపెట్టకముందే ఓటీపీ చెప్పాలని గట్టిగా పట్టుబట్టాడు. పరీక్షకు సమయం అయిపోతుందనే కంగారులో ఆ యువతి డ్రైవర్ అడిగిన విధంగానే ఓటీపీ చెప్పేసింది. ఇక్కడి నుంచే ఆ డ్రైవర్ అసలు నిర్వాకం మొదలైంది. ప్రయాణికులను ఎగ్జామ్ సెంటర్కు తీసుకువెళ్లకుండా ఆ డ్రైవర్ పూర్తిగా దారి మళ్లించాడు. రూట్ మార్చడమే కాకుండా, అసలు పరీక్షా కేంద్రానికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక నిర్జన ప్రదేశంలోకి వారిని తీసుకెళ్లిపోయాడు. అక్కడ ఆటో ఆపి, ఎగ్జామ్ సెంటర్కు వెళ్లాలంటే యాప్లో ఉన్న ఛార్జీల కంటే అదనంగా భారీగా ఎక్కువ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అందుకు ఆ యువతి నిరాకరించడంతో, ఏమాత్రం మానవత్వం లేకుండా ఆ యువతిని, ఆమె వృద్ధ తల్లిని నడిరోడ్డుపైనే దించేసి మొండిగా వెళ్లిపోయాడు. ఆఖరి నిమిషంలో తీవ్రమైన కంగారులో, ఆందోళనతో ఆమె సొంత ఖర్చులతో మరో ప్రైవేట్ ఆటో మాట్లాడుకుని ఎలాగోలా ఎగ్జామ్ సెంటర్కు చేరుకుంది. కానీ అంత పెద్ద జడ్జ్ ఎగ్జామ్ రాసే ముందు జరిగిన ఈ దారుణమైన గొడవ వల్ల ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడికి, ఆందోళనకు గురైంది. ప్రశాంతంగా పరీక్ష కూడా రాయలేకపోయింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె, సదరు ఓలా యాజమాన్యానికి లీగల్ నోటీసులు పంపింది. తమకు జరిగిన అన్యాయానికి రూ. 5 లక్షల నష్టపరిహారం కావాలని కర్నూలు జిల్లా వినియోగదారుల ఫోరమ్ను ఆశ్రయించింది. కోర్టులో ఓలా కంపెనీ చాలా వింతగా స్పందించి చేతులు ఎత్తేసే ప్రయత్నం చేసింది. తాము కేవలం డ్రైవర్లను, కస్టమర్లను కలిపే ఒక ఆన్లైన్ ఇంటర్మీడియరీ ప్లాట్ఫారమ్ మాత్రమేనని, డ్రైవర్లు చేసే వ్యక్తిగత తప్పులకు తమకు ఎలాంటి సంబంధం లేదని వాదించింది. తాము సదరు డ్రైవర్ను బ్లాక్ చేశామని, ఆ రైడ్కు ఎలాంటి డబ్బులు కూడా కస్టమర్ నుండి తీసుకోలేదు కాబట్టి నష్టమేమీ జరగలేదని వాదించింది. కాని వినియోగదారుల కోర్టు ఓలా వాదనను పూర్తిగా తప్పుబట్టింది. కస్టమర్లు కంపెనీ బ్రాండ్ నేమ్, యాప్ నమ్మకం చూసే బుక్ చేసుకుంటారని, ఓటీపీ కూడా ఓలా సిస్టమ్ ద్వారానే జనరేట్ అవుతుందని స్పష్టం చేసింది. డ్రైవర్ తప్పు చేస్తే కంపెనీదే పూర్తి బాధ్యత అని తేల్చిచెప్పింది. ఎగ్జామ్ రాసే అమ్మాయిని రోడ్డుపై వదిలేయడం వల్ల ఆమె తీవ్రమైన మానసిక వేదనను అనుభవించిందని కోర్టు అంగీకరించింది. అంతిమంగా, సేవల్లో తీవ్ర లోపం ఉన్నందుకు గానూ ఓలా కంపెనీ సదరు యువతికి రూ. 50,000 నష్టపరిహారం, అలాగే కోర్టు లీగల్ ఖర్చుల నిమిత్తం మరో రూ. 5,000.. మొత్తంగా రూ. 55,000 చెల్లించాలని కర్నూలు కన్స్యూమర్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కస్టమర్ల భద్రతను గాలికి వదిలేసే క్యాబ్ సంస్థలకు ఈ తీర్పు ఒక గట్టి హెచ్చరిక లాంటిదని జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/ola-driver-stranded-woman-exam-fine-36-222683.html





