ఆంధ్రప్రదేశ్–ఆస్ట్రేలియా మధ్య 4 ఎంవోయూలు : మంత్రి లోకేష్
Publish Date:Aug 2, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్- ఆస్ట్రేలియా భాగస్వామ్యంలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. క్లీన్ ఎనర్జీ, అడ్వాన్స్ డ్ మ్యానుఫ్యాక్చరింగ్, సమ్మిళిత విద్య, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి వంటి కీలక రంగాల్లో భారత్-ఆస్ట్రేలియా సహకారాన్ని మరింత బలోపేతం చేస్తూ ఏపీ ప్రభుత్వం.. ఆస్ట్రేలియాలోని ప్రముఖ విద్య, పరిశోధన, పారిశ్రామిక సంస్థలతో నాలుగు వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. శనివారం ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్, ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్య, అంతర్జాతీయ అభివృద్ధి, బహుళ సాంస్కృతిక వ్యవహారాల సహాయ మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో ఎంవోయూలపై ఇరుపక్షాల ప్రతినిధులు సంతకాలు చేశారు. నారా లోకేష్ ఆస్ట్రేలియా టూర్..ఎంవోయూలు షురూ..! విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా అక్కడి విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమల ప్రతినిధులతో జరిపారు. ఏపీకి రావాలని ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ఆహ్వానం పలికారు. ఏపీలో అవకాశాలు, ఇస్తున్న రాయితీలను వివిధ సంస్థల ప్రతినిధులకు వివరించారు. దీనిపై అప్పుడే సానుకూలంగా స్పందించారు ఆస్ట్రేలియా ప్రతినిధులు. మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా టూర్ వల్లే కీలకమైన ఎంవోయూలు జరిగాయి. ఐఐటీ తిరుపతిలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్..! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విశాఖ లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ (CoEET), ఐఐటీ తిరుపతి, ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ (UNSW) కలిసి ఐఐటీ తిరుపతిలో సోలార్ తయారీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటుచేయనున్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా ఆంధ్రప్రదేశ్ను సోలార్ తయారీ పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞాన వాణిజ్యీకరణకు జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతిపాదిత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో అధునాతన సోలార్ పీవీ తయారీ, సోలార్ ప్యానెళ్ల రీసైక్లింగ్, సర్క్యులర్ ఎకానమీ విధానాలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన పరిశోధనలు, అధ్యాపకుల సామర్థ్య అభివృద్ధి, ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలపై దృష్టి సారించనున్నారు. సోలార్ ఫోటోవోల్టాయిక్(PV) తయారీ, సర్క్యులారిటీ రంగాల్లో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా డిగ్రీయేతర విద్య, శిక్షణా కార్యక్రమాలు రూపొందించడం, అభివృద్ధి చేయడం, అమలుచేయడంలో యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ తన సహకారాన్ని అందించనుంది. సోలార్ సెల్ డివైజ్ ఫిజిక్స్, సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్, క్యారెక్టరైజేషన్, రిలయబిలిటీ ఇంజనీరింగ్, రీసైక్లింగ్, భద్రత, నిర్వహణ, ఇన్ గాట్ తయారీ, వాఫరింగ్ సాంకేతికతలు వంటి అంశాలపై కరిక్యులమ్, లెర్నింగ్ మెటీరియల్స్, అసెస్ మెంట్ ఫ్రేమ్ వర్క్, ట్రైనింగ్ కంటెంట్ ను రూపొందించనుంది. సమ్మిళత విద్య బలోపేతం కోసం..! యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ (UNSW), శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఏపీ సమగ్ర శిక్ష సంయుక్తంగా సమ్మిళిత విద్యను బలోపేతం చేసేందుకు మరో ఎంవోయూ చేసుకున్నాయి. ఆటిజం, ఇతర న్యూరోడైవర్స్ విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ భాగస్వామ్యం ప్రధాన లక్ష్యం. స్పెషల్ ఎడ్యుకేటర్స్ కు ప్రత్యేక శిక్షణ, సాధారణ ఉపాధ్యాయులకు శాస్త్రీయ ఆధారిత శిక్షణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల అవసరాలకు అనుగుణమైన బోధనా వనరుల రూపకల్పన చేపట్టనున్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిరక్షణ కోసం పైలట్ ప్రాజెక్ట్.. మూడో ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, ఆస్ట్రేలియాకు చెందిన రీబౌండ్ డింపుల్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా రాష్ట్రంలోని ఎంపిక చేసిన ఉన్నత విద్యాసంస్థల్లో సాంకేతిక ఆధారిత విద్యార్థుల మానసిక ఆరోగ్యం, సమగ్ర శ్రేయస్సుకు తోడ్పాటునందించే పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఈ వేదిక ద్వారా విద్యార్థులు తమ గోప్యతకు భంగం కలగకుండా మానసిక ఆరోగ్య సమాచార వనరులు, వెల్నెస్ అసెస్ మెంట్ టూల్స్, వర్చువల్ కౌన్సెలింగ్ సేవలను పొందగలుగుతారు. పైలట్ కార్యక్రమంలో పాల్గొనే విద్యాసంస్థలకు ఉచితంగా అమలు చేయనున్నారు. వృత్తి విద్య, నైపుణ్యాభివృద్ధికి డీఎల్ఎస్ తో ఎంవోయూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), ఆస్ట్రేలియాకు చెందిన డైనమిక్ లెర్నింగ్ సర్వీసెస్ (DLS) వృత్తి విద్య, నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన శిక్షణా కార్యక్రమాల్లో పరస్పర సహకారాన్ని అందించడానికి 4వ ఎంవోయూ జరిగింది. ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ అందించడం, విద్యా సంస్థలు-పరిశ్రమల మధ్య బలమైన అనుసంధానం ఏర్పరచడం ఈ భాగస్వామ్యం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ఎంవోయూలకు ముందు ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్య, అంతర్జాతీయ అభివృద్ధి, బహుళ సాంస్కృతిక వ్యవహారాల సహాయ మంత్రి జూలియన్ హిల్ సహా ఇతర ఆస్ట్రేలియా ప్రతినిధి బృందాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, ఏపీలో గల విస్తృత అవకాశాలను వివరించారు. అనంతరం జూలియన్ హిల్ ను సీఎం చంద్రబాబునాయుడు శాలువాతో సత్కరించారు. అరకు కాఫీని, ప్రత్యేక జ్ఞాపికను బహూకరించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య కమిషనర్ తమీమ్ అన్సారియా, రాష్ట్ర ఉన్నత విద్య కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, స్కిల్ డెవలప్ మెంట్ శాఖ ఎండీ గణేష్ కుమార్, ఐఐటీ తిరుపతి డైరెక్టర్ డా.సత్యనారాయణ్, పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ వి.ఉమా, చెన్నైలో ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ సిలై జాకీ, సహాయ కార్యదర్శి డా. డామియన్ ఒలివర్, మంత్రి సలహాదారు జార్జ్ థివియోస్, హోమ్ అఫైర్స్ రీజనల్ డైరెక్టర్ స్టీవెన్ స్టీవెన్ బిడిల్, ప్రథమ కార్యదర్శి అలిసన్ మస్ గ్రోవ్, యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ ప్రో వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ లీసా జాంబర్లాన్, రీబౌండ్ వ్యవస్థాపకులు టాడ్ కింగ్, డైనమిక్ లెర్నింగ్ సర్వీసెస్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ మేనేజర్ మ్యాక్సిమిలియన్ మెక్ కలఫ్ పాల్గొన్నారు. Nara Lokesh Australia tour, Center of Excellence, New South Wales, CM Chandrababu, Naralokesh, APSSDC
http://www.teluguone.com/news/content/nara-lokesh-australia-tour-36-227809.html





