కొత్త జిల్లాలతో సరికొత్తగా.. జగనన్న జిల్లాల వ్యూహం!
Publish Date:Apr 4, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్లో సరికొత్త భౌగోళిక ముఖచిత్రం ఆవిష్కృతమైంది. దశాబ్దాలుగా ఉంటూ వచ్చిన.. జిల్లాల స్వరూపం పూర్తిగా మారిపోయింది. 13 జిల్లాలు కాస్తా ముక్కలు ముక్కలై 26 జిల్లాలతో నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడింది. పాలనా సౌలభ్యం కోసమే అని చెప్పినా.. ప్రతీ జిల్లా వెనుక రాజకీయ వ్యూహం ఉందంటోంది విపక్షం. సీఎం జగన్ అమరావతి నుంచి వర్చువల్గా కొత్త జిల్లాలను ప్రారంభించారు. సీఎం ఎలక్ట్రానిక్ బటన్ నొక్కడంతో.. నూతన జిల్లాల ఉనికి అమల్లోకి వచ్చింది. ఆయా జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు జిల్లాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో భాగస్వామ్యులయ్యారు. "26 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంగా రూపుమారింది. గతంలో ఉన్న జిల్లా పేర్లు అలాగే ఉన్నాయి. ఆ 13 జిల్లా కేంద్రాలను అలాగే కాపాడుకున్నాం. పరిపాలనా సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరం మేరకే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశాం. ప్రజలకు పరిపాలన మరింత చేరువ కావాలనే మార్పులు చేశాం. కలెక్టర్లకు అధికారంతో పాటు ప్రజల పట్ల బాధ్యత పెరిగింది. ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు అవసరం" అని సీఎం జగన్ చెప్పారు. అయితే, కొత్త జిల్లాల స్వరూపం, జిల్లా కేంద్రం, డివిజన్లపై ఇప్పటికీ తీవ్ర ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. వాటిలో కొన్నిటిని పట్టించుకున్నా.. చాలా విజ్ఞప్తులను పక్కన పెట్టేసింది ప్రభుత్వం. దీంతో కొత్త జిల్లాలు, డివిజన్లతో ఏపీ వ్యాప్తంగా వేరు కుంపట్లు రగులుతూనే ఉన్నాయి. వైసీపీ సర్కారుపై ప్రజలు మండిపడుతూనే ఉన్నారు.
http://www.teluguone.com/news/content/new-districts-farmation-in-ap-39-133855.html





