సవాల్, ప్రతి సవాల్.. స్పీకర్ వర్సెస్ నారా లోకేష్!!
Publish Date:Nov 9, 2019
Advertisement
మాజీ సీఎం చంద్రబాబుపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. అగ్రిగోల్డ్ విషయంలో గత ప్రభుత్వం కుంభకోణాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. హాయ్ల్యాండ్ భూములను కొట్టేసేందుకు చంద్రబాబు, లోకేష్ ప్లాన్ వేశారని ఆరోపించారు. చంద్రబాబు బండారం బయటపెడతామని, ప్రజలముందు నిలుచోబెట్టి గుడ్డలూడదీస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకెంతో అనుభవం ఉందని చెప్పే చంద్రబాబు.. ఆ అనుభవాన్ని మడిచి ఎక్కడో పెట్టుకోవాలని తమ్మినేని వ్యాఖ్యానించారు. హాయ్ ల్యాండ్ భూములను చంద్రబాబు తన కుమారుడి పేరిట రాసివ్వాలని ఒత్తిడి తెచ్చారని..ఈ వ్యవహారంలో సీఎం రమేష్, యనమల రామకృష్ణుడు చక్రం తిప్పారని తమ్మినేని సీతారాం ఆరోపించారు. స్పీకర్ స్థానంలో ఉండి ప్రతిపక్ష నేతలపై బహుశా ఈ స్థాయిలో విమర్శలు చేసిన స్పీకర్ మరొకరు లేరనే చెప్పాలి. ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఆయన వ్యాఖ్యలపై టీడీపీ నేత నారా లోకేష్ కూడా స్పందించారు. బహిరంగ లేఖ రాసి స్పీకర్ స్థానాన్ని ఆగౌరవపరిచేలా మాట్లాడొద్దని కోరారు. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ శ్రీ తమ్మినేని సీతారాం గారికి, అధ్యక్షా! బడుగు, బలహీనవర్గాలకు చెందిన తమరు అత్యున్నతమైన శాసనసభాపతి స్థానం అలంకరించడం చాలా అరుదైన అవకాశం. మీ విద్యార్హతలు, రాజకీయానుభవం స్పీకర్ పదవికే వన్నె తెస్తాయని ఆశించాను. విలువలతో సభని హుందాగా నడిపిస్తా అని మీరు మాట్లాడిన మాటలు నన్నెంతో ఆకట్టుకున్నాయి. విలువలతో సభ నడిపించి ట్రెండ్ సెట్ చేస్తా అన్న మీరు స్పీకర్ పదవిలో ఉండి అసభ్య పదజాలంతో మాట్లాడే ట్రెండ్ సెట్ చేస్తారని అనుకోలేదు. ఆరుసార్లు ఇదే సభలో సభ్యుడిగా వ్యవహరించిన మీరు అదే సభకు అధ్యక్షులుగా ప్రస్తుతం ఉన్నారనే విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. సభాపతిగా ప్రతిపక్షనేతపై మీరు చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవేనా అనే అనుమానం కలుగుతోంది. ఎనిమిదిసార్లు శాసనసభకు ఎన్నికై, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా పనిచేసి విజనరీ లీడర్గా ప్రస్తుతించబడిన చంద్రబాబుగారి గురించి 'గుడ్డలూడదీయిస్తా' అంటూ మీరు చేసిన వ్యాఖ్యలు మీ స్పీకర్ స్థానాన్ని చిన్నబుచ్చేలా ఉన్నాయని నాకనిపిస్తోంది. సభామర్యాదలు మంటగలిసిపోకుండా కాపాడే గౌరవస్థానంలో ఉండి..ప్రతిపక్షనేతను అవమానిస్తూ మీరు చేసిన వ్యాఖ్యలు చాలా మంది చంద్రబాబుగారి అభిమానుల్లాగే నన్నూ బాధించాయి. బడుగు, బలహీనవర్గాల పార్టీ అయిన తెలుగుదేశం శాసనసభాపక్ష నేతని మీరు ఎన్నో మెట్లు దిగజారి దూషించి..దానినే 'నేనొక ప్రజాప్రతినిధిగా మాట్లాడుతున్నా'నంటూ సమర్థించుకోవడం హర్షణీయం కాదు. మీరు చేసిన వ్యాఖ్యలే సభలో సభ్యులెవరన్నా చేస్తే మీరెలా స్పందిస్తారు? వాటిని అన్పార్లమెంటరీ పదాలు అని తొలగిస్తారా లేక సభలో హుందాగా మాట్లాడాలి, బయట ఎలా మాట్లాడినా పరవాలేదని సూచిస్తారా? వైఎస్ హయాంలో అగ్రిగోల్డ్ మోసాలు వెలుగుచూశాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో డిపాజిట్దారుల వివరాలు సేకరించాం. న్యాయస్థానాలను ఆశ్రయించి అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడాం. ఈ రోజు అగ్రిగోల్డ్కి సంబంధించి ఒక్క సెంటుభూమి కూడా యాజమాన్యానికి, ఇతరులకు దక్కకుండా కాపాడింది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే. బాధితులకు న్యాయం చేయాలని రూ.336 కోట్లు సిద్ధంచేస్తే.. అగ్రిగోల్డ్ ఆస్తులపై కన్నేసిన వైకాపా నేతలే కోర్టులో కేసులు వేసి మరీ అడ్డుకున్నారు. ఇప్పుడు ఆ నిధుల నుండే రూ.264 కోట్లను పంపిణీ చేసి మిగతా రూ.72 కోట్లు మింగేశారు. అలాగే అగ్రిగోల్డ్ బాధితుల్ని ఆదుకునేందుకు బడ్జెట్లో కేటాయించిన రూ.1150 కోట్లు ఏమయ్యాయో తెలియడంలేదు. మీరు ఇటీవల ఉగాండా వెళ్లారు. మిమ్మల్ని కుటుంబసమేతంగా తాడేపల్లి ఇంటికి పిలిపించుకున్న జగన్ గారు మీ విదేశీ పర్యటన చాలా చక్కగా సాగాలని అభిలషిస్తూ పుష్పగుచ్ఛం అందజేశారు కూడా. అక్కడి సదస్సులో మీరు తెలుసుకున్న విలువలు, సభామర్యాదలు మన రాష్ట్ర శాసనసభకు ఎంతో ఉపయోగపడతాయి అనుకున్నాం. అలాంటిది అట్నుంచి వచ్చాక మీరు ఇలా ప్రతిపక్షనేతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల వెనుక మర్మమేంటో చెప్పగలరా? అలాగే అగ్రిగోల్డ్తో నాకు సంబంధం ఉందని కూడా మీరు వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఉన్నది మీరే కదా!అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా నాపై చేసిన ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయారు.గౌరవనీయ సభాపతి స్థానం నుంచి ప్రతిపక్షనేతపైనా, మండలి సభ్యుడినైన నాపైనా నిందారోపణలు చేయడం మీ స్పీకర్ స్థానానికి సముచితం కాదు. అగ్రిగోల్డ్ బాధితులకు టీడీపీ హయాంలో అందించే సాయాన్ని వైకాపా నేతలు అడ్డుకోకుండా ఉండి ఉంటే.. ఇప్పటికన్నా ఎక్కువ సాయమే అందేది. మీరు చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉంటాను అంటే నాదొక సవాల్. అగ్రిగోల్డ్కి సంబంధించి ఏ ఒక్క అంశంలోనైనా నాకు సంబంధం ఉందని నిరూపిస్తే నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటాను. ఒకవేళ మీరు చేసిన ఆరోపణలు అన్నీ అవాస్తవాలని తేలితే..మీరేం చేస్తారో కూడా చెప్పాలని ఈ బహిరంగ లేఖ ద్వారా సవాల్ విసురుతున్నాను. ఇటువంటి బురద జల్లే ఆలోచనలన్నిటి వెనుకా మీ పార్టీ అధ్యక్షులవారి ప్రోద్భలం, ప్రోత్సాహం ఉంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. మీ ఆరోపణలకు కూడా అదే కారణమై ఉంటుంది. కాబట్టి మీ ఆరోపణలు అవాస్తవమని తేలితే, మీరన్నట్టే ఒక ప్రజా ప్రతినిధిగా మీ పార్టీ అధ్యక్షుడి గుడ్డలూడదీసి, రాజకీయాల నుండి తప్పించేలా సవాల్ స్వీకరిస్తారని ఆశిస్తూ... ఇట్లు
నారా లోకేశ్
ఎమ్మెల్సీ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
http://www.teluguone.com/news/content/nara-lokesh-open-letter-to-speaker-tammineni-seetharam-25-91029.html