కాలేజీలకు నూతన భవనాలు.. ప్రతి నియోజకవర్గంలో మోడల్ లైబ్రరీ.!
Publish Date:Aug 19, 2026
Advertisement
ఏపీ ఎడ్యుకేషన్ సెక్టార్ లో మౌలిక వసతుల కల్పన, గ్రంథాలయ వ్యవస్థ బలోపేతం తెలుగుదేశం కూటమి ధ్యేయమని మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 37 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు శాశ్వత భవనాల నిర్మాణం, అలాగే రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ మోడల్ లైబ్రరీల ఏర్పాటుకు నిర్ణయించినట్లు శసన సభ వేదికగా ప్రకటించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు సమాధానాలిచ్చిన ఆయన ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థితిగతులపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అడిగిన ప్రశ్నకు ఆళ్లగడ్డ కళాశాలలో ప్రస్తుతం 103 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని, తగిన భూమి కూడా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ప్రత్యేక నిధుల కేటాయింపు ద్వారా ఆ కళాశాలకు నూతన భవన నిర్మాణం, దెబ్బతిన్న కాంపౌండ్ వాల్ పునర్నిర్మాణం చేపడతామన్నారు. బోధన, బోధనేతర సిబ్బంది నియామకంతో పాటు ఎమ్మెల్యే కోటా నిధులు ఉపయోగించి కంప్యూటర్లు, ల్యాబ్ పరికరాలు, బెంచీలను సమకూర్చుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు సూచించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నాణ్యమైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి నారా లోకేష్.. ఒక్కో కళాశాల సకల సౌకర్యాలతో రూపుదిద్దుకోవడానికి 15 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని, దశలవారీగా నిధులు విడుదల చేస్తూ అన్ని కళాశాలల్లో విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పిస్తామని వివరించారు. నాణ్యమైన విద్యతో పాటు మౌలిక సదుపాయాలు ఉంటేనే విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకోగలరన్నారు. గ్రంథాలయాల పునరుద్ధరణ అంశంపై మంత్రి లోకేష్ సవివరంగా చెప్పారు. కడప గ్రంథాలయ భవన నిర్మాణ పనుల ఆలస్యంపై ఎమ్మెల్యే మాధవీ రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, 9 నెలల వ్యవధిలో ఆ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. వైసీపీ హయాంలో గ్రంథాలయ రంగానికి చెందాల్సిన సెస్ నిధులను ఖజానాకు మళ్లించారని, తమ ప్రభుత్వం రాగానే ఆ నిధులను తిరిగి గ్రంథాలయ బోర్డుకు జమ అయ్యేలా చర్యలు చేపట్టామన్న ఆయన.. మంగళగిరిలో కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన మోడల్ లైబ్రరీ మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. వందలాది మంది అభ్యర్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు రాత్రి వేళల్లో కూడా చదువుకునేందుకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. ఇదే నమూనాను ప్రామాణికంగా తీసుకుని రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మోడల్ గ్రంథాలయాలను నిర్మించాలని నిర్ణయించినట్లు సభా ముఖంగా తెలిపారు. అమరావతిని విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో సెంట్రల్ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పుస్తక పఠన అలవాటు పిల్లల్లో సృజనాత్మక ఆలోచనా శక్తిని, విశ్లేషణాత్మక నైపుణ్యాలను పెంపొందిస్తుందన్నారు. నేటి డిజిటల్ యుగంలో ప్రతికూల ప్రభావాలు చూపుతున్న స్మార్ట్ఫోన్లు, టాబ్లకు పిల్లలను దూరం చేసి, తిరిగి పుస్తకాల వైపు మళ్లించడంలో గ్రంథాలయాలు వంతెనగా పనిచేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. Nara Lokesh AP Assembly, 37 Government Degree Colleges AP, 175 Constituency Model Libraries AP, Amaravati World Class Central Library, AP Education Infrastructure News
http://www.teluguone.com/news/content/nara-lokesh-ap-assembly-39-229281.html





