విద్యార్థిని శివాని ఆత్మహత్యపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. దర్యాప్తుకు ఆదేశం..!
Publish Date:Jul 27, 2026
Advertisement
సీఎంను కలిసి మూడు రోజులకే గిరిజన విద్యార్థిని సుసైడ్..! ధైర్యంగా ఉండాలంటూ యువతకు చంద్రబాబు పిలుపు..! ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాంతానికి చెందిన గిరిజన విద్యార్థిని ముర్రం శివాని హఠాన్మరణం చెందడం తీవ్ర కలకలాన్ని రేపింది. పదో తరగతి చదువుతున్న ఈ ప్రతిభావంతురాలైన బాలిక అకస్మాత్తుగా ఆత్మహత్యకు పాల్పడడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం తెలిపారు. శోకసంద్రంలో మునిగిన ఆ కుటుంబానికి ఆయన తన సానుభూతిని వ్యక్తంచేశారు. కేవలం మూడు రోజుల క్రితమే రంపచోడవరంలో నిర్వహించిన 'తల్లికి వందనం' కార్యక్రమంలో శివాని ఎంతో ఉత్సాహంగా పాల్గొంది. ఆ వేదికపై ముఖ్యమంత్రిని నేరుగా కలిసి మాట్లాడిన ఈ చిచ్చరపిడుగు, భవిష్యత్తులో తాను 'షైనింగ్ స్టార్'గా ఎదుగుతానని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పింది. సీఎం చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకుంటానని ఆమె ప్రకటించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. శివాని లోని నమ్మకాన్ని, చదువు పట్ల ఆమెకున్న ఆసక్తిని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమెతో కలసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆ సమయంలో ఆమెతో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించడమే కాకుండా జ్ఞాపకంగా ఒక సెల్ఫీ కూడా దిగారు. అంతేకాకుండా, నిరంతరం బాగా చదువుకుంటూ తన పురోగతి గురించి సమాచారం అందించాలని ఆమెను ప్రోత్సహించారు. అయితే అందరూ మెచ్చేలా ఎంతో ఆనందంగా కనిపించిన ఆ చిన్నారి, అంతలోనే ఇంట్లో బలవన్మరణానికి ఒడిగట్టడం స్థానికులను, విద్యాశాఖ అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన లేఖలో తన కష్టాలను భరించలేకపోతున్నానని, కన్నవారిపై ఉన్న ప్రేమను వ్యక్తంచేస్తూ తీవ్ర మనోవేదనకు లోనైంది. కుటుంబ సభ్యులంతా కలసిమెలసి ఉండాలని కోరుతూ వీడ్కోలు పలికింది. శివాని ఘోర నిర్ణయంపై స్పందించిన ముఖ్యమంత్రి, ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక గిరిజన బిడ్డ ఇలా చిన్న వయసులోనే కలలు వికసించకుండానే అనంత లోకాలకు వెళ్లడం తనను ఎంతగానో కలచివేసిందని వ్యాఖ్యానించారు. ఈ విచారకరమైన సంఘటన వెనుక ఉన్న కారణాలను సమగ్రంగా వెలికితీయాలని, తక్షణమే పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు సీఎం చంద్రబాబు ఒక ముఖ్యమైన పిలుపునిచ్చారు. జీవితంలో ఎలాంటి కష్టాలు, మానసిక ఒత్తిళ్లు ఎదురైనా ఆత్మహత్య పరిష్కారం కాదని స్పష్టం చేశారు. అధైర్యపడి ప్రాణాలు తీసుకోవద్దని, ప్రభుత్వం విద్యార్థులకు, గిరిజన బిడ్డల పురోగతికి అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఒకవైపు ఉజ్జ్వల భవిష్యత్తు ఉన్న గిరిజన విద్యార్థిని ఆకస్మిక మృతి రంపచోడవరం మన్యంలో విషాద ఛాయలు నింపగా, ఆమె ఆత్మహత్యకు గల అసలు కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పాఠశాలల్లో విద్యార్థులకు మానసిక కౌన్సిలింగ్ అందించాలని విద్యావేత్తలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. Murram Shivani, CM Chandrababu,Tribal Student Suicide, Rampachodavaram, Thalliki Vandanam, Student Suicide
http://www.teluguone.com/news/content/murram-shivani-36-227239.html





