జపాన్ ను వణికించిన భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
Publish Date:Apr 20, 2026
Advertisement
జపాన్ ను భారీ భూకంపంతో గజగజలాడించింది. పశ్చిమ జపాన్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంప ధాటికి పలు భవనాలు కుప్పకూలినట్లు చెబుతున్నారు. భూకంపం తరువాత అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ భూకంపం జపాన్ లోని ఇషికావా పరిధిలోని నోటో ద్వీపంలో సంభవించింది. దాదాపు నిముషం పాటు భూమి కంపించింది. దీంతో ఇళ్లలోని వస్తువులు కింద పడిపోవడం, విద్యుత్ స్తంభాలు నేలకొరగడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా వాజిమా నగరంలో భూకంప తీవ్రత అధికంగా ఉంది. అనేక చోట్ల అగ్నిప్రమాదాలు కూడా సంభవించాయని సమాచారం. భయాందోళనలకు గురైన ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం సంభవించిన వెంటనే జపాన్ వాతావరణ శాఖ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తీరప్రాంతాల్లో నివసించే వారు ఎత్తైన ప్రాంతాలకు చేరుకోవాలని మైకుల ద్వారా హెచ్చరించింది. రైలు సర్వీసులను నిలిపివేశారు మరియు విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనం చీకటిలో మగ్గుతున్నాయి. కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. కుప్పకూలిన భవనాల శిధిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రాణనష్టంపై స్పష్టత లేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రోడ్లు దెబ్బతినడం వల్ల మారుమూల గ్రామాలకు చేరుకోవడం రెస్క్యూ టీమ్స్కు సవాలుగా మారింది. సునామీ భయం ఇంకా తొలగిపోకపోవడంతో ప్రజలు ఆందోళనలోనే గడుపుతున్నారు. అంతర్జాతీయ సమాజం కూడా జపాన్ పరిస్థితిని గమనిస్తోంది. జపాన్ ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు చర్యలు ప్రాణనష్టాన్ని తగ్గించడంలో ఎంతవరకు తోడ్పడతాయో వేచి చూడాలి. పూర్తి స్థాయి నష్టం అంచనా వేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
http://www.teluguone.com/news/content/massive-earthquake-rocks-japan-36-217794.html





