ప్రేమ పెళ్లి.. విషాదాంతం.. ఆరు నెలల పసిబిడ్డ అనాథ
Publish Date:Jun 29, 2026
Advertisement
గత కొంతకాలంగా ప్రేమించుకున్న యువతి, యువకుడు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా ఆరు నెలల క్రితం ఓ పసిబిడ్డ జన్మించింది. అయితే ఏమైందో ఏమో.. ఆ ప్రేమజంట తీసుకున్న కఠిన నిర్ణయం ఆ చిన్నారి జీవితాన్ని అంధకారంలోకి నెట్టింది. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా జన్వాడలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం, బలసాయి, పద్మ ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారు జన్వాడలో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఐదు నెలల పసిబిడ్డ ఉంది. అయితే ఆదివారం తమ నివాసంలోనే బలసాయి, పద్మ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు లేదా ఇతర వ్యక్తిగత కారణాలేమైనా ఉన్నాయా అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, దర్యాప్తు వివరాల ఆధారంగా పూర్తి సమాచారం వెలుగులోకి రానుంది. ఇద్దరు తల్లిదండ్రులు ఒకేసారి మృతి చెందడంతో కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల ప్రేమ, ఆదరణ కోల్పోయి అనాథగా మారిన ఆరు నెలల పసిబిడ్డను చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు.
http://www.teluguone.com/news/content/love-marriage-36-224502.html





