సైబర్ మోసానికి గురైన కావలి ఎమ్మెల్యే
Publish Date:Sep 27, 2025
Advertisement
సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ సైబర్ మోసాలకి అతీతులు కారన్నట్లుగా బలౌతున్నారు. ఉన్నత విద్యావంతులు, ఐఏఎస్ అధికారులూ కూడా సైబర్ మోసగాళ్ల వలలో పడుతున్నారు. సైబర్ మోసాలపై ప్రభుత్వాలు ఎంతగా ప్రచారం చేస్తూ ప్రజలను అప్రమత్తులను చేస్తున్నా.. వారి వలలో పడి జేబులు గుల్ల చేసుకుంటున్నవారి సంఖ్యపెరుగుతూనే వస్తున్నది. తాజాగా నెల్లూరు జిల్లా కావలి టీడీపీ ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వారి జాబితాలో చేరారు. సైబర్ నేరగాళ్లు ఆయన ఖాతా నుంచి 23.16లక్షల రూపాయలు దశలవారీగా కాజేశారు. వివరాల్లోకి వెడితే.. గత నెల 22న కావడి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి ఓ ఫేక్ ఆర్టీఏ లింక్ వచ్చింది. దానిని క్లిక్ చేసిన ఎమ్మెల్యే… అది తన కంపెనీ వాహనాల బకాయిలు అనుకున్నారు. కానీ ఆ లింక్ ను క్లిక్ చేయడమే ఎమ్మెల్యే సిమ్ కార్డ్ బ్లాక్ కావడానికి కారణమైంది. వెంటనే స్పందించిన ఆయన, సిమ్ సమస్య పరిష్కరించేందుకు హైదరాబాద్లోని ఆధార్ విజిలెన్స్ విభాగాన్ని సంప్రదించారు. దీంతో ఆయన సిమ్ మళ్లీ పనిచేయడం ప్రారంభించింది. ఆ సమయంలో అసలు మోసం బయటపడింది. ఆయనకు చెందిన రెండు యాక్సిస్ బ్యాంక్ ఖాతాల నుంచి (ఆగస్ట్ 25వ తేదీ నుంచి సెప్టెంబర్ 16 వరకు) యూపీఐ ద్వారా దశల వారీగా 23,16,009 రూపాయలు గల్లంతయ్యాయి. ఈ విషయాన్ని ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి ఆయన కంపెనీ సిబ్బంది ద్వారా ఈ ఆలస్యంగా తెలిసింది. వెంటనే స్పందించిన ఆయన , కావలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
http://www.teluguone.com/news/content/kavali-mla-lost-23lacs-36-206990.html





