ఆ కుటుంబానికి వేల కోట్ల ఆస్తులు...అప్పులు రాష్ట్ర ప్రజలకు : కడియం
Publish Date:Apr 21, 2026
Advertisement
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రజా సమాఖ్య పోరాటాలు, సకల జనుల సమ్మె, అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడినప్పటికీ… అది ఒకే కుటుంబానికి పరిమితమైందని ఆయన విమర్శించారు. తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబమే లాభపడిందని ఆరోపించారు. ఆ కుటుంబం వేల కోట్ల ఆస్తులు, వందల ఎకరాల భూములు, ఫామ్ హౌస్లు సంపాదించగా… అప్పులు మాత్రం ప్రజల మీద మోపారని కడియం అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని అవినీతి, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమైన విధానాలు నచ్చక… తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రస్తుతం భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని తెలిపారు. గతంలో పనిచేయని వారు, తప్పులు చేసి ఎమ్మెల్యే పదవికి తలవంపులు తెచ్చిన వారే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని కడియం శ్రీహరి మండిపడ్డారు. తాను ఎప్పుడూ చిన్న తప్పు కూడా చేయలేదని, ప్రజల గౌరవాన్ని కాపాడే విధంగా పనిచేస్తానని స్పష్టం చేశారు.“నేను ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదు. నా నిజాయితీనే నన్ను రాజకీయంగా నిలబెట్టింది. నేను అవినీతి చేశానని నిరూపిస్తే వెంటనే రాజీనామా చేస్తాను” అని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారి దుమారం రేపుతున్నాయి.
http://www.teluguone.com/news/content/kadiyam-sriharis-sensational-comments-36-217864.html





