జగన్ అప్పుల రికార్డు నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్
Publish Date:May 30, 2022
Advertisement
ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి అధికార పగ్గాలు చేపట్టి సోమవారం ( మే 30) నాటికి సరిగ్గా మూడేళ్లు పూర్తయ్యింది. ఈ మూడేళ్ల కాలంలో జగన్ ఒక విషయంలో నభూతో న భవిష్యతి అన్న రికార్డు సాధించారు. ఎందులో అంటే అప్పులు చేయడంలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా రాష్ట్రం ఈ స్థాయిలో అప్పులు చేయలేదు. ఏటా లక్ష కోట్లకు తక్కువ కాకుండా అప్పులు చేస్తూ జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, ఆర్థిక వ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టి వేయడంలో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాది ఒక్క మే నెలలోనూ దాదాపు పది వేల కోట్ల రూపాయలు జగన్ సర్కార్ అప్పు చేసింది. ఇదీ ఆర్బీఐలో బాండ్ల వేలం ద్వారా. ఇది గతంలో ఎవరూ సాధించని, భవిష్యత్ లో ఎవరూ బ్రేక్ చేయలేని రికార్డు. ఇక ఏప్రిల్ నెలలో కూడా ఏపీ ప్రభుత్వం నాలుగువేల రూపాయల పైచిలుకు అప్పులు చేసింది. అంటే ఏప్రిల్, మే నెలలలో ఏపీ సర్కార్ దాదాపు 14వేల కోట్ల రూపాయలు అప్పు చేసి పబ్బం గడుపుకుందన్న మాట. రాష్ట్ర జీడీపీలో 78 శాతం అంటే ఏడు కోట్ల 88 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడేళ్లలో చేసింది. కానీ రికార్డుల్లో మాత్రం 38 శాతం అప్పులు చేసినట్లుగా చూపించింది. నిబంధనల ప్రకారం అయితే ఇంతటి ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడిన ఏపీలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలి. మరో మూడేళ్ల వరకూ పైసా అప్పు చేసేందుకు అనుమతులు ఇవ్వకూడదు. కానీ కేంద్రం ఎందుకో ఆంధ్ర ప్రదేశ్ మీద, జగన్ ప్రభుత్వం మీదా అవధులు లేని ప్రేమ చూపిస్తోంది. ఉదారంగా అప్పులకు అనుమతులు ఇచ్చేస్తోంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాళా స్థాయికి చేరినా పట్టించుకోవడం లేదు. మీ అప్పులు మీ ఇష్టం అన్నట్లుగా ఏపీని కేంద్రం వదిలేసింది. అదే తెలంగాణ విషయంలో ఎక్కడ లేని శ్రద్ధా చూపిస్తోంది. తెలంగాణకు పైసా అప్పు తీసుకోవడానికి కూడా అనుమతులు ఇవ్వడం లేదు.ఏపీలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించే పరిస్థితులు దాపురిస్తున్నా చూసీ చూడనట్లు వదిలేస్తున్న కేంద్రం.. తెలంగాణ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాపాడటం తన కర్తవ్యం అన్నట్లుగా అప్పులకు అనుమతులు ఇవ్వడంలేదు. ఏపీ పట్ల కేంద్రం చూపుతున్న ఈ ప్రేమ న భూతో న భవిష్యత్ అని ఆర్థిక నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అవధులు లేని ప్రేమ వల్ల రాష్ట్రానికి మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని వారు విశ్లేషిస్తున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. కేంద్రం ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాపాడటమే తన ధ్యేయం అన్నట్లుగా ఎక్కడ లేని శ్రద్ధా కనిపిస్తున్నది.పరిమితికి మించి ఒక్క రూపాయి కూడా అప్పు చేయడానికి అనుమతించేది లేదని భీష్మించుకు కూర్చుంది. ఏపీకి గత ఏడాది మురిగిపోయిన అప్పు పరిమితిని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చేసింది. ఇప్పటి వరకూ ఇలాంటి అనుమతి పొందిన రాష్ట్రం ఏపీ తప్ప మరొకటి లేదంటే కేంద్రంలోని మోడీ సర్కార్ జగన్ సర్కార్ పై చూపుతున్న అపారమైన ప్రేమ ఏమిటో అర్ధం అవుతుంది. అయితే పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు మాత్రం అలాంటి అనుమతి ఇవ్వడానికి ససేమిరా అంటోంది. పరిశీలకులు మాత్రం ఇదంతా రాజకీయ మహిమేనంటున్నారు. భవిష్యత్ లో ఏపీ అధోగతి పాలైతే మాకేంటి... ఇఫ్పుడు రాష్ట్ర పతి ఎన్నికలలో ఆ పార్టీ మా అభ్యర్థికి మద్దతు ఇవ్వడమే కావాలి అన్నది కేంద్రం ధోరణిగా కనిపిస్తోందని వారు విశ్లేషిస్తున్నారు. తెలంగాణకు ఉదారంగా అప్పులకు అనుమతి ఇచ్చినా టీఆర్ఎస్ ఎంపీలు రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్థికి మద్దతిచ్చే అవకాశం లేదు కనుకే ఆ రాష్ట్రం ఇబ్బందుల గురించి కేంద్రం పట్టించుకోవడం లేదని వారు వివరిస్తున్నారు. ఏది ఏమైనా రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా రాష్ట్రాల పట్ల కేంద్రం వ్యవహరించడం మాత్రం సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు లాంటిదనడంలో సందేహం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఒక రాష్ట్రం పట్ల ప్రేమ, మరో రాష్ట్రం పట్ల కక్ష సాధింపుతో వ్యవహరించడం గతంలో ఎన్నడూ చూడలేదని రాజకీయ పండితులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/jagan-three-years-rule-record-loans-25-136709.html





