అమలాపురం చిచ్చు.. ప్రభుత్వ కుట్రే.. బయటపడుతున్న వాస్తవాలు!
Publish Date:May 26, 2022
Advertisement
అమలాపురం లో విధ్వంసం వెనుక ఉన్నది ప్రభుత్వ కుట్రే అనడానికి ఆధారాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రభుత్వం పక్కా ప్రణాళితో కోనసీమలో చిచ్చు రగిల్చిందని తేలిపోయింది. జగన్ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే ప్రశాంతతకు నిలయమైన కోనసీమలో విద్వేషాగ్ని రగిల్చేందుకు ప్రయత్నించిందని తేటతెల్లమైపోయింది. 13 జిల్లాలను 26 జిల్లాలుగా పెంచుతూ ప్రకటన చేయడంతోనే ఈ కుట్రకు శ్రీకారం చుట్టిందని తేలిపోయింది. ఎలాగంటే.. 13 జిల్లాలను 26కు పెంచుతూ ప్రకటన చేసిన రోజు అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లాను ప్రకటించారు. అప్పట్లోనే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా ప్రకటించాలంటూ వచ్చిన విజ్ణప్తులను పట్టించుకోలేదు. కోనసీమ జిల్లాగా ప్రకటించిన అనంతరం వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక యువకులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. కేకులు కట్ చేసుకున్నారు. ఇప్పుడు అందుకు సంబంధించిన ఆధారాలు బయటపడటంో కుట్ర కోణం పూర్తిగా వెల్లడైందని పరిశీలకులు అంటున్నారు.ఎందుకంటే కోనసీమ జిల్లాగా ప్రకటించినప్పుడు సంబరాలు చేసుకున్న వైసీపీ నేతలు.. ఆ తరువాత ఆ పేరును అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా ప్రకటించడాన్ని స్వాగతించారని భావించజాలం. నాడే జిల్లా పేరు మార్పు అదును చూసి ప్రకటించి విద్వేషాలు రెచ్చగొట్టేలా పక్కా ప్రణాళిక రూపొందించారన్నది పరిశీలకుల కథనం. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ అగ్రనేతలు పథకం ప్రకారం అంబేడ్కర్ పేరును రొంపిలోకి లాగారని వారు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలని తెలుగుదేశం, జనసేన పార్టీలు సైతం కోరాయి. అయినా జిల్లాల ఏర్పాటు సమయంలో కానీ, తిరిగి కోనసీమ జిల్లా పేర్పు విషయంలో కానీ జగన్ సర్కార్ ఎవరితోనూ చర్చించలేదు. ఎవరి అభిప్రాయం తీసుకోలేదు. అంతా జగన్ ఇష్టారాజ్యం అన్నట్లుగా జిల్లాల ఏర్పాటు ప్రక్రియ సాగిపోయింది. ఇక కోనసీమ జిల్లా పేరును అండేడ్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తున్నట్లు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి అభ్యంతరాలు తెలియజేయడానికి 30 రోజులు గడువు ఇచ్చినప్పటికీ.. జల్లా పేరు అంబేడ్కర్ కోనసీమగా మారిపోయిందన్నట్లుగానే వైసీపీ నేతలు, మంత్రులు ప్రసంగాలు ప్రారంభించేశారు. ఇక విధ్వంసం వెనుక ఉన్న కుట్రను ప్రస్ఫుటంగా బయటపెట్టే మరో అంశం మంత్రి ఇల్లు తగులబడిపోతుంటే.. ఒక్క అగ్నిమాపక శకటం కూడా ఆ ప్రాంతానికి రాకపోవడమే. విపక్షాలు చిన్న ఆందోళన కార్యక్రమానికి పిలుపు నిస్తేనే వేల సంఖ్యలో పోలీసులను మోహరించి ఆయా పార్టీల నేతలను హౌస్ అరెస్టు చేయడమో, ముందస్తుగా అదుపులోనికి తీసుకోవడమో చేసే పోలీసులు ఛలో అమలాపురానికి జిల్లా సాధన సమితి పిలుపునిస్తే.. కేవలం 144వ సెక్షన్ విధించి చేతులు ముడుచుకు కూర్చోడానికి కారణమేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ పెద్దల నుంచి స్పష్టమైన ఆదేశాలతోనే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని, విధ్వంసం వెనుక ప్రభుత్వ కుట్ర ఉందనడానికి ఇంత కంటే పెద్ద నిదర్శనం ఏం కావాలని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/jagan-goverment-behind-amalapuram-violnce-25-136472.html





