జగన్ పక్కా బిజినెస్మేన్.. శ్రీలంకలా ఏపీ మారడం ఖాయం.. ఉండవల్లి సంచలనం..
Publish Date:Apr 16, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం ఆర్థిక అరాచకత్వానికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రజాధనాన్ని తనకు ఓట్లు రాల్చి పెట్టేందుకు వీలుగా సంక్షేమ పథకాల మాటున పందేరం చేస్తున్నారు. దీన్నే క్విడ్ ప్రోకో అంటారని మాజీ ఎంపీ, జగన్ తండ్రి వైఎస్ అనుయాయి అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ అంటున్నారు. జగన్ కు నీకిది...నాకిది అన్న చందంగా క్విడ్ ప్రొకో మాటున లబ్ధి పొందడం తన తండ్రి వైఎస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచీ అలవాటే. అందుకుసంబంధించిన ఆర్థిక నేరాలపై జగన్ పై ఇప్పటికీ విచారణ జరుగుతోంది. వ్యాపారంలో క్విడ్ ప్రోకోను కూపీలాగి నిగ్గుతీయడానికి విచారణ సంస్థలు ఉన్నాయి. అయితే సంక్షేమం మాటున ఓట్ల లబ్ధికి పాల్పడే క్విడ్ ప్రోకో నిఘా సంస్థల పరిధిలోనికి రాదన్న ధీమా జగన్ లో కనిపిస్తున్నది. డబ్బులను తమ జేబులోంచి ఇస్తున్నట్లుగా చేతికి ఎముకే లేదన్నట్లుగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఇలా చేయడం వల్ల రాష్ట్రం దివాళా తీయడం, అభివృద్ధి కుంటుపడటమే కాకుండా రాష్ట్రంలో శ్రీలంక పరిస్థితులు ఏర్పడే ముప్పు కూడా ఉందన్న ఆర్థిక రంగ నిపుణుల హెచ్చరికలు సీఎం జగన్ చెవికి ఎక్కడం లేదు. రెండేళ్ల తరువాత అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లు రాబట్టడమే లక్ష్యంగా డబ్బుల పందేరంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ప్రభుత్వాధినేతగా బాధ్యతాయుత పదవిలో ఉండి ప్రభుత్వ ధనంతో జూదం ఆడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏదో ఒక సాకుతో...తనకు అంటే తన పార్టీకి ఓట్లు వేస్తారని నమ్ముతున్న వర్గాలను సొమ్ముల పందేరంలో తనకు ఎవరూ సాటిలేరన్న చందంగా జగన్ ఈ సొమ్ము బదిలీ విద్యలో ఆరి తేరారు. ఆఖరికి కేంద్రం విపత్తు నిర్వహణ కోసం ఇచ్చిన సొమ్మును కూడా తన ఓటు బ్యాంకు విస్తరణ పథకం కోసం వాడుసుకున్నారు. అంతెందుకు ఉచిత బియ్యానికి బదులుగా లబ్ధిదారులకు ఆ మేరకు సొమ్ము బదిలీ చేసేప్రతిపాదనను తెరపైకి తీసుకు వచ్చే సాహసం చేశారంటే...తన అధికారాన్నిఆయన ఏ స్థాయిలో ఎన్నికల లబ్థి కోసం వాడుకుంటున్నారో అర్ధం చేసుకోవచ్చు. నిజానికి ఓటు బ్యాంకు లక్ష్యంగా ప్రభుత్వాలు చేసే ఉచిత పందేరాలను అడ్డుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే దీనిని నియంత్రించే బాధ్యత ఎవరు తీసుకోవాలి. ఎన్నికలను నిర్వహణ బాధ్యత ఉన్న ఎన్నికల సంఘమే ప్రభుత్వాలు జనాలను ప్రలోభ పెట్టే పందేరాలను నియంత్రించాలి. అయితే ఆ పని తమది కాదని ఎన్నికల సంఘం ఇటీవల తేల్చేసింది. కాగ్ వంటి సంస్థల నివేదికలను ప్రభుత్వాలుపట్టించుకోకుండా బుట్ట దాఖలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాల దుబారాను, ఆర్థిక అరాచకత్వాన్ని అడ్డుకొనే ఒక పటిష్ట వ్యవస్థ అవసరం ఉంది.
నిజానికి నీతి ఆయోగ్ ఏర్పాటు ఉద్దేశమే ఇది. కానీ...అభివృద్ధి..రాజకీయాలు జుగల్ బందీగా సాగుతున్న తీరు నీతి ఆయోగ్ ను కూడా ఒక ఉత్సవ విగ్రహంగా మార్చేసింది. రాష్ట్రాలను మరీ ముఖ్యంగా బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నరాష్ట్రాల పట్ల కేంద్రంలోని మోడీ సర్కార్ సవతి ప్రేమ చూసుతోంది. అదే సమయంలో తమ నిర్ణయాలను విచక్షణను ఉపయోగించకుండా, రాష్ట్ర ప్రయోజనాలతో సంబంధం లేకుండా ఔదాల్చే జగన్ సర్కార్ వంటి ప్రభుత్వాల తప్పులను కేంద్రం చూసి చూడనట్టు వదిలేస్తున్నది. అదే జగన్ కు వరంగా మారింది. అందుకే నిబంధనల జోలికి వెళ్లకుండా యథేచ్ఛగా పందేరాల పరంపర కొనసాగించగలుగుతున్నారు. స్థానిక సంస్థల స్వయంప్రతిపత్తి కోసం ఉద్దేశించిన 93, 94 రాజ్యాంగ సవరణలను సైతం పట్టించుకోకుండా పంచాయతీ నిధులను కూడా మళ్లించేశారంటే ఇదే కారణం. ఈ నిరంకుశత్వం, నిష్పూచీ తనం, జవాబాదారీతనం లేని తీరుతో పరిపాలన, రాజకీయ ప్రయోజనం.. రెంటినీ అవిభక్త కవలలుగా మార్చి జగన్ చేస్తున్నది వచ్ఛిన్నమే, విధ్వంసకర జూదమే!
http://www.teluguone.com/news/content/jagan-businessman-to-the-core-ap-in-srilanka-way-vundavilly-densation-25-134470.html





