బీసీబీకి ఐసీసీ షాక్
Publish Date:Jan 7, 2026
Advertisement
భారత్ లో టి20 వరల్డ్ కప్ మ్యాచ్ లు ఆడబోమంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) విజ్ణప్తిని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. టి20 వరల్డ్ కప్ లో తమ దేశం ఆడే మ్యాచ్ లను భారత్ వెలుపల నిర్వహించాలంటూ బీసీబీ ఐసీసీని కోరిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు నిరాకరించిన ఐసీసీ బంగ్లాదేశ్ జట్టు భారత్కు వచ్చి ఆడాల్సిందేనని, లేకుంటే ఆయా మ్యాచ్ల పాయింట్లను కోల్పోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. అయితే ఐసీసీ తమ విజ్ణప్తిని తోసిపుచ్చిందన్న అధికారిక సమాచారం తమకు అందలేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అంటోంది. బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్యా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఐపీఎల్ లో బంగ్లా ఆటగాడు ముస్తఫిజుర్ రహమాన్ ను ఐపీఎల్ నుంచి తొలగించాలని భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిర్ణయించింది. దీనికి ప్రతిగా బంగ్లాదేశ్ టి20 వరల్డ్ కప్ లో భారత్ లో ఆడబోమంటూ ఐసీసీని ఆశ్రయించింది. భారత్ లో తమ ఆటగాళ్ల భద్రతపై ఆందోళన ఉందంటూ బీసీబీ పేర్కొంది. ఈ విషయంలో గతంలో పాకిస్థాన్ విషయంలో అనుసరించిన తటస్థ వేదిక విధానాన్ని తమకూ వర్తింప చేయాలని విజ్ణప్తి చేసింది. అయితే ఆ విజ్ణప్తిని ఐసీపీ తిరస్కరించింది.
http://www.teluguone.com/news/content/icc-rejects-bangladesh-cricket-board-request-36-212140.html





