మల్కాజిగిరిలో కాల్పుల కలకలం.. భార్యపై భర్త ఫైరింగ్
Publish Date:Jun 10, 2026
Advertisement
హైదరాబాద్ మల్కాజిగిరి పరిధిలో మంగళవారం(జూన్ 9) అర్ధరాత్రి కాల్పులు కలకలం రేపాయి. కుటుంబ కలహాల కారణంగా భర్త భార్యపై కాల్పులు జరిపి హత్యాయత్నం చేశాడు. వివరాలిలా ఉన్నాయి. నిషా రాణి, అరుణ్ దంపతులు మల్కాజిగిరి మారుతీనగర్లో నివాసం ఉంటున్నారు. అరుణ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అయితే భార్య భర్తల మధ్య గత కొంతకాలంగా విభే దాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భార్యను మాట్లాడుకుందాం రా అంటూ ఇంటి బయటకు పిలిచిన భర్త అరుణ్.. ఒక్కసారిగా ఆమెపై తుపాకీతో కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దం వినిపించడం తో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి చూడగా అక్కడ నిషారాణి రక్తపు మడుగులో పడి ఉంది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలతో ఉన్న నిషారాణిని సమీప ఆస్పత్రికి తరలించారు. కాల్పుల అనంతరం అరుణ్ అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో మరో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అరుణ్ పాతబస్తీ ప్రాంతానికి చెందిన కొందరు స్నేహితుల ద్వారా తుపాకీని కొనుగోలు చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. భార్యాభర్తల మధ్య కొనసాగుతున్న విభేదాలే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా భావిస్తున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/husband-fires-wife-36-222409.html





