'జగనన్న కాలనీ' మిస్సింగ్.. దొంగలు ఎత్తుకుపోయారా?
Publish Date:Jul 26, 2021
Advertisement
మీ ఇల్లు ఎక్కడ? అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ఫలానా చోట అని స్పష్టంగా చెప్పగలగాలి. కాస్త కష్టమైనా.. అటు ఇటు, కుడి ఎడమ అంటూ ఏదో రకంగా వివరించగలిగాలి. కానీ, మీ ఇల్లు ఎక్కడ? అని ప్రశ్నిస్తే.. బిక్కముఖం వేసుకొని నోట మాటరాకపోతే? అడ్రస్ చెప్పడం చానా కష్టమైతే? ఇంటి స్థలం ఎక్కడో ఓ పట్టాన అర్థం కాకపోతే? అది నివాస ప్రాంతమే కాకపోతే? భూమి మీద కాకుండా నీళ్లలో దాగుంటే? సముద్రపు నీటిలో మునిగిపోతే? కొండల్లో కలిసిపోతే? కాగితాలకే పరిమితమైతే? చివరాఖరికి సర్వం శోధించి సాధించిపెట్టే గూగుల్కు సైతం లోకేషన్ అంతుచిక్కకపోతే? అది కచ్చితంగా జగనన్న ఇచ్చిన ఇల్లే అయింటుంది. మీరుండబోయేది.. ఉండలేనిది.. ఆ అడ్రస్ లేని అడ్రస్.. కేరాఫ్ 'జగనన్న కాలనీ'. అవును, పేరుకే అది కాలనీ. ఉనికిలో లేని కాలనీ. చాలాచోట్ల నివాసానికి ఏమాత్రం పనికిరాని కాలనీ. అలాంటి ప్రాంతాలను ప్రత్యేకంగా వెతికి మరీ.. వద్దుమొర్రో అంటున్నా లబ్దిదారులకు అంటగట్టారు. సంఖ్య పెంచుకోడానికి, బిల్డప్ ఇచ్చుకోడానికే అన్నట్టు.. అడ్డగోలు ప్రాంతాల్లో జగనన్న ఇల్లులను కేటాయిస్తున్నారు. మనుషులు తిరగని మారుమూల ప్రాంతాలను చూపించి.. ఇవే మీ ఇళ్లు.. జగనన్న కాలనీలు అంటూ మమ అనిపిస్తున్నారు. పేరుకు 27 లక్షల మందికి స్థలాలు కేటాయించారు గానీ.. అందులో సగానికి పైగా పనికిరాని, పనికిమాలిన స్థలాలేనని లబ్దిదారులే విమర్శిస్తున్నారు. ఈ స్థలాల కొనుగోలు వెనుక వైసీపీ నేతల గోల్మాల్ యవ్వారం దాగుందని ఆరోపణలు మొదటినుంచీ వినిపిస్తున్నాయి. ఆవ భూములు, చెరువు స్థలాలు, కొండప్రాంతాలను అధిక ధరలకు కొన్నట్టు చూపుతూ అక్రమాలకు, అవకతవకలకు పాల్పడ్డారనే విమర్శలు ఉన్నాయి. ముందు ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇస్తామంది. ఆ తర్వాత మీరే కట్టుకోండి మేం రాయితీ ఇస్తామని ప్రకటించింది. కేంద్ర స్కీంనూ తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇటీవలే సామూహిక శంకుస్థాపనలో ఆ పథకానికి ఘనంగా శ్రీకారం చుట్టింది సర్కారు. కట్ చేస్తే.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అనేక చోట్ల జగనన్న కాలనీలు కనుమరుగయ్యాయి. అనేకచోట్ల ముంపు ప్రాంతాల్లో స్థలాలు ఇవ్వడంతో అవన్నీ ఇప్పుడు నీటమునిగాయి. చెరువులను తలపిస్తున్నాయి. అలా చెరువులాంటి చోట తమ స్థలం ఎక్కడుందో.. తమ కాలనీ ఎటు వైపు ఉందో గుర్తించడం చానా కష్టమవుతోందట. గూగుల్లో సెర్చ్ చేసినా.. జగనన్న కాలనీల లొకేషన్స్ ట్రేస్ అవట్లేదట. ఈ దుస్థితిపై సోషల్ మీడియాలో ఓ రేంజ్లో సెటైర్లు పేలుతున్నాయి. వానలకి ముందు కాస్తోకూస్తో స్థలాల్లా కనిపించిన కాలనీలు.. ఇప్పుడు వాననీటిలో మునిగి కనుమరుగు కావడంతో.. మా స్థలాలు ఎక్కడున్నాయో చూపించాలంటూ లబ్దిదారులు వైసీపీ నాయకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారట. ఇటీవల కృష్ణా జిల్లా, తూర్పు పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో అనేకమంది లబ్ధిదారులు ఈ స్థలాలు మాకొద్దు అంటూ పత్రాలను తిరిగి ఇచ్చేస్తున్నారట. అందుకే, వర్షాలతో జగనన్న కాలనీలు కనిపించడం లేదంటూ ఏపీ వ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయంటున్నారు.
http://www.teluguone.com/news/content/huge-complaints-on-jagananna-colonies-in-ap-25-120378.html