వేదికపైనే టీఆర్ఎస్ మంత్రి, ఎమ్మెల్యే ఫైటింగ్..
Publish Date:Jul 26, 2021
Advertisement
యాదాద్రి భువనగిరి జిల్లా రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ గానే సాగుతుంటాయి. తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి, ఓ ఎమ్మెల్యే ఘర్ణణ పడ్డారు. సభ వేదికపైనే కొట్టుకునేంత వరకు వెళ్లారు. ఒకరికొకరు తీవ్ర స్థాయిలో వాగ్వాదం చేసుకున్న నేతలు.. మైకులు లాగేసుకున్నారు. కొట్టుకునే వరకు వెళ్లారు. పోలీసులు, రెండు పార్టీలకు చెందిన నేతలు జోక్యం చేసుకోని ఇద్దరిని వేరు చేయడంతో పక్కక జరిగారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. రేషన్ కార్డుల పంపిణి కార్యక్రమాన్ని మున్సిపల్ కేంద్రంలో నిర్వహించారు. మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ కు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా వచ్చారు. సభలో మాట్లాడిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి.. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం లేదని ఆరోపించారు. ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే లేకుండానే మంత్రి అభివృద్ది కార్యక్రమాలను ఎలా ప్రారంభిస్తారని నిలదీశారు. జగదీశ్ రెడ్డి ముందే రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంతలో కలగజేసుకున్న మంత్రి జగదీశ్ రెడ్డి.. కోమటిరెడ్డిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చిల్లర మాటలు మాట్లాడొద్దంటూ మైకును గుంజుకునే ప్రయత్నం చేశారు. అటు కోమటిరెడ్డి కూడా అదే స్థాయిలో కౌంటరిస్తూ మంత్రిపై దూషణలకు దిగారు. అంతేకాదు మంత్రి చేతిలోని మైకును లాక్కొవడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రయత్నించారు. మంత్రి, ఎమ్మెల్యే ఇద్దరు తోపులాడుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. అదే సమయంలో రెండు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు వేదిక వైపుకు దూసుకువచ్చారు. పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. దీంతో పోలీసులతో పాటు ఇతర నేతలు మంత్రి, ఎమ్మెల్యేను వారించి కూల్ చేశారు. సభను బయటికి వచ్చిన రాజగోపాల్ రెడ్డి.. మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమలకు ఎమ్మెల్యే కు సమాచారం లేకుండా మంత్రి వచ్చిపోవడం ఎమ్మెల్యే లను అవమానపరచడమే అన్నారు. మంత్రిగా ఉంటే నియోజక వర్గంలో ఒక్క చోట ప్రారంభించి మిగతా కార్యక్రమాలను ఎమ్మెల్యే కి వదిలెయాలన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలు ప్రవేశ పెట్టడం కాదు.. సమస్యలు పరిష్కరించాలని కోరారు. మంత్రి జగదీష్ రెడ్డి కి చిత్తశుద్ధి ఉంటే.. సీఎం కేసీఆర్ తో కొట్లాడి మునుగోడు నిధులు అందించాలని లేకపోతే తన నియోజకవర్గంలో ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించిన ఇలాగే ఉంటుంది అని సవాల్ చేశారు. శివన్నగూడ, ఎస్ ఎల్ బి సి ప్రాజెక్టులకు కనీసం ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయలేదని.. దమ్ముంటే ప్రాజెక్ట్ లు పూర్తి చేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు
http://www.teluguone.com/news/content/trs-minister-cong-mla-fight-in-meeting-25-120376.html