అగ్గిపెట్టె మచ్చా నోటికొచ్చిన లెక్కలు!
Publish Date:Jul 27, 2024
Advertisement
తెలంగాణలో టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వుండగా ఏం చేసేవారంటే, కేసీఆర్ కుటుంబం తెలంగాణని అద్భుతంగా పరిపాలించేది. కేసీఆర్, కేటీఆర్, హరీష్రావు... వీళ్ళ నుంచి వందలమంది పుట్టుకొచ్చేవాళ్ళు. వాళ్ళు తెలంగాణ మొత్తం తిరుగుతూ వుండేవాళ్ళు. ఎక్కడ ఏ నేరం జరగబోతున్నా ఆ నేరాన్ని జరక్కుండా ఆపేవాళ్ళు. అలాగే ఇంత గొప్ప పాలనలో పోలీసులు కూడా అద్భుతంగా పనిచేసేవాళ్ళు రాష్ట్రంలో ప్రతి వీధిలోనూ ఒక్కో పోలీసు వుండేవాడు. పోలీసులు జరుగుతున్న నేరాలను ఆపడం మాత్రమే కాదు... జరగబోయే నేరాలను కూడా పసిగట్టేసి ఆపేసేవాళ్ళు. ఆపడానికి పోలీసుల వల్ల కూడా కాని నేరాలను కేసీఆర్, కేటీఆర్, హరీష్రావు సూపర్ మ్యాన్, స్పైడర్ మాన్ తరహాలో క్షణాల్లో అక్కడ ప్రత్యక్షమైపోయి వాటిని ఆపేసేవారు. దాంతో కేసీఆర్ పరిపాలనలో తెలంగాణలో నేరాలే జరిగేవి కావు. కానీ, గత ఎనిమిది నెలలుగా కేసీఆర్ ప్రభుత్వం లేకపోవడంతో తెలంగాణలో ఎక్కడ చూసినా నేరాలే నేరాలు.. నేరాల మీద నేరాలు.. ఈ సోది అంతా ఏంటి అనుకుంటున్నారా? తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థితి మీద బీఆర్ఎస్ నాయకుడు, అగ్గిపెట్టె మచ్చా హరీష్ రావు మాట్లాడుతున్న తీరు కూడా ఇలాగే వుంది మరి! బీఆర్ఎస్ లాంటి గొప్ప పార్టీ అధికారంలో లేకపోవడంతో ఈ ఎనిమిది నెలల కాలంలో నేరాల సంఖ్య బాగా పెరిగిపోయిందట. కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు కదా అని, నేరస్తులు రెచ్చిపోయి నేరాలు చేసేస్తున్నారట. కేవలం ఈ ఎనిమిది నెలల కాలంలోనే రాష్ట్రంలో లక్ష కంటే ఎక్కువ నేరాలు జరిగాయట. వాటిలో 5 వందలు హత్యలు, 1800 రేప్లు, 60 డెకాయిటీస్, 400 రాబరీలు, 10 వేల దొంగతనాలు వున్నాయట. కాబట్టి, ఈ అగ్గిపెట్టె మచ్చా ఉద్దేశమేంటి? అర్జెంటుగా తమ పార్టీకి అధికారం ఇచ్చేస్తే, కేసీఆర్ అండ్ కో తెలంగాణలో నేరాలేవీ జరక్కుండా చూస్తారు. అదీ విషయం. బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నాడట ఎవడో హరీష్రావు లాంటివాడే. అసెంబ్లీ సాక్షిగా ఆయన పోలిగాడి కంటే దారుణమైన అబద్ధాలు చెబుతున్నారు. ఉదాహరణకి 80 రోజుల్లో 1800 రేప్లు జరిగాయని ఆయన సెలవిస్తున్నారు. అంటే రోజుకు 20కి పైగానే మానభంగాలు జరుగుతున్నట్టు ఆయన చెబుతున్నారు. నా నోటికొచ్చింది నేను చెప్తా మీ చావు మీరు చావండి. నా చేతికొచ్చిన బురద మీ మీద జల్లుగా కడుక్కుంటారో చస్తారో మీ ఇష్టం. మాకు మాత్రం అర్జెంటుగా అధికారం కావాలి అన్నట్టుగా వుంది హరీష్ రావు వ్యవహారం. తెలంగాణలో బీఆర్ఎస్ వాళ్ళ వ్యవహారం, ఆంధ్రప్రదేశ్లో జగన్ వ్యవహారం ఒకేలా వున్నాయి. చవటాయని నేను అని ఒకళ్ళు అంటే, నీకంటే పెద్ద చవటాయని నేను అని మరొకరు అంటున్నారు. జగనేమో ఢిల్లీ వెళ్ళి 36 హత్యలు జరిగాయని మొత్తుకున్నాడు. ఆ హత్యకు గురైనవాళ్ళ పేర్లు చెప్పవయ్యా మగడా అని మీడియావాళ్ళు, హోంమంత్రి, ముఖ్యమంత్రి అడుగుతుంటే ‘టాపిక్ డైవర్ట్ చేయొద్దు’, నేను ఇచ్చిన ఫొటోలు చూసి తెలుసుకోండి అని చెబుతున్నాడు. నా నోటికి వచ్చింది నేను చెబుతా, మీరు విని ఊరుకోండి.. ఎదురు ప్రశ్నలు వేయొద్దు అంటున్నాడు. తెలంగాణలో కేసీఆర్ అండ్ కో, ఆంధ్రలో జగన్ అండ్ కో ఇలాంటి నీచమైన రాజకీయాలు చేశారు కాబట్టే వీళ్ళని జనం పక్కన పెట్టారు. అయినప్పటికీ వీళ్ళలో ఎలాంటి మార్పు రాలేదు.
http://www.teluguone.com/news/content/harish-rao-silly-comments-39-181639.html