టీసీఎస్ లో మహిళా ఉద్యోగులకు వేధింపులు.. పని ప్రదేశంలో భద్రతపై వెల్లువెత్తుతున్న సందేహాలు
Publish Date:Apr 14, 2026
Advertisement
కంఠమనేని సీతారాం దేశంలోనే దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ విభాగంలో చోటుచేసుకున్న వరుస సంఘటనలు ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కార్యాలయంలో ఉద్యోగినుల పట్ల అనుచిత ప్రవర్తన, మానసిక వేధింపులు, మతపరమైన ఒత్తిళ్లకు సంబంధించి వెలుగులోకి వచ్చిన అంశాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే పోలీసు యంత్రాంగం, సంస్థ అంతర్గత విభాగం దర్యాప్తును ముమ్మరం చేశాయి. దర్యాప్తు సంస్థల ప్రాథమిక నివేదికల ప్రకారం, ఈ కేసులో ప్రధానంగా మహిళా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 18 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉండి, ఆర్థికంగా వెనుకబడిన లేదా సామాజికంగా బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులను ఎంపిక చేసుకుని వారిపై ఒత్తిడి పెంచుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారికంగా విధుల్లో చేరకముందే ఈ బాధితులను గుర్తించి, ఒక పద్ధతి ప్రకారం వారిని వేధింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో హెచ్ఆర్ , ట్రైనింగ్ విభాగాలకు చెందిన కొందరు వ్యక్తులు ఒక నెట్వర్క్లా ఏర్పడి పనిచేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అభ్యర్థుల వ్యక్తిగత వివరాలను సేకరించడం, వాటిని ప్రత్యేక వాట్సాప్ గ్రూపుల ద్వారా షేర్ చేసుకోవడం వంటి చర్యలకు వీరు పాల్పడినట్లు సమాచారం. శిక్షణ సమయంలోనే బాధితులతో సన్నిహితంగా ఉంటూ వారి విశ్వాసాన్ని చూరగొని, ఆపై వారిని తమ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మరీ ముఖ్యంగా, బాధితులపై మతపరమైన ప్రభావం చూపే ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. హిందూ ధర్మాన్ని కించపరచడం, ఆహారపు అలవాట్లను బలవంతంగా మార్చడం అంటే.. బీఫ్ తినమని ఒత్తిడి చేయడం, నమాజ్ ఆచరించడం వంటి మతాచారాలను పాటించాలని వేధించడం వంటి చర్యలకు పాల్పడినట్లు బాధితులు చెబుతున్నారు. మానసిక విశ్లేషణల ద్వారా వారి నమ్మకాలను దెబ్బతీస్తూ, వ్యక్తిగత దూషణలతో వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఉదంతంలో నిధారా ఖాన్ అనే హెచ్ఆర్ అధికారిణి పాత్ర కీలకంగా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నెట్వర్క్ను నడపడంలో ఆమె కీలక సూత్రధారిగా వ్యవహరించినట్లు సమాచారం. ప్రస్తుతం పరారీలో ఉన్న నిధారా ఖాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న టీమ్ లీడర్లు, ట్రైనర్లు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్థాయి అధికారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వివాదంపై టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఘటనలను సంస్థ ఏమాత్రం సహించబోదని, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. సీఓఓ ఆర్తి సుబ్రహ్మణ్యన్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీ ఈ అంశంపై అంతర్గత విచారణ జరుపుతోందని, చట్టపరమైన దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఈ ఉదంతం కార్పొరేట్ కార్యాలయాల్లో ఉద్యోగుల భద్రత, మత స్వేచ్ఛపై పెద్ద ఎత్తున చర్చకు తావిచ్చింది. బలహీన వర్గాల ఉద్యోగులకు పని ప్రదేశాల్లో ప్రత్యేక రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని సామాజిక విశ్లేషకులు అంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన నిబంధనలు అమలు చేయాలని బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/harassment-of-female-employees-at-tcs-36-217298.html





