జగన్ కు భరోసా ఇవ్వని రైతులు.. ప్రసంగిస్తుండగానే సభ నుంచి వాకౌట్
Publish Date:May 16, 2022
Advertisement
రైతు భరోసా అంటూ వచ్చిన జగన్ కు ఆ రైతులు ఇసుమంతైనా భరోసా ఇవ్వలేదు. ఆయన మాట్లాడుతుండగానే పెద్ద సంఖ్యలో రైతులు ముఖ్యంగా మహిళా రైతులు లేచి వెళ్లి పోయారు. దీంతో సభ కోసం వేసిన కుర్చీలలో చాలా వరకూ ఖాళీ అయిపోయాయి. రైతు భరోసా కార్యక్రమం జగన్ కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఏలూరులో రైతు భరోసా కార్యక్రమం రైతులలో జగన్ ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకత ఉందో బట్టబయటు చేసేసింది. ఆ కార్యక్రమంలో జగన్ మాట్లాడుతుండగానే గుంపులు గుంపులుగా రైతులు సభ నుంచి వాకౌట్ చేసేశారు. జగన్ ప్రసంగం ప్రారంభం కాగానే పెద్ద సంఖ్యలో మహిళలు లేచి వెళ్లిపోవడం ప్రారంభించడంతో జగన్ కు నిరసన తెలియజేయడానికే వీరు వాకౌట్ చేశారని పరిశీలకులు అంటున్నారు. మరో వైపు జగన్ రైతు భరోసా కింద విడుదల చేసిన సొమ్ములో కేంద్రం కిసాన్ యోజన కింద ఇచ్చే సొమ్మే ఎక్కువగా ఉందన్న విమర్శలు వినవస్తున్నాయి. కేంద్రం ఇస్తున్న కిసాన్ యోజన సొమ్మును కూడా కలిపి రైతు భరోసా కింద ఇస్తున్నారని అంటున్నారు. ఆ ఇచ్చేది కూడా రైతులందరికీ కాకుండా కొందరికి మాత్రమే అందజేస్తున్నారన్న విమర్శలు కూడా వినవస్తున్నాయి. దీంతో రైతు భరోసా మీద రైతులు భరోసా కోల్పోయారనీ, అందుకే ఆయన సభ నుంచి వాకౌట్ చేశారనీ అంటున్నారు. తాను మాట్లాడుతుండగానే రైతులు వెళ్లిపోవడం ప్రారంభించడంతో సభ కోసం ఏర్పాటు చేసిన కూర్చీలలో చాలా వరకూ ఖాళీగా దర్శన మిచ్చాయి. దీంతో అసహనానికి గురైన జగన్ రైతులు తన సభను వాకౌట్ చేయడం కూడా చంద్రబాబు కుట్రే అన్న అర్ధం వచ్చేలా మాట్లాడారు. మీడియాపైనా నోరు పారేసుకున్నారు. ఇక రైతు శ్రేయస్సే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పుకున్న జగన్ వరుసగా నాలుగో ఏడాది రైతు భరోసా పంపిణీ చేస్తున్నామన్నారు. ఇంత దాకా ఈ పథకం కింద 23,875 కోట్లు రైతులకు అందజేసినట్లు చెప్పారు. మూడేళ్లుగా రాష్ట్రంలో కరువు లేదని జగన్ చెప్పుకొచ్చారు. 3 విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.13,500 జమ చేశామన్నారు. మొదటి విడతగా రూ.5,500 చొప్పున జమ కాగా.. పీఎం కిసాన్ పథకం కింద మరో రూ.2 వేలు అందించామని చెప్పుకొచ్చారు.
http://www.teluguone.com/news/content/farmers-walk-out-from-jagan-raithu-bharosa-meetin-25-135969.html





