కాషాయం పార్టీలో ఈటలకు ఉక్కపోత.. ఇమడ లేక బయటకు వచ్చే యోచన.. కొత్త పార్టీ పెడతారంటూ ప్రచారం!
Publish Date:May 16, 2022
Advertisement
ఈటల రాజేందర్ బీజేపీలో ఇమడ లేకపోతున్నారా? అసలు ఆయన టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కమలం గూటికి చేరినప్పుడే ఆయన గురించి తెలిసిన వారంతా ఆశ్చర్యపోయారు. వామపక్ష భావజాలం ఉన్న ఈటల బీజేపీలో ఎలా ఇడమగలుగుతారన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈటల బీజేపీకి రాజీనామా చేసి బయటకు వచ్చేస్తారన్న వార్తలు ఎవరినీ ఆశ్చర్యానికి గురి చేయడం లేదు. ఇప్పుడో ఎప్పుడో ఆయన బయటకు రావడం ఖాయమన్న భావన ఆయన బీజేపీలో చేరినప్పటి నుంచీ పరిశీలకులు వ్యక్తం చేస్తూనే వచ్చారు. అయితే ఇప్పుడు ఆయన బయటకు వచ్చి కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. దీనిపై తెలుగు వన్ ఈటల సన్నిహితులను సంప్రదిస్తే వారు ఇదంతా తప్పుడు ప్రచారం అంటూ కొట్టి పారేశారు. బీజేపీలో ఈటలకు సముచిత గౌరవం లభిస్తున్నదనీ, బీజేపీ హై కమాండ్ కూడా ఈటలకు గౌరవం ఇచ్చి రాష్ట్రంలో చేపట్టే అన్ని కార్యక్రమాలలో ఆయనను భాగస్వామిని చేయడమే కాకుండా సలహాలూ, సూచనలూ స్వీకరిస్తోందనీ చెబుతున్నారు. ఇటీవల తుక్కుగూడలో జరిగిన అమిత్ షా బహిరంగ సభలో ఈటల వేదికపై ఉన్నారనీ వారు చెప్పారు. ఈటలకు బీజేపీ నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదని వారు స్పష్ఠం చేశారు. అయతే ఈటల గురించి తెలిసిన వారు, ఆయన సైద్ధాంతిక నేపథ్యం గురించి తెలిసిన వారు మాత్రం ఆయన కమలం పార్టీని వీడి కొత్త పార్టీ పెట్టేందుకు యోచిస్తున్నారన్న వార్తలనే విశ్వసిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్ తో నే విభేదించి, బహిష్కృతుడై బయటకు వచ్చిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరి హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించారు. ఆ విజయంలో బీజేపీ పాత్ర దాదాపుగా శూన్యం అనే పరిశీలకులు చెబుతుంటారు. ఆ విజయం పూర్తిగా ఈటల ఖాతాలోనే పడింది. ఈటల చేరిక వల్లే బీజేపీకి తెలంగాణ అసెంబ్లీలో మరోక స్థానం వచ్చి చేరిందన్నది పరిశీలకుల అభిప్రాయం. అయితే హుజూరాబాద్ గెలుపు బీజేపీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అలాంటి ఉత్సాహాన్నినింపిన ఈటల బీజేపీలో కీలక నేతగా ఎదుగుతారన్న భయంతో పార్టీలో ఆయన ఎదుగుదలను రాష్ట్ర బీజేపీ నాయకత్వం అడ్డుకుందన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈటల కమలం పార్టీలో ఇమడ లేకపోతున్నారని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. వ్యూహాత్మకంగా కమలం పార్టీలో ఈటలను ఏకాకిని చేశారన్న ప్రచారం కూడా ఉంది. గుర్తింపు లేని చోట ఈటల మౌనంగా సర్దుపోవడం ఆయన స్వభావానికే విరుద్ధమని ఆయనను సన్నిహితంగా తెలిసిన వారు చెబుతుంటారు. అందుకే ఈటల కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పి కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారన్న ప్రచారాన్ను రాష్ట్రంలో అత్యధికులు నమ్ముతున్నారు. అయితే తెలంగాణలో ఇప్పటికే మూడు పార్టీలు బలంగా వచ్చే ఎన్నికలలో విజయం కోసం కృషి చేస్తుండగా రాష్ట్రంలో మరో కొత్త పార్టీకి స్థానం ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీలోనే కొనసాగుతూ.. తనకు సముచిత గుర్తింపు కోసం పోరాడే అవకాశాలూ లేకపోలేదని కూడా అంటున్నారు. ఇందు కోసం త్వరలోనే ఆయన మరోసారి హస్తిన వెళ్లి బీజేపీ హైకమాండ్ తో చర్చలు జరిపే ఉద్దేశంలో ఉన్నారని కూడా అంటున్నారు. ఏది ఏమైనా కమలం పార్టీలో ఈటలకు అంత సౌకర్యంగా లేదన్నది మాత్రం వాస్తవమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు ముందు ఆయన హస్తిన వెళ్లి అమిత్ షాతో భేటీ కావడాన్ని వారు ఇందుకు తార్కానంగా చూపుతున్నారు. ఎటువంటి అసంతృప్తీ లేకపోతే.. అమిత్ షా రాష్ట్ర పర్యటనకు ముందు ఈటల ప్రత్యేకంగా హస్తిన వెళ్లి ఆయనతో భేటీ కావలసిన అవసరం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/eta-to-leave-bjp-and-float-new-party-25-135977.html





