political-news-img

జగన్ ఆరోపణలు పచ్చి అబద్ధాలు.. ఆధారాలతో బయటపెట్టిన అధికారులు

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై జగన్ చేస్తున్న ఆరోపణలన్నీ శుద్ధ అబద్ధాలని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు తిప్పికొట్టారు. గురువారం (జూన్ 11) ఉదయం జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వంపై సంచలన విమర్శలు గుప్పించారు.. కానీ అదే రోజు సాయంత్రానికి జనగ్ చేసిన ఆరోపణలన్నీ కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని అధికారులు రికార్డుల ఆధారంగా తేల్చేశారు. . క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, శాప్ ఎండీ ఎస్. భరణి సచివాలయంలో గురువారం (జూన్ 11) విలేకరుల సమావేశం నిర్వహించి, పక్కా ఆధారాలు, గణాంకాలతో వాస్తవాలను వెల్లడించారు. మెగా డీఎస్సీలో కేవలం క్రీడల్లో పాల్గొన్న సర్టిఫికెట్లు ఉన్నవారికే ఉద్యోగాలిచ్చారని, మెడల్స్ సాధించిన అర్హులకు అన్యాయం చేశారంటూ జగన్ చేసిన ఆరోపణలను కొట్టి పారేశారు. జగన్ తన మీడియా మీట్ లో పోలవరానికి చెందిన దుర్గయ్య అనే జాతీయ స్థాయి గోల్డ్ మెడలిస్ట్‌ను తన పక్కన కూర్చోబెట్టుకుని లైవ్ మీడియాలో మాట్లాడించారు. అయితే.. దీనిపై క్రీడల శాఖ ఉన్నతాధికారి అజయ్ జైన్ వివరణ ఇచ్చారు. దుర్గయ్య జాతీయ స్థాయి గోల్డ్ మెడలిస్ట్ అన్న మాట నిజమే అయినప్పటికీ.. డీఎస్సీ నిబంధనల ప్రకారం అభ్యర్థులు తమ పతకాల సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. కానీ దుర్గయ్య ఆ సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడంలో విఫలమయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో అంగీకరించారు. అభ్యర్థులు తప్పుగా సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేస్తే.. లేదా అప్‌లోడ్ చేయకపోతే ప్రభుత్వం బాధ్యత ఎలా వహిస్తుందని అధికారులు ప్రశ్నించారు. నిబంధనలను అతిక్రమించి ఆయనకు ఉద్యోగం ఇస్తే ఇతర మెరిట్ అభ్యర్థులు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఇక క్రీడల్లో పాల్గొన్న వారికే ఉద్యోగాలు ఇచ్చారన్న జగన్ విమర్శలపై అధికారులు గట్టి కౌంటర్ ఇచ్చారు.వైసీపీ హయాంలో జీవో 74 ప్రకారం కేవలం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, ఇంటర్ కాలేజీ, రూరల్ స్పోర్ట్స్ టోర్నమెంట్‌లలో పాల్గొన్న వారికే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల్లో భారీగా పోస్టులు కట్టబెట్టారని అధికారులు చెప్పారు. ఉదాహరణకు ఒక్క అనంతపురం జిల్లాలోనే ఆ కాలంలో జూనియర్ ఇంటర్ జిల్లా పార్టిసిపెంట్లు 24 మందికి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పార్టిసిపెంట్లు 66 మందికి, సీనియర్ ఇంటర్ జిల్లా పార్టిసిపెంట్లు 85 మందికి, రూరల్ ఇంటర్ జిల్లా పార్టిసిపెంట్లు 12 మందికి ఉద్యోగాలు ఇచ్చారని గణాంకాలతో వివరించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం తెచ్చిన జీవో 4 ప్రకారం కొత్త స్పోర్ట్స్ పాలసీని అమలు చేస్తూ.. ఇంటర్ కాలేజీ స్థాయి పోటీలను పూర్తిగా పక్కనబెట్టి ఒలింపిక్స్ నుంచి, స్టేట్ ఛాంపియన్‌షిప్ వరకు మాత్రమే పరిగణనలోకి తీసుకున్నామని అధికారులు వివరించారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేసిన మొత్తం 382 ఉద్యోగాలలో ఇటీవల కాలంలో (2025లో) సర్టిఫికెట్లు పొందిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని తేల్చిచెప్పారు. యూనివర్సిటీ స్థాయిలో ఇద్దరిని, జూడో గేమ్‌లో ఒకరిని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు. మొత్తంగా ఇటీవల సర్టిఫికెట్లు పొందిన కేవలం 9 మంది మాత్రమే మెగా డీఎస్సీ ఉద్యోగాల్లో అర్హత సాధించారని, ఇందులో ఎలాంటి సిఫార్సులు జరగలేదని కుండబద్దలు కొట్టారు. స్పోర్ట్స్ కోటా కింద కేటాయించిన 421 పోస్టులలో 382 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయని, అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొన్న అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోకపోతే ఈ మిగిలిన పోస్టులు కూడా భర్తీ కాకుండా మిగిలిపోయేవని అజయ్ జైన్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ప్రకటించిన 6,100 టీచర్ పోస్టుల నోటిఫికేషన్‌ను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసి నిరుద్యోగులకు అన్యాయం చేసిందన్న ఆరోపణలపైనా అధికారులు స్పష్టతనిచ్చారు. గత ప్రభుత్వ నోటిఫికేషన్ సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉందనీ, ఎస్జీటీ పోస్టులకు కేవలం డీఈడీ అభ్యర్థులే అర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా.. గత ప్రభుత్వం బీఈడీ వారికి కూడా అవకాశం కల్పించిందని తెలిపారు. అలాగే హారిజాంటల్ రిజర్వేషన్ విధానాన్ని పాటించకపోవడం వల్ల అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారని, అందుకే ఆ ప్రక్రియ పూర్తిగా ఆగిపోయిందని చెప్పారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ సాంకేతిక సమస్యలన్నింటినీ పరిష్కరించి, పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి.. రికార్డు స్థాయిలో కొత్తగా 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి విజయవంతంగా భర్తీ చేసిందని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాల అప్‌లోడ్ బాధ్యతను అవుట్‌సోర్సింగ్ ఉద్యోగికి అప్పగించారన్న ఆరోపణ పూర్తిగా అవాస్తవమని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ కొట్టిపారేశారు. డీఎస్సీ పరీక్షల కోసం మొత్తం 42 వేల ప్రశ్నలను సిద్ధం చేసి, అత్యంత సురక్షితమైన టీసీఎస్ అయాన్' ప్లాట్‌ఫామ్ ద్వారా అప్‌లోడ్ చేశామని తెలిపారు. ఈ ప్లాట్‌ఫామ్‌ను దేశవ్యాప్తంగా 20 రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు నమ్ముతున్నాయని, ఇందులో పేపర్ లీకేజీకి అస్సలు ఆస్కారమే ఉండదని పేర్కొన్నారు. ఈ బాధ్యతను ఇద్దరు అత్యున్నత శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అప్పగించామని, వారే రోజువారీ పాస్‌వర్డ్‌లను మార్చారని వివరించారు. కలెక్టర్ల ప్రమేయం లేకుండానే నియామక ప్రక్రియ కేంద్రీకృతంగా జరిగిందన్న వాదనను తిప్పికొడుతూ, అభ్యర్థులకు కలెక్టర్ల సంతకాలతోనే నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయని అధికారులు ఆధారాలు చూపించారు. అభ్యర్థులు ఎవరూ సోషల్ మీడియా అపోహలను నమ్మవద్దని, జాబ్ క్యాలెండర్ ప్రకారం రాబోయే అక్టోబర్‌లో మరో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని అధికారులు ఈ సందర్భంగా చెప్పారు.

Publish Date: Jun 12, 2026 10:32AM

political-news-img

మెగా డీఎస్సీ వర్సెస్ సచివాలయం ఉద్యోగాలు: జగన్ సంచలన కామెంట్స్!

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. గురువారం (జూన్ 11) వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జగన్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, అసలైన రికార్డు అంటే ఏంటో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి జగన్ వివరించే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, దేశంలోనే అతిపెద్ద ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తమ హయాంలోనే జరిగిందని చెప్పుకున్నారు. వైసీపీ హయాంలో ఒకే ఒక్క నోటిఫికేషన్ ద్వారా ఏకంగా 1.3 లక్షల ఉద్యోగాల భర్తీ చేశామనీ.. అదే అసలైన రికార్డు అని జగన్ చెప్పుకొచ్చారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో జగన్ చేసిన.. ఈ పోలిక అందరినీ విస్మయపరిచింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన మెగా డీఎస్సీ ఉద్యోగాలను, తన హయాంలో హయాంలో తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగాలతో పోల్చడమే ఈ విస్మయానికి కారణం. డీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉపాధ్యాయ ఉద్యోగాల స్కేల్, వాటికున్న అర్హతలు, సామాజిక ప్రాధాన్యత పూర్తిగా వేరనే సంగతి తెలుసుకోవాలంటూ నెటిజనులు జగన్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. సచివాలయం ఉద్యోగాలను మెగా డీఎస్సీతో పోల్చడం పట్ల సామాన్య ప్రజలు, నిరుద్యోగుల సైతం తప్పుపడుతున్నారు.

Publish Date: Jun 12, 2026 10:27AM

political-news-img

14న హైదరాబాద్ లో కాక్రోచ్ జనతాపార్టీ భారీ నిరసన!

భారతదేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్న కాక్రోచ్ జంతా పార్టీ ఇప్పుడు హైదరాబాద్ లో భారీ నిరసన నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. సోషల్ మీడియా వేదికగా పురుడుపోసుకుని, దేశవ్యాప్తంగా దావానలంలా వ్యాపిస్తున్న ఈ వినూత్న ఉద్యమం తెలంగాణ గడ్డపై కాలూనుతోంది. ఈ నెల 14న హైదరాబాద్ వేదికగా ఒక భారీ నిరసన ప్రదర్శనను నిర్వహించబోతున్నట్లు కాక్రోచ్ జనతాపార్టీ ప్రకటించింది. దేశంలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యలు, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ నిరసన సాగనుంది. ఈ ఆందోళన చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లో, ఎలాంటి హింసకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. డిజిటల్ స్క్రీన్‌ల నుండి నేరుగా రోడ్లపైకి వస్తున్న ఈ జెన్-జీ ఉద్యమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఇండియన్ కాక్రోచ్ జనతాపార్టీ దేశ సరిహద్దులను దాటి విస్తరించింది. మీడియాలో పుట్టిన ఈ కాక్రోచ్ ట్రెండ్ ఇప్పుడు పాకిస్థాన్ లోకి కూడా చొచ్చుకెళ్లింది. అక్కడ కూడా స్థానిక యువత ఈ కాన్సెప్ట్‌కు ఆకర్షితులై కాక్రోచ్ అవామీ పార్టీ, కాక్రోచ్ అవామీ లీగ్ వంటి సరికొత్త గ్రూపులను సోషల్ మీడియాలో ప్రారంభించారు. భాగ్యనగర వీధుల్లో యువత శాంతియుతంగా వినిపించబోయే ఈ గళం, రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మార్పులకు కారణమవుతుందో వేచి చూడాలి.

Publish Date: Jun 12, 2026 9:47AM

political-news-img

ఇంటర్ పాసైన మావోయిస్టు మాజీ నేత దేవ్ జీ

పట్టుదల ఉంటే చదువుకు వయస్సు అడ్డం కాదని నిరూపించారు మావోయిస్టు మాజీ నేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ. ఒకప్పుడు తుపాకీ పట్టి దండకారణ్యంలో దళాలను నడిపించిన ఆయన.. ఇప్పుడు పుస్తకం పట్టి విజయాలు సాధిస్తున్నారు. ఆయుధం విడిచి జనజీవన స్రవంతిలో కలిసిన దేవ్ జీ న్యాయవాది కావాలనే తన జీవిత ఆశయం వైపు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే.. 42 ఏళ్ల విరామం తర్వాత ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన దేవ్‌జీ.. నాలుగు దశాబ్దాల క్రితం మధ్యలో ఆగిపోయిన తన చదువును మళ్లీ కొనసాగించాలని గట్టి సంకల్పంతో శ్రద్ధగా చదివి ఇంటర్ పరీక్షలు రాశారు. ఈ పరీక్షల్లో ఆయన 349వ ర్యాంకు సాధించారు. ఐదేళ్ల లా కోర్సు చదవాలంటే ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్ తప్పనిసరి. దీంతో తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రత్యేకంగా అవకాశం కల్పించడంతో.. దేవ్‌జీ ఇటీవల జరిగిన అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో 42 ఏళ్ల క్రితం మిగిలిపోయిన ఆ ఒక్క తెలుగు పరీక్షకు హాజరయ్యారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఆయన తెలుగు సబ్జెక్టులో 100 మార్కులకు గాను 72 మార్కులు సాధించి ఘన విజయం సాధించారు. దీనితో మొత్తం 614 మార్కులతో ఆయన ఇంటర్మీడియట్ విద్యను అధికారికంగా పూర్తి చేశారు. తుపాకీ పట్టిన చేత్తో కలం పట్టి, విద్య ద్వారా కొత్త జీవితాన్ని అద్భుతంగా ప్రారంభించిన దేవ్‌జీ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం అందరికీ ఎంతో స్ఫూర్తినిస్తోంది.

Publish Date: Jun 12, 2026 9:34AM

political-news-img

ఏపీలో చురుకుగా కదులుతున్న రుతుపవనాలు

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఇప్పటికే రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలోని చాలా ప్రాంతాలను తాకిన నైరుతి రుతుపవనాలు, ఇప్పుడు ఉత్తరాంధ్రలోకి ప్రవేశించాయి. రుతుపవనాల కదలికలు చురుకుగా ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలకు తోడు.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం, అలాగే.. తెలంగాణ నుంచి దక్షిణ కోస్తా వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం (జూన్ 12) అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, కడప, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే.. పోలవరం, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, ప్రకాశం, నెల్లూరుతో పాటు పలు రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఇప్పటికే ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ఏలూరు, బాపట్ల జిల్లాల్లో కురిసిన కుండపోత వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.

Publish Date: Jun 12, 2026 9:21AM

political-news-img

మరో క్రికెట్ పండుగకు వేళాయె.. 2027 వరల్డ్ కప్ తేదీలు ఖరారు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీపీ) థ్రిల్లింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వన్డు వరల్డ్ కప్ షెడ్యూల్ ను ప్రకటించింది. 2027 అక్టోబర్ 4వ తేదీన ప్రారంభం కానున్న వన్డే వరల్డ్ కప్ టోర్నీ.. నవంబర్ 21వ తేదీన జరిగే ఫైనల్ మ్యాచ్‌ ముగుస్తుంది. ఈ మెగా టోర్నీని దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, అంటే 2003 నాటి చారిత్రాత్మక ప్రపంచకప్ తర్వాత మళ్లీ ఆఫ్రికా గడ్డపై వన్డే వరల్డ్ కప్ జరగడం ఇదే తొలిసారి. ఈ మెగా టోర్నమెంట్‌లో మొత్తం 54 మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే ఇందులో సింహభాగం మ్యాచ్‌లకు దక్షిణాఫ్రికా వేదికగా నిలవనుంది. మొత్తం 54 మ్యాచ్‌లలో దాదాపు 41 మ్యాచ్‌లు దక్షిణాఫ్రికా మైదానాల్లోనే జరగబోతున్నాయి. మరోవైపు జింబాబ్వే మూడు వేదికల్లో 8 నుంచి 10 మ్యాచ్‌లను నిర్వహిస్తుంది. ఈ సారి వరల్డ్ కప్ ఫార్మాట్‌లో ఐసీసీ భారీ మార్పులు చేసింది. ఎడిషన్లలో (2019, 2023) కేవలం 10 జట్లతోనే టోర్నీ నిర్వహించగా, ఈసారి టోర్నీలో 14 జట్లు పాల్గొంటాయి. 14 జట్లనూ రెండు గ్రూపులుగా విభజించి.. లీగ్ దశ ముగిసిన తర్వాత, ప్రతి గ్రూప్ నుండి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన టాప్-3 జట్లు సూపర్ సిక్స్ దశకు అర్హత సాధిస్తాయి. ఆతిథ్య దేశాలైన దక్షిణాఫ్రికా, జింబాబ్వేలకు పూర్తిస్థాయి సభ్య హోదా ఉన్నందున నేరుగా టోర్నీలోకి ప్రవేశం లభిస్తుంది. కానీ నమీబియా మాత్రం క్వాలిఫైయింగ్ రౌండ్లు ఆడి, గెలిచి ఈ టోర్నీకి అర్హత సాధించాల్సి ఉంటుంది.

Publish Date: Jun 12, 2026 9:03AM

MOVIE NEWS