political-news-img

నటి త్రిషపై షాకింగ్ కామెంట్స్.. డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్..!

తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేకెత్తించిన పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత సి.జోసెఫ్ విజయ్, అలాగే ప్రముఖ సినీ నటి త్రిషలపై బహిరంగంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనితా ఆర్. రాధాకృష్ణన్‌ను తమిళనాడు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. స్థానిక టీవీకే కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయనపై పరువు నష్టం, ప్రజల్లో ఘర్షణలను ప్రేరేపించడం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం రాధాకృష్ణన్ హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ఆయన పిటిషన్‌ను తిరస్కరించిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ వివాదం వెనుక ఉన్న అసలు వివరాల్లోకి వెళ్తే.. గత జూన్ 20వ తేదీన మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి జయంతి ఉత్సవాల సందర్భంగా తిరుచెందూర్ సమీపంలోని ఆత్తూర్‌లో ఒక బహిరంగ సభ జరిగింది. ఈ సభలో డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి విజయ్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన వ్యక్తిగత దూషణలకు దిగారు. విజయ్ శారీరక రూపాన్ని ఎగతాళి చేయడంతో పాటు, ఆయన సినీ పరిశ్రమ నుండి రాజకీయాల్లోకి రావడంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో మరియు విజయ్ అభిమానుల్లో తీవ్ర దుమారం రేగింది. అక్కడితో ఆగకుండా, శాంతిభద్రతలపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా కూడా రాధాకృష్ణన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో నటితో సంతోషంగా ఉండే విజయ్, ఇప్పుడు అసెంబ్లీ అనే ఊబిలో చిక్కుకుపోయారని, నలువైపులా ఇరుక్కుపోయాననే మానసిక ఆందోళనలో ఆయన ఉన్నారని వ్యాఖ్యానించారు. సినిమా షూటింగులు వేరు, రాష్ట్ర పాలన వేరంటూ ఎద్దేవా చేశారు. తాను ఒక వ్యాపారినని, ఒక వ్యక్తి దుకాణంలోకి వచ్చినప్పుడు అతను కొనడానికి వచ్చాడా లేక అప్పు అడగడానికి వచ్చాడా అనేది ముఖం చూసి చెప్పగలనని, అదేవిధంగా అసెంబ్లీలో సీఎం విజయ్ ముఖంలో కనిపిస్తున్న గందరగోళాన్ని చూస్తే ఆయన అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చానని భావిస్తున్నట్లు స్పష్టమవుతోందని వ్యంగ్యంగా మాట్లాడారు. తనకు ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అన్నట్లుగా విజయ్ ప్రవర్తన ఉందని రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యలు టీవీకే శ్రేణులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసాయి. మరోవైపు ఈ అరెస్టు పట్ల అధికారిక డీఎంకే పార్టీ తీవ్రంగా మండిపడింది. ప్రతిపక్షాలపై రాష్ట్ర ప్రభుత్వం అణచివేత వ్యూహాలను అవలంబిస్తోందని డీఎంకే ఎంపీ కనిమొళి ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రస్తుత ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆమె 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా తీవ్రంగా విమర్శించారు. డీఎంకే ఇటువంటి అణచివేత చర్యలకు ఎప్పటికీ భయపడదని, తలొగ్గబోదని స్పష్టం చేశారు. సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని డీఎంకే ఆరోపిస్తుండగా, పరువు నష్టం మరియు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడితే చట్టపరమైన చర్యలు తప్పవని టీవీకే శ్రేణులు పేర్కొంటున్నాయి. ఈ అరెస్టుతో తమిళనాడులో డీఎంకే, టీవీకే పార్టీల మధ్య రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

Publish Date: Jul 3, 2026 3:25PM

political-news-img

జగన్ కోసం అంత చేసిన ముద్రగడకు దక్కిందేంటి?

ముద్రగడ పద్మనాభం.. కాపు ఉద్యమ నేతగా రాష్ట్రంలో ఈ పేరు చిరపరిచితం. 2024 ఎన్నికలలో వైసీపీ తరఫున క్రియాశీలంగా పని చేసిన ఆయన.. ఉమ్మడి తూర్పుగోదావరిలో వైసీపీకి అత్యంత కీలక నేతగా వ్యవహరించారు. వైసీపీ పరాజయం పాలైతే తన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించి, అంత పనీ చేశారు. అయితే ఆయన విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అనుసరించిన వైఖరి ఎవరికీ అర్ధం కావడం లేదు. వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు. పైగా జగన్మోహన్ రెడ్డి వస్తే తామే వద్దు అన్నాం అంటూ ఆయన కుమారుడితో చెప్పించారు. ముద్రగడ పద్మనాభంకు రాజకీయ నాయకుడిగా కంటే.. కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగానే ఎక్కువ గుర్తింపు ఉంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడుకు ముద్రగడ సమకాలీనుడు. వారితో పాటే.. 1978లో అసెంబ్లీలో అడుగు పెట్టారు. మంత్రిగా, ఎంపీగా కూడా పని చేశారు. అయితే తదననంతర పరిణామాలలో ఆయన ఎమ్మెల్యేగా కూడా పరాజయం పాలయ్యారు. దీంతో చాలా కాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అటువంటి ముద్రగడ.. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడమే కాకుండా, కాపు రిజర్వేషన్ ఉద్యమంతో ముందుకు వెళ్లారు. అయితే ఆ ఉద్యమం కాపులకు ఇసుమంతైనా ప్రయోజనం చేకూర్చలేదు సరికదా.. జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ప్రయోజనం చేకూర్చింది. అసలు చంద్రబాబుకు వ్యతిరేకంగా, జగన్ కు అనుకూలంగా ముద్రగడ ఆ కాపు ఉద్యమాన్ని నడిపారన్న వాదన కూడా అప్పట్లో బలంగా వినిపించింది. ఆ వాదనకు బలం చేకూర్చే విధంగానే.. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ముద్రగడ.. కాపు రిజర్వేషన్ నినాదాన్ని, ఉద్యమాన్ని పక్కన పెట్టేశారు. ఇంత చేసినా ముద్రగడకు వైసీపీలో వీసమెత్తు ప్రాధాన్యత ఇవ్వలేదు జగన్. అయినా కూడా ముద్రగడ.. 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. విస్తృతంగా ప్రచారం చేశారు. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ ను పిఠాపురంలో ఓడించకుండా తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు. 2024 ఎన్నికలలో వైసీపీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. అలాగే పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ అద్భుతమైన మెజారిటీతో ఘన విజయం సాధించారు. దీంతో అన్నట్లుగానే ముద్రగడ తన పేరును ముద్రగడ పద్మనాభంగా అధికారికంగా మార్చుకున్నారు. జగన్ కోసం ఇంత చేసిన ముద్రగడకు.. జగన్ నుంచి వీసమెత్తు గుర్తింపు కూడా లేకుండా పోయిందని కాపు సామాజికవర్గ నేతలు, ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ముద్రగడను జగన్ కనీసం పరామర్శించను కూడా పరామర్శించకపోవడాన్ని తప్పుపడుతున్నారు. జగన్ పరామర్శించకుంటే పోయె.. కానీ జగన్ తమకు అన్నివిధాలుగా అండగా నిలిచారనీ, ఆయన ముద్రగడను పరామర్శించడానికి వస్తానంటే.. తామే వద్దన్నామంటూ ముద్రగడ కుమారుడు వీడియో విడుదల చేయడంపై కూడా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని పరామర్శిస్తామంటే ఎవరైనా ఎలా, ఎందుకు వద్దంటారు? అంటూ, జగన్ ఒత్తిడి మేరకే ముద్రగడ కుమారుడు ఆ వీడియో విడుదల చేసి ఉంటారంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ముద్రగడను పరామర్శించడానికి జగన్ రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Publish Date: Jul 3, 2026 3:05PM

political-news-img

రాయలసీమ స్టీల్ ప్లాంట్‌కు శ్రీకారం.. పనులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు..!

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లి వద్ద జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ అధినేత సజ్జన్ జిందాల్‌తో కలిసి కాంక్రీట్ వేసి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, సవిత, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు రాయలసీమ స్టీల్ ప్లాంట్ కోసం దశాబ్దకాలంగా ఎదురుచూశామని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ హామీ నెరవేరుతోందన్నారు. రాయలసీమ ఇప్పుడు హార్టికల్చర్, అరుదైన ఖనిజాలు, పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీకి కేంద్రంగా మారుతోందని పేర్కొన్నారు. కియా కార్లు, హీరో బైక్స్, డ్రోన్లు, ఫైటర్ జెట్లు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో సీమ ముందంజలో నిలుస్తోందన్నారు. ఇకపై రాయలసీమ కరువు నేల కాదని, జలకళ ఉట్టిపడే పచ్చని ప్రాంతంగా మారుతుందని చెప్పారు. పరిశ్రమల విస్తరణతో పాటు రాయలసీమ స్టీల్ ప్లాంట్ ద్వారా ఈ ప్రాంతంలో కొత్త యుగానికి నాంది పలుకుతున్నామని చంద్రబాబు అన్నారు. విభజన తర్వాత ఎదురైన అవాంతరాలు, అడ్డంకులు, అవమానాలను అధిగమించి ప్లాంట్ పనులు ప్రారంభించామని తెలిపారు. గత ప్రభుత్వాలు పలుమార్లు శంకుస్థాపనలు చేసినా, ఒక్క ఇటుక కూడా పేర్చలేదని విమర్శించారు. గత రెండేళ్లలో అనుమతులు, ఇతర అంశాలను పరిష్కరించి పనులకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. 1,100 ఎకరాల్లో రూ.16,350 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో ఉక్కు కర్మాగారం ఏర్పాటు కానుందని చెప్పారు.మొదటి దశలో రూ.4,500 కోట్లకు పైగా, రెండో దశలో రూ.11,850 కోట్ల పెట్టుబడులు వస్తాయని వివరించారు. విశాఖతో పాటు రాయలసీమ కూడా ఉక్కు ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. జేఎస్‌డబ్ల్యూ సంస్థ స్టీల్ ప్లాంట్‌తో పాటు సోలార్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేస్తోందన్నారు. పూర్తిగా గ్రీన్ ఎనర్జీ ఆధారంగా వ్యర్థాల నుంచి సేకరించిన ఇనుముతో ఉక్కు ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. విశాఖ ఉక్కు సంక్షోభ సమయంలో కేంద్రంతో చర్చించి రూ.11,440 కోట్ల ఆర్థిక సాయం తెచ్చి సంస్థను కాపాడామని గుర్తు చేశారు. నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ సంస్థ రూ.1.35 లక్షల కోట్లతో మరో భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోందన్నారు. జేఎస్‌డబ్ల్యూ కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లలో కలిపి రూ.1 లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిందన్నారు. బళ్లారి ప్లాంట్ కంటే అధిక సామర్థ్యంతో రాయలసీమ ప్లాంట్‌ను అభివృద్ధి చేయాలని జేఎస్‌డబ్ల్యూను కోరారు. గండికోట నుంచి 15 కిలోమీటర్ల పైప్‌లైన్ ద్వారా 2 టీఎంసీల నీటిని ప్లాంట్‌కు అందిస్తామని తెలిపారు. రాయలసీమలో లభించే నాణ్యమైన ముడి ఇనుము ఖనిజాన్ని కూడా పరిశ్రమకు అందించేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందన్నారు. రోడ్డు, రైలు, పోర్టు కనెక్టివిటీని ప్లాంట్‌కు కల్పిస్తామని హామీ ఇచ్చారు. జేఎస్‌డబ్ల్యూ ప్లాంట్‌తో ఈ ప్రాంతంలో సామాజిక, ఆర్థిక మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పారు. గతంలో కియా ప్లాంట్ తీసుకువచ్చిన తర్వాత అనంతపురం రూపురేఖలు మారిపోయాయని పేర్కొన్నారు. బ్రహ్మణీ స్టీల్స్ పేరుతో గతంలో వేల ఎకరాల భూములు కేటాయించి ప్రజల్లో భ్రమలు కల్పించారని సీఎం చంద్రబాబు విమర్శించారు.

Publish Date: Jul 3, 2026 2:49PM

political-news-img

సిట్ అధికారులు వేధిస్తున్నారు.. లాయర్ సమక్షంలో విచారణ.. కోర్టుకు సీఐ నాగరాజు లేఖ.!

సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనను 8 రోజుల పాటు విచారించేందుకు సిట్ అధికారులకు కోర్టు కస్టడీకి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో.. సీఐ నాగరాజు విజయవాడ కోర్టుకు రాసిన లేఖ సంచలనంగా మారింది. సాయి కృష్ణ కేసులో తాను పూర్తిగా నిర్దోషినని, తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని సీఐ నాగరాజు కోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. సిట్ అధికారులు తనను ఈ కేసులో తప్పుడు ఆధారాలతో అన్యాయంగా ఇరికిస్తున్నారనీ, కస్టడీ సమయంలో తనపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి శారీరకంగా, మానసికంగా వేధించకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆయనా లేఖలో కోరారు. తనను విచారించే ప్రక్రియ మొత్తం తన న్యాయవాదుల సమక్షంలోనే జరిగేలా ఆదేశాలివ్వాలని కూడా సీఐ నాగరాజు కోరారు. సిట్ అధికారులు వేధిస్తున్నారంటూ.. నిందితుడు కోర్టుకు లేఖ రాయడం సంచలనంగా మారింది.

Publish Date: Jul 3, 2026 2:41PM

political-news-img

రూ.105 కోట్లతో హస్తినలో ఏపీ భవన్.!

దేశ రాజాని నగరం న్యూ ఢిల్లీలో ఏపీ ప్రభుత్వం 105 కోట్ల రూపాయల వ్యయంతో ఏపీ భవన్ నిర్మాణానికి నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం ఢిల్లీలోని పాత ఏపీ భవన్ ఆస్తుల పంపకం పూర్తయిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం తమకు కేటాయించి స్థలంలో అత్యాధునిక హంగులతో 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త భవనాన్ని నిర్మించాలని నిర్ణయించింది ఈ భవనం దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన పరిపాలన, అత్యున్నత స్థాయి ఆతిథ్య కేంద్రంగా సేవలందిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ కొత్త ఏపీ భవన్ నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ ఎన్బీసీసీకి అప్పగించింది. ప్రభుత్వ నిర్మాణాల్లో అత్యంత నాణ్యత, పారదర్శకతను పాటించే ట్రాక్ రికార్డ్ ఉన్నందున, నిర్ణీత కాలవ్యవధిలో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు వీలుగా ఎన్ బీసీసీకి నిర్మాణ బాధ్యతలు అప్పగించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

Publish Date: Jul 3, 2026 2:28PM

political-news-img

ఘట్‌కేసర్ రైల్వే ట్రాక్‌పై దంపతులు ఆత్మహత్య..!

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకున్న విషాద ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని నింపింది. మహబూబాబాద్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపాయిపేట గ్రామానికి చెందిన దంపతులు రవికుమార్, శిరీష దంపతులు పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరులో నివాసముం టున్నట్లు సమాచారం. ఈ దంపతులు నిన్న రాత్రి సమయంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు ఘట్‌కేసర్– బీబీనగర్ రైల్వే మార్గంలో ఎన్ఎఫ్‌సీ సమీపంలో వీరి మృతదేహాలు గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది ఆత్మహత్య అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, అధికారులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ధారణ చేయలేదు. దంపతులు ఈ తీవ్ర నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? కుటుంబ, ఆర్థిక లేదా ఇతర వ్యక్తిగత కారణాలేమైనా ఉన్నాయా? లేక ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటననా? అనే కోణాల్లో పోలీసులు విచా రణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో పాపాయిపేట గ్రామంతో పాటు కుంట్లూరు ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం నివేదిక, దర్యాప్తులో వెలుగులోకి వచ్చే వివరాల ఆధారంగా ఘటనకు గల అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Publish Date: Jul 3, 2026 2:28PM

MOVIE NEWS