political-news-img

రోడ్ల కనెక్టివిటీతో ఎకనామిక్ యాక్టివిటీ : సీఎం చంద్రబాబు

ఏపీలో వివిధ ప్రాంతాల్లో ఆర్ధిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. జాతీయ రహదారులు రాష్ట్రంలోని పోర్టులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలను కనెక్ట్ చేసేలా నిర్మాణం చేపట్టాలని సూచించారు. సచివాలయంలో బుధవారం రహదారులు భవనాలు, రవాణా, జాతీయ రహదారి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో రోడ్ల నిర్వహణ, పాత్ హోల్ ఫ్రీ రహదారులు, ఈవీ బస్సుల వినియోగం, వివిధ రాష్ట్రాలను అనుసంధానించేలా జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణంపై సమీక్షలో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...‘‘రాష్ట్రంలో రహదారుల నిర్వహణ పటిష్టంగా ఉండాలి. మొత్తంగా 45,433 కిలోమీటర్ల మేర రోడ్లు ఉంటే... వాటిల్లో ఏటా 10,238 కిలోమీటర్ల మేర నిరంతర నిర్వహణ చేయాల్సి ఉంది. ప్రజలకు రోడ్ల వల్ల ఇబ్బంది లేకుండా చూడాలి. రోడ్ల నిర్వహణ అనేది నిరంతర ప్రక్రియగా చేపట్టాలి. ఎక్కడైనా రోడ్లకు గుంతలు పడితే... వాటినే వెంటనే సరిదిద్దితే ఇక ఇబ్బందులు ఉండవు. రోడ్ల నిర్వహణలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి పద్దతులను అవలంబిస్తున్నారనే అంశాన్ని అధ్యయనం చేయాలి. ఆర్ అండ్ బీ రహదారుల మెయింటెనెన్స్ కోసం నిధుల కొరత లేకుండా చూడాలి. వివిధ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసి దాని ఆధారంగా రహదారుల నిర్మాణం జరగాలి. రహదారి నిర్వహణకు ప్రామాణికతను నిర్దేశించాలి. స్థానికంగా భౌగోళిక పరిస్థితులు, వాతావరణం అంశాలను పరిగణనలోకి తీసుకుని రోడ్ల నిర్వహణలో చర్యలు చేపట్టాలి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, బ్లాక్ కాటన్ సాయిల్ ఉన్న చోట హైబ్రీడ్ మోడల్ లో బీటీ లేదా వైట్ ట్యాప్ రోడ్ల నిర్మాణం చేపడితే బాగుంటుంది. కాలువలు ఉన్న 570 కిలోమీటర్ల మేర రహదారులు పదే పదే ధ్వంసం అవుతున్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో ఏ మెటీరియల్‌తో రోడ్ల నిర్మాణం జరిగితే బాగుంటుందనేది ఆలోచన చేయాలి. దీనిపై యూనివర్శిటీల్లో అధ్యయనం చేయిస్తే కొత్త ఆవిష్కరణలు వస్తాయి. గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రోడ్ల మరమ్మతులు చేపట్టండి. గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మొత్తంగా 471 గ్రామాల్లో రోడ్లను మరమ్మత్తులు చేపట్టాలి. గ్రేటర్ రాజమహేంద్రవరం పరిధిలో చేపట్టే రోడ్ల అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాలకు రోల్ మోడల్‌గా నిలిచేలా పనులు చేపట్టాలి. పుష్కరాలకు ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.400 కోట్లతో 531 కిలోమీటర్ల పొడవైన రహదారులను అభివృద్ధి చేయాలి. దీని కోసం సాస్కీ నిధులను వినియోగించుకోవాలి. కుంభమేళా తరహాలో పుష్కరాలకు నిధులు ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని’ అని సీఎం సూచించారు. పోర్టుల అనుసంధానానికి ప్రాధాన్యత "రాష్ట్రంలోని పోర్టులను కనెక్ట్ చేసేలా జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టాలి. ఆర్ధిక లావాదేవీలకు కేంద్రంగా పోర్టులు ఉన్నాయి. పోర్టులను కనెక్ట్ చేసేలా పశ్చిమ భారతంలో గుజరాత్ మోడల్ అలానే ఉంది. తూర్పు భారతంలో తీర ప్రాంతం, పోర్టుల విషయంలో ఏపీ కీలకంగా ఉంది. ఈస్ట్-వెస్ట్ కారిడార్ గా జాతీయ రహదారుల నిర్మాణం జరగాలి. ఈ రకమైన కనెక్టివిటీని పెంచడం ద్వారా లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గించటమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలి. లాజిస్టిక్స్ రంగాన్ని రాష్ట్రంలో అభివృద్ధి చేసేలా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలి. దీని నిమిత్తం ఏపీ లింక్ ద్వారా ఆర్ధిక వనరుల్ని సమకూరేలా ప్రణాళికలు సిద్దం చేయాలి. మౌలిక సదుపాయాల ద్వారా సామాన్యుడికి సౌకర్యాలు పెరగాలి, ఇదే సమయంలో ఆర్ధిక లావాదేవీలు జరగాలి. ప్రభుత్వం ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం ఖర్చు చేస్తోంది. ప్రతి పైసా సద్వినియోగం కావాలి. అత్యుత్తమ ఫలితాలు రావాలి. ప్రస్తుతం 73 శాతం కార్గో రోడ్ రవాణ ద్వారానే వెళ్తోంది. రైల్వే ద్వారా వెళ్లే కార్గో వ్యయం తక్కువగా ఉన్నట్టే రహదారుల కార్గో వ్యయం కూడా తగ్గాల్సిన అవసరం ఉంది. మూలపేట, విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం పోర్టుల మధ్యనున్న ప్రాంతాలను అనుసంధానిస్తూ జాతీయ రహదారుల నిర్మాణం జరగాలి. ఆయా పోర్టులను అనుసంధానం చేసే సమయంలో ఆయా పోర్టులకు సమీపంలోని పొరుగు రాష్ట్రాల సరిహద్దులను కలుపుకుని వెళ్లేలా ప్రధాన రహదారులు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఉండాలి. రహదారుల నిర్మాణం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలి. జాతీయ రహదారులకు సమీపంలో ఉండే ప్రాంతాల అభివృద్ధి జరగాలి. జాతీయ రహదారులతో పాటు దేశ నిర్మాణం జరగాలి. ఏపీ పారిశ్రామిక, ఉద్యాన ఉత్పత్తుల కేంద్రంగా మారుతోంది. జాతీయ అంతర్జాతీయ మార్కెట్లకు కనెక్టు చేసేలా రహదారులు రావాలి. వివిధ నగరాలకు రింగ్ రోడ్లు వస్తే ఆయా ప్రాంతాల్లో ఆర్ధిక కార్యకలాపాలు విస్తృతం అవుతాయి. పొరుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాలను ఏపీని కనెక్టు చేసేలా రహదారుల నిర్మాణం జరగాలి. ఖరగ్ పూర్- అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే, హైదరాబాద్-శ్రీశైలం డోర్నాల హైవే, కల్వకుర్తి-నంద్యాల హైవే వంటి జాతీయ రహదారుల నిర్మాణం జరిగితే కనెక్టివిటీ మరింత పెరుగుతుంది. వివిధ కారిడార్ల ద్వారా 1335 కిలోమీటర్ల జాతీయ రహదారుల రెండేళ్లలో అందుబాటులోకి వస్తాయి. ఈ ఏడాదిలో రూ.24,502 కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తి కావాలి. రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, కర్నూలు, నెల్లూరు ప్రాంతాల్లో అవుటర్ కారిడార్ మోడల్స్ ను అధ్యయనం చేయాలి." అని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఈవీలతో తక్కువ రవాణా వ్యయం "అతి తక్కువ వ్యయంతో ప్రజా రవాణా అందుబాటులోకి రావాలి. దీనికి ఈవీ బస్సుల వినియోగం సరైన మార్గం. క్లీన్ ఫ్యూయెల్ వినియోగం ఎక్కువ జరిగితే ఖర్చు తగ్గుతుంది. ఫలితాలు ప్రజలకు అందుతాయి. సోలార్ పవర్ ను సమర్థంగా నిర్వహించడం ద్వారా విద్యుత్ కొనుగోలు ధరను సుమారు రూ.1 మేర తగ్గించ గలిగాం. కాస్ట్ ఆప్టిమైజేషన్ ఆఫ్ ఫ్యూయల్ విధానంపై దృష్టి సారిస్తే తక్కువ ఖర్చు.. ఎక్కువ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఈవీ బస్సులకు కిలోమీటరుకు రూ.72 వ్యయం అవుతోంది. వివిధ మోడళ్లను అధ్యయనం చేసి అతి తక్కువ వ్యయంతో ఈవీలను ఆపరేట్ చేయాలి. ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ స్టాండర్డైజేషన్ లాంటి అంశాలను పరిశీలించాలి. అన్నీ కేటగిరీల్లోనూ ఏసీ ఈవీ బస్సులే ఉండాలి. ఈ సైకిళ్ల వినియోగం మరింతగా పెంచేలా ప్రమోట్ చేయాలి. ఈ-సైకిళ్లు మాస్ ట్రాన్ పోర్టుగా మారేంతగా ప్రజలకు అవగాహన కల్పించాలని" సీఎం స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ బాలసుబ్రహ్మణ్యం, జాతీయ రహదారుల సంస్థ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Publish Date: Apr 8, 2026 5:17PM

political-news-img

సెలూన్ నడిపే వ్యక్తికి రూ. 72 లక్షల జీఎస్టీ నోటీసు!

చిన్నపాటి సెలూన్ నడుపుకుంటూ జీవనం సాగించే ఒక సామాన్యుడికి జీఎస్టీ అధికారులు కళ్లు బైర్లు కమ్మే షాక్ ఇచ్చారు. ఏకంగా రూ. 72 లక్షల పన్ను చెల్లించాలంటూ నోటీసులు పంపడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. విజయవాడ పంజా సెంటర్ ప్రాంతంలో సుమారు 40 ఏళ్లుగా సెలూన్ షాపు నడుపుకుంటున్న పైడాడ శ్రీనివాసరావు అనే వ్యక్తికి ఈ చేదు అనుభవం ఎదురైంది. తన జీవితంలో ఎన్నడూ చూడని అంకెను నోటీసులో చూడటంతో ఆయన ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. అసలు విషయం ఏమిటంటే, శ్రీనివాసరావు పేరు మీద విశాఖపట్నంలో భారీ ఎత్తున 'స్క్రాప్ ఐరన్' (ఇనుప వ్యర్థాల) వ్యాపారం జరిగినట్లు జీఎస్టీ రికార్డులు చెబుతున్నాయి. ఈ వ్యాపార లావాదేవీలకు సంబంధించి పన్ను చెల్లించలేదన్న నెపంతో అధికారులు ఆయన బ్యాంక్ ఖాతాను నిలిపివేశారు. పథకాల డబ్బులు రాకపోవడం, బ్యాంకు లావాదేవీలు ఆగిపోవడంతో ఆందోళన చెందిన బాధితుడు బ్యాంకుకు వెళ్లగా.. జీఎస్టీ అధికారుల ఆదేశాల మేరకే ఖాతాను హోల్డ్ చేసినట్లు సిబ్బంది స్పష్టం చేశారు. ఈ పరిణామంతో ఖంగుతిన్న శ్రీనివాసరావు వెంటనే అధికారులను సంప్రదించారు. తాను దశాబ్దాలుగా కత్తెర, దువ్వెన పట్టుకుని సెలూన్ నడుపుకుంటున్నానని, తనకు ఇనుప వ్యాపారంతో ఎలాంటి సంబంధం లేదని మొరపెట్టుకున్నారు. అయినప్పటికీ, రికార్డుల్లో పేరు ఉండటంతో విశాఖపట్నం వెళ్లి అక్కడి అధికారులను కలవాలని స్థానిక యంత్రాంగం సూచించింది. కేటుగాళ్లు ఎవరైనా తన ఆధార్, పాన్ కార్డు వివరాలను తస్కరించి, తన ప్రమేయం లేకుండానే దొంగ వ్యాపారాలు సృష్టించి ఉంటారని బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఈ దెబ్బతో శ్రీనివాసరావుకు అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా నిలిచిపోయాయి. అప్పుల బాధలు, రోజువారీ ఖర్చులకే ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇలాంటి నోటీసు రావడం ఆయన కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. సైబర్ నేరగాళ్ల మాయాజాలం వల్ల అమాయకులు ఎలా బలి అవుతున్నారో ఈ ఘటన అద్దం పడుతోంది. ప్రస్తుతం న్యాయం కోసం శ్రీనివాసరావు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, తనని ఈ చిక్కుల నుంచి గట్టెక్కించాలని వేడుకుంటున్నారు. వ్యక్తిగత డేటా దుర్వినియోగంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, తనలాంటి సామాన్యులను వేధింపుల నుంచి కాపాడాలని ఆయన కోరుతున్నారు. ఈ కేసులో తదుపరి విచారణలో ఏ నిజాలు బయటపడతాయో వేచి చూడాలి.

Publish Date: Apr 8, 2026 4:56PM

political-news-img

కేరళ, అసోం, పుదుచ్చేరిలో రేపే పోలింగ్

దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో తొలి ఘట్టం అంటే మూడు రాష్ట్రాలలో గురువారం (ఏప్రిల్ 9) పోలింగ్ జరగనుంది. కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా గురువారం (ఏప్రిల్ 9) ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కేరళలో ప్రస్తుత ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధర్మడమ్ నియోజకవర్గం రంగంలో ఉన్నారు. అస్సాంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఈ మూడు రాష్ట్రాలలోనూ కూడా ఇప్పటికే ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, వృద్ధుల కోసం ర్యాంపులు మరియు వీల్ ఛైర్ల వంటి సౌకర్యాలను కల్పించారు. ముఖ్యంగా తొలిసారి ఓటు వేస్తున్న యువతను ఉత్సాహపరిచేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఎన్నికల ఫలితాలు ఇతర రాష్ట్రాలైన తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్‌తో కలిపి వచ్చే నెల 4న విడుదల కానున్నాయి. కాగా ఈ మూడు రాష్ట్రాలలో పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు భారీగా కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేయాలని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Publish Date: Apr 8, 2026 4:51PM

political-news-img

లోకేష్ ప్రజాదర్భార్ @ 87వ రోజు

కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నారా లోకేష్ 87వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. బుధవారం (ఏప్రిల్ 8) జరిగిన ఈ కార్యక్రమానికి జనం పెద్ద సంఖ్యలో హాజరై వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చారు. ఈ సందర్భంగా నారా లోకేష్ అందరినీ ఆప్యాయంగా పలకరించారు. వివిధ సమస్యలపై వారి నుంచి వినతులు స్వీకరించారు. సత్వరమే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న దినసరి వేతన ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఆల్ యూనివర్సిటీస్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ దినసరి ఉద్యోగుల కమిటీ ప్రతినిధులు మంత్రి నారా లోకేష ను కలిసి కోరారు. కోవిడ్ వల్ల నష్టపోయిన హైర్ బస్ యజమానుల బస్సులకు రీప్లేస్ మెంట్ కల్పించి ఆదుకోవాలని ఏపీ హైర్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో తమకు వంశపారంపర్యంగా సంక్రమించిన 2.63 ఎకరాల భూమిని శిరిగిరి చంద్రమౌళీశ్వర రెడ్డి ఆక్రమించారని, విచారించి తగిన న్యాయం చేయాలని కర్నూలు జిల్లా గుండంపాడుకు చెందిన ఎస్.చిన్న శివమ్మ మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Publish Date: Apr 8, 2026 4:35PM

political-news-img

తమిళ ఓటర్ల తీర్పు ఇదేనా... లోక్ పోల్స్‌ సర్వేలో ఆసక్తికర ట్రెండ్!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది. ఈ నెల 23న పోలింగ్ జరగనున్న తరుణంలో రాష్ట్ర రాజకీయ వాతావరణం అత్యంత వేడెక్కింది. ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే తమ సర్వశక్తులూ ఒడ్డుతుండగా, ప్రముఖ సర్వే సంస్థ 'లోక్ పోల్' విడుదల చేసిన తుది అంచనాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలో మరోసారి అధికార డీఎంకే కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకోబోతోంది. లోక్ పోల్ తాజా విశ్లేషణ ప్రకారం, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి భారీ మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకోనుంది. మొత్తం 234 స్థానాలున్న అసెంబ్లీలో ఈ కూటమి ఏకంగా 180 నుంచి 185 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. విపక్షాల విమర్శలు, అధికార వ్యతిరేకత వంటి అంశాలను దాటుకుని స్టాలిన్ సర్కార్ దూసుకుపోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి ఈ ఎన్నికలు నిరాశనే మిగిల్చేలా కనిపిస్తున్నాయి. ఈ కూటమి కేవలం 40 నుంచి 44 స్థానాలకే పరిమితం కావచ్చని సర్వే అంచనా వేసింది. గత ఎన్నికలతో పోలిస్తే విపక్ష శిబిరం ఓట్ల శాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో అన్నాడీఎంకే బలహీనపడటం డీఎంకేకు కలిసివచ్చే అంశంగా కనిపిస్తోంది. మరోవైపు, సినీ నటుడు విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీ ఎన్నికల బరిలో ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. అయితే లోక్ పోల్ సర్వే ప్రకారం, విజయ్ పార్టీకి సుమారు 8 నుంచి 10 స్థానాలు మాత్రమే దక్కే అవకాశం ఉంది. సీట్ల పరంగా తక్కువగా ఉన్నప్పటికీ, సుమారు 22.5 శాతం ఓట్ల వాటాను ఈ కొత్త పార్టీ దక్కించుకోనుండటం విశేషం. ముఖ్యమంత్రి రేసులో ఎవరనే ప్రశ్నకు మెజారిటీ ఓటర్లు ఎంకే స్టాలిన్ వైపే మొగ్గు చూపారు. సుమారు 43 శాతం మంది ప్రజలు స్టాలిన్ మరోసారి సీఎం కావాలని కోరుకుంటుండగా, విజయ్ కు 28 శాతం, పళనిస్వామికి 22 శాతం మద్దతు లభించింది. ప్రజాకర్షక పథకాలు, పరిపాలనలో స్టాలిన్ ముద్ర ఓటర్లను ఆకట్టుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సర్వే ఫలితాలు డీఎంకే శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతుండగా, విపక్షాలు మాత్రం వీటిని కొట్టిపారేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని, ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని అన్నాడీఎంకే నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. విజయ్ పార్టీ ఎవరి ఓట్లు చీలుస్తుంది, అది ఏ కూటమికి నష్టం చేకూరుస్తుంది అనే అంశంపై కూడా చర్చలు జోరందుకున్నాయి. మరో కొద్ది రోజుల్లో జరగబోయే పోలింగ్, ఆపై వెలువడే ఫలితాలు తమిళనాడు భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. లోక్ పోల్ అంచనాలు నిజమవుతాయా లేక తమిళ తంబీలు ఊహించని తీర్పునిస్తారా అన్నది వేచి చూడాలి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం స్టాలిన్ సేన మరోసారి కోటపై జెండా పాతేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

Publish Date: Apr 8, 2026 4:25PM

political-news-img

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి మోహ్సినా కిద్వాయ్ కన్నుమూత

కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి మోహ్సినా కిద్వాయ్ ఇకలేరు. గత కొంతకాలంగా వయస్సు సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న ఆమె బుధవారం ( ఏప్రిల్ 8) తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 94 ఏళ్లు. మోహ్సినా కిద్వాయ్ మృతి పట్ల కాంగ్రెస్ అగ్ర నాయకత్వంతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిద్వాయ్, ఆరు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో సేవలు అందించారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో కేంద్ర మంత్రిగా రవాణా, ఆరోగ్యం, పట్టణాభివృద్ధి వంటి కీలక శాఖలను నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా, ఛత్తీస్‌గఢ్ నుండి రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కూడా ఆమె చురుకైన పాత్ర పోషించారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యురాలిగా ఆమె సేవలందించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఆమె కాంగ్రెస్ వెంటే నిలిచారు. ముఖ్యంగా 1978లో జరిగిన అజంగఢ్ ఉప ఎన్నికలో ఆమె సాధించిన విజయం, కాంగ్రెస్ పునరుజ్జీవనానికి నాంది పలికిందని చెప్పాల్సి ఉంటుంది. ఆమె మృతి పార్టీకి తీరని లోటని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.కిద్వాయ్ మృతి పట్ల సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Publish Date: Apr 8, 2026 3:58PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img