political-news-img

తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ప్రమాణ స్వీకారం

తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం (ఏప్రిల్ 29)న ఘనంగా జరిగింది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో నూతనంగా ఎంపికైన నాయకులందరూ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాటుగా కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు. నూతన కార్యవర్గంలో మొత్తం 29 మందికి పొలిట్‌బ్యూరోలో స్థానం కల్పించగా, 18 మందికి జాతీయ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించారు. వీరికి తోడుగా ముగ్గురు జాతీయ ప్రధాన కార్యదర్శులు, పార్టీ వాణిని బలంగా వినిపించేందుకు 10 మంది జాతీయ అధికార ప్రతినిధులను నియమించారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే ఈ ప్రమాణ స్వీకారం జరుగుతుండటంతో, కేడర్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కేవలం పదవులు ఇవ్వడమే కాకుండా.. రాబోయే రోజుల్లో ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం ఎలా ఉండాలనే దానిపై ఈ సందర్భంగా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Publish Date: Apr 29, 2026 10:55AM

political-news-img

సర్కార్ చేతికి హైదరాబాద్ మెట్రో రైల్.. ఇహనో, ఇప్పుడో అధికారిక ప్రకటన

భాగ్యనగర వాసుల ప్రధాన రవాణా వ్యవస్థ అయిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఇక ప్రభుత్వం చేతికి వెళ్లనుంది. ఇప్పటి వరకు పీపీపీ అంటే.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో ఎల్ అండ్ టీ సంస్థ నిర్వహణలో ఉన్న మెట్రో రైలు ప్రాజెక్టును పూర్తిగా తన అధీనంలోకి తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇహనో, ఇప్పుడో వెలువడే అవకాశాలున్నాయి. మెట్రో మొదటి దశ కార్యకలాపాల బాధ్యతలను ప్రభుత్వం పూర్తిగా స్వీకరించే దిశగా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం (ఏప్రిల్ 30) నాటికి ఈ బదలాయింపు ప్రక్రియ ముగియ నుంది. వచ్చే నెల 1 నుంచి అంటే శుక్రవారం (మే 1) నుంచీ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ పరిధిలోకి 69.2 కిలోమీటర్ల నెట్‌వర్క్ రానుంది. ఈ కీలక మార్పుతో మెట్రో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు 15 వేల కోట్ల రూపాయల వ్యయంతో ఈ బదలాయింపు జరుగుతుందని చెబుతున్నారు. ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన ఈక్విటీ వాటాను కొనుగోలు చేయడంతో పాటు.. ఆ సంస్థ పేరు మీద ఉన్న రుణాలను కూడా ప్రభుత్వం భరించనుంది. ఇందు కోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి భారీ రుణాన్ని సమీకరించి, సుమారు 20 ఏళ్ల పాటు చెల్లించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. నిర్వహణలో ఆటంకాలు కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం కొత్త బోర్డును నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఈ బోర్డు పనిచేస్తుంది. ప్రస్తుత ఉద్యోగులలో మెజారిటీ సభ్యులు మరో ఏడాది పాటు తమ విధుల్లో కొనసాగేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అనుభవజ్ఞులైన ఉన్నతాధికారులు సలహాదారులుగా వ్యవహరిస్తూ పర్యవేక్షిస్తారు. మెట్రోను ప్రభుత్వం స్వీకరించడం వల్ల భవిష్యత్తులో టికెట్ ధరల నియంత్రణతో పాటు, రెండో దశ విస్తరణ పనులు వేగవంతం అయ్యే అవకాశాలున్నయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే విధంగా రాయల్టీలు, ఇతర ఆర్థిక అంశాలపై ప్రభుత్వానికే పూర్తి అధికారం ఉంటుంది. ఈ నిర్ణయంతో హైదరాబాద్ ప్రజారవాణా వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయం ఆరంభమైనట్లేనంటున్నారు.

Publish Date: Apr 29, 2026 10:26AM

political-news-img

మమత వర్సెస్ సువేందు.. భవానిపూర్ నియోజకవర్గంపైనే అందరి దృష్టీ!

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గత కొంతకాలంగా అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న రాజకీయ రణక్షేత్రం ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా, బుధవారం (ఏప్రిల్ 29) రెండో, చివరి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఈ విడతలో 142 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ బూత్ లకు భారీగా ఓటర్లు తరలివచ్చారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ తన అధికారాన్ని నిలబెట్టుకోవాలని, ఈ సారి ఎలాగైనా బీహార్ లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని టీఎంసీ, బీజేపీలు హోరాహోరీ పోరాడుతున్నాయి. అదలా ఉంచితే బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. గత పదిహేనేళ్లుగా ఈ ప్రాంతం మమతా బెనర్జీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. అయితే, ఈసారి ఈ కోటను బద్దలు కొట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా బీజేపీ అగ్రనేతలు ఇక్కడ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇక పోతే.. భవానీపూర్ స్థానంపైనే ఇప్పుడు అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ప్రత్యర్థిగా బీజేపీ నుంచి సువేందు అధికారి బరిలో నిలిచారు. గతంలో నందిగ్రామ్ వేదికగా మమతను ఓడించిన సువేందు, మరోసారి ఆమెను సొంత గడ్డపై సవాల్ చేస్తున్నారు. దీంతో ఈ పోరు కేవలం ఒక స్థానానికే పరిమితం కాకుండా, ఇద్దరు నేతల ప్రతిష్టకు సంబంధించిన విషయంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి అంశాలను ఈ సారి ఎన్నికలలో బీజేపీ ప్రచారాస్త్రాలుగా సంధిస్తే.. సంక్షేమ పథకాలు, బెంగాలీ సెంటిమెంట్‌తో మమతాబెనర్జీ ప్రచారాన్ని హోరెత్తించారు. వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు, ఫలితాలు మే 4న విడుదల అవుతాయి.

Publish Date: Apr 29, 2026 10:04AM

political-news-img

బేబీ బాస్ వైభవ్ సూర్యవంశి.. ఐపీఎల్ చరిత్రలో కొత్త రికార్డు

భారత క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం ఓ పదిహేనేళ్ల బాలుడి పేరు మార్మోగిపోతోంది. ఐపీఎల్ లో అతడు సృష్టిస్తున్న పరుగుల విధ్వంసం క్రికెట్ దిగ్గజాలను సైతం అబ్బురపరుస్తోంది. కమిన్స్ వంటి అంతర్జాతీయ ప్లేయర్లను సైతం అతడి అభిమానులుగా మార్చేస్తోంది. అతడే 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగిన ఈ కుర్రాడు, తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ చేసిన మెరుపు సెంచరీ అతడిని రాత్రికి రాత్రే గ్లోబల్ స్టార్‌ను చేసింది. కేవలం 37 బంతుల్లోనే 103 పరుగులు చేసిన వైభవ్, ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ బాదిన ఇండియన్ గా రికార్డు సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 12 సిక్సర్లు బాదడం విశేషం. కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే అంతర్జాతీయ స్థాయి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ అతను ఆడుతున్న తీరు క్రికెట్ విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తోంది. గతంలో 14 ఏళ్లకే ఐపీఎల్ అరంగేట్రం చేసి రికార్డు సృష్టించిన వైభవ్, ఇప్పుడు తన ప్రదర్శనతో ఆ రికార్డుల స్థాయిని మరింత పెంచుతున్నాడు. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన వైభవ్ సూర్యవంశీ ప్రస్థానం స్ఫూర్తిదాయకం. తండ్రి సంజీవ్ ప్రోత్సాహంతో నాలుగేళ్ల వయసు నుంచే క్రికెట్ బ్యాట్ పట్టిన ఈ యువకుడు.. 12 ఏళ్లకే రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత అండర్-19 ప్రపంచకప్ 2026లో టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించి, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం వైభవ్‌లోని ప్రతిభను గుర్తించి 2025 వేలంలో 1.1 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. ఇప్పుడు అతను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వరుసగా పరుగులు సాధిస్తున్నాడు. ముఖ్యంగా అతని బ్యాట్ స్పీడ్, స్ట్రోక్ ప్లే లో చూపిస్తున్న టైమింగ్ దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్ ఇన్నింగ్స్‌లను గుర్తుచేస్తోందని అభిమానులు అంటున్నారు. ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే.. వైభవ్ సూర్యవంశీ అతి త్వరలోనే టీమ్ ఇండియా సీనియర్ జట్టులోకి అడుగుపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటికే 400కు పైగా పరుగులు సాధించిన ఈ యువ సంచలనం.. మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. రాబోయే మ్యాచ్‌ల్లో వైభవ్ ఇంకా ఎలాంటి అద్భుతాలు చేస్తాడోనని క్రికెట్ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కాగా మంగళవారం (ఏప్రిల్ 28) జరిగిన మ్యాచ్ లో ఈ చిచ్చరపిడుగు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా 400 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అతడీ ఘనతను కేవలం ఈ ఘనతను కేవలం 167 బంతుల్లోనే అందుకున్నాడు. ఈ క్రమంలో ఆండ్రీ రసెల్ 188 బంతుల్లో నాలుగువందల పరుగుల రికార్డు చెరిగిపోయింది.

Publish Date: Apr 29, 2026 9:46AM

political-news-img

ఓపెక్ కూటమి నుంచి యూఏఈ నిష్క్రమణ

అంతర్జాతీయ చమురు విపణిలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. చమురు ఎగుమతి దేశాల శక్తిమంతమైన కూటమి అయిన ఓపెక్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తప్పుకుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా చేసింది. ఈ నిర్ణయం వచ్చే నెల 1 నుంచి అమలులోకి రానుంది. కేవలం ఓపెక్ మాత్రమే కాకుండా.. రష్యాతో కూడిన ఓపెక్ ప్లస్ కూటమి నుంచి కూడా వైదొలగాలని యూఏఈ నిర్ణయించుకుంది. తమ దేశ దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రయోజనాలు, ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఏఈ పేర్కొంది. గత కొంతకాలంగా చమురు ఉత్పత్తి కోటాలపై కూటమిలోని ఇతర సభ్యదేశాలతో.. ముఖ్యంగా సౌదీ అరేబియాతో యూఏఈకి విభేదాలు కొనసాగుతున్నాయి. తమ దేశం చమురు ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచుకున్నప్పటికీ.. కూటమి నిబంధనల వల్ల పూర్తిస్థాయిలో ఎగుమతులు చేయలేకపోతున్నామనే అసంతృప్తి కారణంగానే యూఏఈ ఈ నిర్ణయానికి వచ్చిందని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. యూఏఈ తన ప్రయోజనాలకు అనుగుణంగా చమురు ఉత్పత్తిని స్వతంత్రంగా నిర్ణయించుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఇంధన అవసరాలు మారుతున్న తరుణంలో.. క్లీన్ ఎనర్జీ తదితర ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన నిధులను చమురు ఎగుమతుల ద్వారా గరిష్టంగా సంపాదించాలని చూస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 1967 నుంచి ఈ కూటమిలో సభ్యదేశంగా ఉన్న యూఏఈ.. ఇప్పుడు తన సొంత ఆర్థిక ఎజెండాకే ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నిష్క్రమణ వల్ల ఓపెక్ కూటమిలో సౌదీ అరేబియా ఆధిపత్యానికి గట్టి దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఓపెక్ దేశాల్లో మూడవ అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా ఉన్న యూఏఈ బయటకు రావడం వల్ల.. చమురు ధరలపై కూటమికి ఉండే పట్టు సడలడం అనివార్యం. హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు, భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో యూఏఈ తీసుకున్న ఈ నిర్ణయం చమురు ధరల్లో ఒడిదుడుకులకు దారి తీస్తుందన్న ఆందోళన వ్యక్తమౌతోంది. భవిష్యత్తులో యూఏఈ తన చమురు ఉత్పత్తిని క్రమంగా పెంచుతూ మార్కెట్లోకి రానుంది. ఇది వినియోగ దేశాలకు ఊరటనిచ్చే విషయం అనడంలో సంందేహం లేదు. కాగా యూఏఈ నిర్ణయంపై ఎపెక్ కూటమిలోని ఇతర దేశాల స్పందన తెలియాల్సి ఉంది.

Publish Date: Apr 29, 2026 9:28AM

political-news-img

పంజాబ్ కింగ్స్ కు తొలి ఓటమి

ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ తొలి పరాజయాన్ని ఎదుర్కొంది. మంగళవారం ((ఏప్రిల్ 28) రాజస్థాన్ రాయల్స్ లో జరిగిన మ్యాచ్ లో ఆరువికెట్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్.. మార్కస్ స్టయినిస్ మెరుపు ఇన్నింగ్స్ 22 బంతుల్లో 66 నాటౌట్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్ మన్ సింగ్ 44 బంతుల్లో 59 అర్ధశతకంతో రాణించాడు. అనంతరం 223 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ కు అదిరిపోయే ఆరంభం లభించింది. బేబీ బాస్ గా అభిమానులు పిలుచుకుంటున్న వైభవ్ సూర్యవంశీ పంజాబ్ బౌలర్లపై సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 16 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 43 పరుగులు చేశారు. వైభవ్ సూర్యవంశి ఔటైన తరువాత యశస్వి జైస్వాల్ 27 బంతుల్లో 51 పరుగులతో ఆకట్టుకున్నాడు. అప్పటి వరకూ సాఫీగా సాగుతున్న రాజస్థాన్ ఇన్నింగ్స్ కు చాహల్ బ్రేక్ వేశాడు. చాహల్ 36 పరుగులు ఇచ్చి మూడు వికెట్ల పడగొట్టడంతో రాజస్థాన్ రాయల్స్ చిక్కుల్లో పడింది. ఒక దశలో విజయయానికి 50 బంతుల్లో వంద పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పంజాబ్ కింగ్స్ విజయం ఖాయమన్న అభిప్రాయం ఏర్పడింది. అయితే.. ఫెరీరా, శివం దుబెలు నిలకడగా, వేగంగా ఆడారు. పేసర్లను లక్ష్యం చేసుకుని బౌండరీల వర్షం కురిపించారు. దీంతో 19.2 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది.

Publish Date: Apr 29, 2026 9:09AM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img