political-news-img

కూలర్ ఆన్ లో ఉన్నా వేడి తగ్గడం లేదా? ఈ పొరపాట్లు చేయకండి!

వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి. ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు. అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా వాడుతూ ఉంటారు. వేసవి కాలం వస్తోందని అనిపించగానే కూలర్లు సిద్దం చేస్తుంటారు. అయితే.. చాలామంది కూలర్ విషయంలో ఎదుర్కునే సమస్య చల్లదనం రాకపోవడం. కూలర్ ఎంత స్పీడ్ లో ఉన్నా చల్లదనం లేకపోవడం, గదిలో ఉన్నవారికి చెమట పట్టడం, మరీ ముఖ్యంగా ముఖం మీద జిడ్డుగా మారడం వంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి కూలర్ సరిగా పనిచేయడం లేదని అనుకుంటూ ఉంటారు. కానీ దీనికి అసలు కారణం చాలామంది చేసే పొరపాట్లే.. ఆ పొరపాట్లు ఏంటో తెలుసుకుంటే.. గదిని పూర్తీగా మూసి ఉంచడం.. ఏసీ వాడేటప్పుడు గదిలోని కిటికీలు, తలుపులన్నీ ఎలాగైతే మూసి ఉంచాలో, కూలర్ విషయంలో కూడా అలాగే చేయాలని తరచుగా అనుకుంటారు. ఇది చాలా పెద్ద పొరపాటు. కూలర్లు గాలిలోకి తేమను విడుదల చేస్తాయి. గదిని పూర్తిగా మూసి ఉంచితే, ఆ తేమ బయటకు వెళ్లలేక, గాలిలో విపరీతమైన తేమ ఏర్పడుతుంది. అందువల్ల, గాలి ప్రసరణ జరిగేలా , గదిలోని నిస్సారమైన గాలి బయటకు వెళ్లేలా చేయడానికి, ఒక కిటికీని లేదా తలుపును కొద్దిగా తెరిచి ఉంచాలి. కూలర్ అమరిక.. కూలర్‌ను గది మధ్యలో లేదా గోడకు ఆనించి, దానికి స్వచ్ఛమైన గాలి అందని చోట ఉంచితే, అది గదిలోని వేడి గాలిని బయటకు పంపుతూనే ఉంటుంది. కూలర్‌ను ఎల్లప్పుడూ కిటికీ లేదా తలుపు దగ్గర ఉంచాలి. తద్వారా అది బయటి నుండి స్వచ్ఛమైన గాలిని లోపలికి లాగి, దానిని లోపలికి పంపుతుంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్.. బయట విపరీతమైన వేడి, తేమ ఉన్నప్పుడు, కేవలం కిటికీ తెరవడం ద్వారా కూలర్‌లోని తేమను బయటకు పంపడం కష్టమవుతుంది. గదిలో తప్పకుండా ఒక చిన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను అమర్చాలి. కూలర్‌ను నడుపుతున్నప్పుడు, ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను కూడా ఆన్ చేయాలి. ఇది గదిలోని జిగటగా ఉండే వేడి గాలి మొత్తాన్ని బయటకు లాగి, గదిని చల్లగా ఉంచుతుంది. కూలర్ ప్యాడ్స్.. కొన్నిసార్లు సంవత్సరాల తరబడి కూలర్ పక్క ప్యాడ్‌లను మార్చకుండా ఉంటారు. వాటిపై దుమ్ము, ఉప్పునీరు పేరుకుపోయి, తెల్లటి పొరలా ఏర్పడుతుంది. దీనివల్ల గాలి లోపలికి వెళ్లదు, కూలర్ ఫ్యాన్‌లా కేవలం వేడి గాలిని మాత్రమే బయటకు పంపుతుంది. అందువల్ల, ప్రతి సీజన్‌లో కూలర్ ప్యాడ్‌లను తప్పకుండా మార్చాలి. కూలర్ లో హనీకూంబ్ ప్యాడ్స్ ఉంటే వాటిని బయటకు తీసి బాగా శుభ్రం చేయాలి. సూర్యరశ్మి.. గది గోడలు లేదా కిటికీలపైకి నేరుగా సూర్యరశ్మి పడితే, అవి వేడెక్కుతాయి. కూలర్‌లోని గాలి వేడెక్కిన గోడలను తాకినప్పుడు దాని ప్రభావం తగ్గిపోతుంది. అందువల్ల, పగటిపూట కిటికీలకు మందపాటి, ముదురు రంగు కర్టెన్లను వేయాలి. ఇది సహజంగా గది ఉష్ణోగ్రతను తగ్గించి, కూలర్ వేగంగా చల్లబడటానికి సహాయపడుతుంది. వాతావరణం చాలా వేడిగా ఉంటే, కూలర్‌లోని వాటర్ ట్యాంక్‌లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేయాలి. దీనివల్ల నీరు వెంటనే చల్లబడుతుంది. కూలర్ నుండి వచ్చే గాలి ఎయిర్ కండిషనర్ లాగా అనిపిస్తుంది. *రూపశ్రీ.

Publish Date: May 22, 2026 6:59PM

political-news-img

క్రికెట్ దిగ్గజాలను అబ్బురపరుస్తున్న వైభవ్ దూకుడు

టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు ప్రపంచ క్రికెట్ వర్గాల్లో మార్మోగుతోంది. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున సంచలన ప్రదర్శనలతో ప్రపంచ క్రికెట్ దిగ్గజాలకు హాట్ టాపిక్‌గా మారాడు. 15 ఏళ్ల వయసులోనే ఎన్నో రికార్డులు కొల్లగొడుతూ స్టార్ బౌలర్లకు మింగుడుపడకుండా తయారయ్యాడు. ప్రత్యర్థి బౌలర్లపై వైభవ్ విరుచుకుపడుతున్న తీరు అభిమానులతో పాటు క్రికెట్ దిగ్గజాలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ కూడా వైభవ్ సూర్యవంశీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ అద్భుతాలు చేస్తున్నాడని, తమ వాట్సాప్ గ్రూప్‌లో వైభవ్ చర్చే ప్రధాన అంశంగా మారిందన్నాడు. మైదానంలో అతడు ఆడటం మొదలుపెడితే.. తమ గ్రూప్‌లో మెసేజ్‌లు వరదలా వస్తుంటాయని... మళ్లీ చెలరేగాడు.. 17 బంతుల్లో 43 పరుగులు... అంటూ మెసేజ్‌లు చేస్తూ గ్రూప్‌లో ఉన్నవాళ్లంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారని పేర్కొన్నాడు. అతడి దూకుడుని బౌన్సర్, యార్కర్లతో చెక్ పెట్టొచ్చని భావించే లోపే.. మరో కొత్త షాట్‌తో అందరినీ షాక్‌కు గురి చేస్తాడనిఅని స్టువర్ట్ బ్రాడ్ ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించాడు. ఇంగ్లండ్ క్రికెటర్ బట్లర్ కూడా వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించాడు. పవర్ ప్లేలో ప్రతి రెండు బంతులకు ఒక బౌండరీ బాదుతున్నాడు. ఇది అసాధారణ ప్రతిభ అంటూ కొనియాడాడు. ఇదిలా ఉంటే, వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 53 సిక్సర్లు బాది.. ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఇక క్రిస్ గేల్ పేరిట ఉన్న ఒకే సీజన్‌లో 59 సిక్సర్ల రికార్డుకు వైభవ్ అత్యంత చేరువలో ఉన్నాడు. అయితే ఐపీఎల్ 2026 ఆరెంజ్ క్యాప్ రేసులోనూ వైభవ్ దూసుకెళ్తున్నాడు. 13 మ్యాచుల్లో 579 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లింది. లీగ్ దశలో మరో మ్యాచ్ ఆడాల్సి ఉండటంతో సూర్యవంశీ సిక్స్‌ల ‘వైభోగం’ మరింత పీక్ స్టేజ్‌కి అవకాశం కనిపిస్తోంది.

Publish Date: May 22, 2026 5:21PM

political-news-img

ఐఏఎస్ పిల్లలకు ఇంకా రిజర్వేషన్లా...సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు రిజర్వేషన్ల వ్యవస్థపై అత్యంత కీలకమైన, సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక నిర్దిష్టమైన కేసు విచారణ సందర్భంగా దేశంలో అమలవుతున్న కోటా విధానం, దాని ప్రయోజనాల లబ్ధిదారుల తీరుపై సుప్రీంకోర్టు తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది. ముఖ్యంగా వెనుకబడిన తరగతుల్లో సామాజికంగా, ఆర్థికంగా, మరియు విద్యాపరంగా ఇప్పటికే ఉన్నత స్థాయికి చేరుకున్న కుటుంబాలకు ఇంకా రిజర్వేషన్లు ఎందుకు కొనసాగించాలనే కోణంలో ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రధానంగా ఒక ఉదాహరణను ప్రస్తావించింది. తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్ (IAS) అధికారులుగా ఉన్న కుటుంబాల పిల్లలకు కూడా ఇంకా రిజర్వేషన్ ప్రయోజనాలు కల్పించాల్సిన అవసరం ఏముందని సర్వోన్నత న్యాయస్థానం నేరుగా ప్రశ్నించింది. సామాజికంగా, ఆర్థికంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది, సమాజంలో అత్యున్నత హోదాల్లో ఉన్న కుటుంబాలు పదే పదే కోటా ప్రయోజనాలను పొందడం ఎంతవరకు సమంజసమని న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. రిజర్వేషన్ల ప్రధాన ఉద్దేశం వెనుకబడిన వర్గాలకు సామాజిక స్థితిలో మార్పు తీసుకురావడం, వారిని ఆర్థికంగా, విద్యాపరంగా బలోపేతం చేయడమేనని న్యాయస్థానం గుర్తు చేసింది. విద్యా, ఆర్థిక సాధికారతతో ఒక స్థాయికి చేరుకున్న తర్వాత కూడా, మళ్లీ తమ పిల్లల కోసం రిజర్వేషన్లు కోరుకుంటూనే ఉంటే ఈ వ్యవస్థ నుండి మనం ఎప్పటికీ బయటపడలేమని కోర్టు అభిప్రాయపడింది. సామాజికంగా, ఆర్థికంగా ముందంజ వేసిన కుటుంబాలు స్వచ్ఛందంగా లేదా చట్టబద్ధంగా రిజర్వేషన్ల వ్యవస్థ నుండి బయటకు రావాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేసింది. ఒకసారి రిజర్వేషన్ ద్వారా ఉన్నత సామాజిక స్థితిని సాధించిన తర్వాత, ఆ కుటుంబాలు కోటా పరిధి నుండి తప్పుకుంటేనే నిజమైన వెనుకబడిన వారికి న్యాయం జరుగుతుందని పేర్కొంది. ఈ విచారణ సందర్భంగా కోర్టు మరో కీలకమైన చట్టపరమైన తేడాను కూడా ప్రస్తావించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) కోటాకు, అలాగే ఓబీసీ (OBC) క్రిమిలేయర్ వ్యవస్థకు మధ్య స్పష్టమైన తేడా ఉండాలని ధర్మాసనం అభిప్రాయపడింది. అందరూ ఒకే తరహాలో రిజర్వేషన్లలో కొనసాగితే ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసానికి అర్థమే ఉండదని వ్యాఖ్యానించింది. గతంలో 1992 నాటి చారిత్రాత్మక ఇంద్రా సాహ్నీ కేసులో సుప్రీంకోర్టు రిజర్వేషన్లకు సంబంధించి గరిష్టంగా 50 శాతం పరిమితిని విధించిన సంగతి తెలిసిందే. ఆ పరిమితులకు లోబడి, ఎంపిరికల్ డేటా ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలని కోర్టు ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూనే ఉంది. తాజాగా ఓబీసీ క్రిమిలేయర్, రిజర్వేషన్ల వర్తింపుపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతూ సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సరికొత్త సామాజిక, రాజకీయ చర్చకు తెరలేపాయి.

Publish Date: May 22, 2026 5:00PM

political-news-img

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగ్ షాక్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ, న్యాయ వర్గాల్లోనూ తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ అలియాస్ అనంతబాబుకు కోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. రాజమహేంద్రవరంలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు మరియు ప్రధాన సెషన్స్ న్యాయస్థానం అనంతబాబుకు గతంలో లభించిన బెయిల్‌ను పూర్తిగా రద్దు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు డిసెంబర్ 12, 2022న మంజూరు చేసిన తాత్కాలిక బెయిల్ బెయిల్ నిబంధనలను అనంతబాబు పూర్తిగా ఉల్లంఘించారని, సాక్షులను తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేస్తూ కేసు విచారణను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారని ప్రాసిక్యూషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన ట్రయల్ పూర్తయ్యే వరకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లోనే రిమాండ్ ఖైదీగా కొనసాగాల్సి ఉంటుంది. ఈ మొత్తం వివాదానికి కారణం ఏప్రిల్ 20వ తేదీన కాకినాడలో జరిగిన ఒక తీవ్రమైన సాక్షుల బెదిరింపు సంఘటనే. ఈ హత్య కేసులో కీలక సాక్షులుగా ఉన్న దుర్గా శివప్రసాద్ అరవ, ఆయన సోదరుడు మణికంఠతో పాటు ముమ్మిడి వెంకటేష్, సవలం పవన్ కుమార్ అనే నలుగురు వ్యక్తులను అనంతబాబు అనుచరులు కాకినాడలోని సిద్ధార్థ నగర్‌లో గల సమీరా అపార్ట్‌మెంట్‌లోని ఒక ఫ్లాట్‌కు బలవంతంగా తీసుకువెళ్లారు. అక్కడ వారిని అక్రమంగా బంధించి, కోర్టులో అనంతబాబుకు మరియు ఆయన భార్య అనంత లక్ష్మి దుర్గకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని, లేదంటే ప్రాణాలతో ఉంచబోమని తీవ్రంగా హెచ్చరించారు. అంతేకాకుండా, సాక్ష్యం మార్చడానికి ఒప్పుకుంటే ఒక్కొక్కరికి రూ. 1,00,000 ఇస్తామని ఎర వేసి, భయంతో ఉన్న సాక్షులకు ఆ నగదును బలవంతంగా చేతిలో పెట్టారు. ఈ ఘటనపై బాధితులు ధైర్యం చేసి కాకినాడ టూ టౌన్ మరియు సర్పవరం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఏప్రిల్ 24న అనంతబాబును హైడ్రామా మధ్య అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు కోర్టులో బలమైన ఆధారాలను ప్రవేశపెడుతూ, నిందితుడు తన విముక్తిని దుర్వినియోగం చేశాడని, సాక్షులను ప్రభావితం చేయడం వల్ల నిష్పక్షపాత విచారణ సాధ్యం కాదని వాదించారు. 34 ఏళ్ల వయసున్న దళిత యువకుడు, మాజీ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం మే 19, 2022న కాకినాడలో అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల సమయంలో ఎమ్మెల్సీ అనంతబాబు స్వయంగా తన సొంత కారులో సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని బాధితుడి తల్లిదండ్రుల ఇంటికి తీసుకువచ్చి, ఇది కేవలం రోడ్డు ప్రమాదమని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే కుటుంబ సభ్యులు దానికి నిరాకరించి, హత్యగా అనుమానించడంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత వైసీపీ ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. దర్యాప్తు అధికారి 90 రోజుల్లోగా ఛార్జ్‌షీట్ దాఖలు చేయకపోవడంతో డిసెంబర్ 2022లో ఆయనకు డిఫాల్ట్ బెయిల్ వచ్చింది. అయితే జూన్ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, జూలై 2025లో ఈ కేసుపై తిరిగి సమగ్ర పునర్విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. తాజాగా కోర్టు బెయిల్ రద్దు చేయడంతో ఈ కేసు విచారణ మే 20 నుండి వేగవంతం కానుంది.

Publish Date: May 22, 2026 4:46PM

political-news-img

రైతులను సేంద్రియ సాగువైపు ప్రోత్సహించాలి : మంత్రి లోకేష్

పెనికలపాడులో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి లోకేష్.. సేంద్రియ సాగు చేస్తున్న ద్వారకానాథ రెడ్డిని అభినందించిన మంత్రి.. రైతులను సేంద్రియ సాగువైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ సీఎం చంద్రబాబు లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కడప జిల్లాలో రెండు రోజు పర్యటనలో భాగంగా ముందుగా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు మండలం పెనికలపాడులో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి లోకేష్ సందర్శించారు. సమీకృత సేంద్రియ సాగు చేస్తున్న రైతు మునగాల ద్వారకానాథ రెడ్డి, అతని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ముందుగా సేంద్రీయ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న లోకేష్‌కు రైతు ద్వారకానాథ్ రెడ్డి, ఆయన సతీమణి రాఘవేంద్రవతిలు స్వాగతం పలికారు. 17 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్న ద్వారకానాథ రెడ్డి కుటుంబం పెనికలపాడుకు చెందిన రైతు ద్వారకానాథ రెడ్డి, ఆయన సోదరుడు రమణారెడ్డిలు గత ఐదేళ్లుగా తమ ఉమ్మడి కుటుంబానికి చెందిన 17 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్నారు. పంటలు, పశుపోషణ, కోళ్లు, చేపల పెంపకం వంటి వాటిని ఒకదానికొకటి అనుసంధానం చేసి సమీకృత సేంద్రీయ సాగు చేస్తూ స్థిరమైన ఆదాయం అర్జిస్తున్నారు. తమ పొలంలో మామిడి, బత్తాయి, ఉసిరి, కొబ్బరి, చిన్న నిమ్మ, నేరేడు, జామ, మునగ, రామాఫలం, సీతాఫలం పంటల సాగుతో పాటు 250 వరకు నాటుకోళ్ల పెంపకం, 60 వరకు పొట్టేళ్లు, చేపల సాగు చేస్తున్నారు. సేంద్రియ సాగు పద్ధతులను అడిగి తెలుసుకున్న మంత్రి లోకేష్ ఈ సందర్భంగా రైతు ద్వారకానాథ రెడ్డి, అతని కుటుంబ సభ్యులతో మంత్రి సంభాషించారు. ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లడానికి గల కారణాలను మంత్రి లోకేష్ అడిగి తెలుసుకున్నారు. తమ గ్రామంలో 70 ఏళ్ల వయస్సున్న సేంద్రియ రైతు లక్ష్మీనారాయణను స్ఫూర్తిగా తీసుకుని తాము సేంద్రియ సాగు చేస్తున్నామని వివరించారు. మొదట ఒడిదొడుకులు ఎదుర్కొన్నా.. వ్యవసాయ అధికారుల ప్రోత్సాహంతో నిలదొక్కుకున్నామని చెప్పారు. వ్యవసాయ అధికారులు సేంద్రియ సాగులో మెళకువలపై తిరుపతిలో శిక్షణ అందించారని, బయో రీసెర్చ్ సెంటర్ కేటాయించారని తెలిపారు. తమ పొలంలోనే సహజ ఎరువులు, 32 రకాల జీవ వైవిధ్య గింజల తయారీ చేపట్టినట్లు వివరించారు. పురుగుమందులు, రసాయన ఎరువులు అవసరం ఇప్పుడు తమకు లేదన్నారు. పంట పెట్టుబడి తగ్గిపోవడంతో సమీకృత సేంద్రీయ సాగు ద్వారా నెలవారీ ఆదాయం పొందుతున్నామన్నారు. ఒక్క ఆవుతోనే 20 ఎకరాల వరకు సేంద్రియ సాగు చేపట్టవచ్చని తెలిపారు. 250 నాటుకోళ్ల పెంపకం ద్వారా పొలంలో కలుపు తీసే పనిలేదని, పురుగుమందుల అవసరం లేదని వివరించారు. తమ వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న మామిడి చెట్ల ద్వారా ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.3.50 లక్షల వరకు ఆదాయం పొందుతున్నామని చెప్పారు. ప్రభుత్వ పరంగా మరింత సహకారం అందిస్తే ప్రకృతి వ్యవసాయంలో అద్భుతాలు చేయవచ్చని ధీమావ్యక్తం చేశారు. రైతులను సేంద్రియ సాగువైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా మంత్రి లోకేష్ స్పందిస్తూ .. పంట పొలాల్లో అధిక రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం ద్వారా భూసారం దెబ్బతినడంతో పాటు రైతుకు సాగు పెట్టుబడి వ్యయం అధికమవుతోందన్నారు. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ సీఎం చంద్రబాబు గారి లక్ష్యమని వివరించారు. రాష్ట్రంలోని రైతులను సేంద్రియ సాగువైపు మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం కూడా ఇందుకు కృషిచేస్తోందని వివరించారు. చిరుధాన్యాల సాగును కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. రాయలసీమలో బిందు సేద్యానికి మరింత అండగా ఉంటున్నామని, గొలుసుకట్టు చెరువుల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. సేంద్రియ సాగును ప్రోత్సహించేందుకు స్థానిక రైతులను అనుసంధానించాల్సిన అవసరం ఉందన్నారు. దీంతోపాటు ప్రభుత్వం కూడా మద్దతుగా ఉంటుందన్నారు. వ్యవసాయ క్షేత్రం మొత్తం కలియతిరిగి వివిధ పంటల సాగును మంత్రి పరిశీలించారు. అనంతరం 32 లక్షల లీటర్ల సామర్థ్యమున్న నీటి కుంటను మంత్రి పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమీకృత సేంద్రియ సాగులో అద్భుతాలు సృష్టిస్తూ.. స్థిరమైన ఆదాయం పొందుతున్న మునగాల ద్వారకానాథ్ రెడ్డి, కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సేంద్రియ పద్ధతిలో సాగుచేసిన మామిడిని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ రుచి చూశారు. అనంతరం రైతు ద్వారకానాథ రెడ్డి కుటుంబం మంత్రి లోకేష్ కు మామిడి పండ్లను బహుమతిగా అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో రైతు మునగాల ద్వారకానాథ రెడ్డి, ఆయన సతీమణి రాఘవేంద్రవతి, ద్వారకానాథ రెడ్డి సోదరుడు రమణారెడ్డి, ద్వారకానాథ రెడ్డి మాతృమూర్తి నారాయణమ్మ, రమణారెడ్డి కుమారుడు విఘ్నేశ్వర్ రెడ్డి, కుమార్తె జ్యోతికా రెడ్డి పాల్గొన్నారు.

Publish Date: May 22, 2026 4:12PM

political-news-img

రూ.3 లక్షల పది రూపాయల నాణేలతో బుల్లెట్ బైక్ కొన్న వ్యాపారి!

సరికొత్త బైక్ కొనడం చాలా మందికి ఒక కల. అయితే ఆ కల కోసం ముప్పై ఏళ్లుగా నిరీక్షించి, వినూత్న రీతిలో దాన్ని సాకారం చేసుకున్నారు బాపట్ల జిల్లాకు చెందిన ఓ సాధారణ వ్యాపారి. ఏకంగా రూ.3 లక్షల విలువైన పది రూపాయల నాణేలను సేకరించి, వాటితో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మోటార్ సైకిల్‌ను కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. స్థానికంగా ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. బాపట్ల జిల్లా చీరాల మండలం పరిధిలోని పాత చీరాల గ్రామానికి చెందిన రాసాని రాఘవ వృత్తిరీత్యా చేపల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. చిన్నతనం నుంచే ఆయనకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ వాహనం అంటే అమితమైన ఇష్టం. గ్రామంలో ఎవరైనా ఆ బైక్ వేసుకుని వెళ్తుంటే ఎప్పటికైనా తాను కూడా అలాంటి వాహనాన్ని సొంతం చేసుకోవాలని బలంగా నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలోనే రూపాయి రూపాయి పోగు చేస్తూ తన కలల సాకారానికి నాంది పలికారు. గత కొన్నేళ్లుగా తనకు వ్యాపారంలో వచ్చే ఆదాయంలో కొంత భాగం, ముఖ్యంగా పది రూపాయల నాణేలను రాఘవ ప్రత్యేకంగా భద్రపరచడం ప్రారంభించారు. అలా నిరంతర శ్రమతో సుమారు రూ.3 లక్షల విలువైన కాయిన్స్‌ను సేకరించారు. ఆ నాణేలన్నింటినీ బస్తాల్లో నింపుకుని వాహనం కొనేందుకు స్థానిక షోరూమ్‌ల చుట్టూ తిరిగారు. అయితే అంత పెద్ద మొత్తంలో ఉన్న చిల్లర నాణేలను లెక్కించడం సాధ్యం కాదంటూ పలువురు వ్యాపారులు ఆయనను వెనక్కి పంపించేశారు. షోరూమ్ నిర్వాహకులు నిరాకరించడంతో రాఘవ కొంత నిరాశకు గురైనప్పటికీ తన పట్టుదలను మాత్రం కోల్పోలేదు. ఈ క్రమంలోనే తన స్నేహితులతో కలిసి ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్‌షిప్‌ను సంప్రదించారు. రాఘవ పట్టుదలను, బైక్‌పై ఆయనకున్న మక్కువను గమనించిన అక్కడి యాజమాన్యం ఆ నాణేలను తీసుకునేందుకు సానుకూలంగా స్పందించింది. నాలుగు రోజుల పాటు సిబ్బంది సాయంతో ఆ కాయిన్స్ అన్నింటినీ లెక్కించి ఎట్టకేలకు కొత్త వాహనాన్ని అందజేశారు. ఈ అరుదైన క్షణంపై రాఘవ హర్షం వ్యక్తం చేస్తూ.. తన మూడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడిందని సంతోషపడ్డారు. వాహనం పొందిన అనంతరం ఆయన తన భార్య శ్రీలక్ష్మితో కలిసి కొత్త బైక్‌పై ఊరంతా చక్కర్లు కొట్టారు. వ్యాపారంలో కష్టపడుతూనే, తలచుకుంటే ఏదైనా సాధించవచ్చని ఆయన నిరూపించారు. సాధారణంగా మార్కెట్లో పది రూపాయల నాణేల చెలామణిపై అక్కడక్కడా అపోహలు కొనసాగుతున్న తరుణంలో, ఏకంగా మూడు లక్షల కాయిన్స్‌తో వ్యాపారి ఒకరు బైక్ కొనడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. నాణేల స్వీకరణకు ముందుకొచ్చిన ఒంగోలు షోరూమ్ యాజమాన్యాన్ని సైతం స్థానికులు, నెటిజన్లు ఎంతగానో అభినందిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పట్టుదల గల వ్యక్తుల కథనాలు ఎంతోమందికి స్ఫూర్తినిస్తాయని ఆశిస్తున్నారు.

Publish Date: May 22, 2026 3:48PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img