పార్కు కోసం భూమి ఇస్తే.. డేటా సెంటర్ కట్టేసారు!
Publish Date:Jun 9, 2026
Advertisement
అది 1999వ సంవత్సరం. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న టేలర్ (Taylor) అనే ఒక చిన్న నగరంలో ఒక వ్యవసాయ కుటుంబం గొప్ప మనసుతో ఒక నిర్ణయం తీసుకుంది. తమ వద్ద ఉన్న 87 ఎకరాల విలువైన సొంత భూమిని, స్థానిక ప్రజలందరూ ఆనందంగా గడపడానికి, ఒక అందమైన పబ్లిక్ పార్కుగా మార్చాలని భావించింది. సమాజంపై ఉన్న ప్రేమతో కేవలం 10 డాలర్ల నామమాత్రపు రుసుముతో ఆ 87 ఎకరాల భూమిని ఒక పబ్లిక్ ట్రస్ట్కు, అంటే నగర మునిసిపాలిటీకి రాసిచ్చింది ఆ రైతు కుటుంబం. రాబోయే తరాల పిల్లలు ఇక్కడ ఆడుకుంటారని, ప్రకృతి ఒడిలో పచ్చని చెట్ల మధ్య ప్రజలు ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారని ఆ నాడు ఆ రైతులు ఎంతో ఆశపడ్డారు. కానీ కాలం గడిచేకొద్దీ ఆశలు అడియాసలయ్యాయి. నగర పాలకులు ఆ రైతు కుటుంబం యొక్క ఉద్దేశాన్ని, నమ్మకాన్ని పూర్తిగా పక్కనబెట్టేశారు. ప్రజల కోసం కేటాయించిన ఆ పచ్చని భూమిపై కార్పొరేట్ కంపెనీల కన్ను పడింది. 2025వ సంవత్సరంలో టేలర్ నగర యంత్రాంగం ఆ 87 ఎకరాల పార్కు భూమిని బ్లూప్రింట్ (Blueprint) అనే ఒక ప్రముఖ డేటా సెంటర్ డెవలపర్కు ఏకంగా 10 మిలియన్ డాలర్లకు (దాదాపు 83 కోట్ల రూపాయలకు పైగా) విక్రయించింది. ప్రజల కోసం పార్కు నిర్మించాల్సిన స్థలంలో ఇప్పుడు ఏకంగా 1,35,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక భారీ, కాంక్రీట్ డేటా సెంటర్ను నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఊహించని పరిణామం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి, గురయ్యేలా చేసింది. తరతరాలుగా ఆ భూమి చుట్టుపక్కల నివసిస్తున్న పామెలా గ్రిఫిన్ (Pamela Griffin) అనే మహిళా రైతు కుటుంబం మరియు ఆమె సోదరసోదరీమణులు ఈ నిర్ణయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా వారి కుటుంబంలోని మూడు తరాల పిల్లలు ఆ ఖాళీ స్థలంలో బేస్ బాల్ ఆడుకుంటూ, రాత్రి వేళల్లో క్యాంపింగ్ చేస్తూ ఎన్నో తీపి జ్ఞాపకాలను పెంచుకున్నారు. తమ పూర్వీకులు సమాజ సేవ కోసం త్యాగం చేసిన భూమి, నేడు ఇలా భారీ మిషన్లు, సర్వర్లతో నిండిపోతుండటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. మరింత దారుణమైన విషయం ఏమిటంటే, ఈ భారీ డేటా సెంటర్ పామెలా గ్రిఫిన్ నివాస గృహానికి కేవలం 500 అడుగుల దూరంలోనే నిర్మితమవుతోంది. ఒకవైపు పవర్ సబ్స్టేషన్, మరోవైపు రైల్వే ట్రాక్స్, ఇప్పుడు వాటి మధ్యలో నిరంతరం శబ్దాలు చేస్తూ భారీగా విద్యుత్తును వినియోగించే డేటా సెంటర్ రాబోతుండటంతో స్థానిక నివాసితుల జీవన విధానం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. పచ్చని చెట్లు, పిల్లల ఆటపాటలతో కళకళలాడాల్సిన ఆశల పార్కు స్థలం, నేడు టెక్నాలజీ ప్రపంచానికి కాపలా కాసే ఇనుప గోడల డేటా సెంటర్గా మారిపోవడం కార్పొరేట్ శక్తుల స్వార్థానికి, నగర పాలకుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది.
http://www.teluguone.com/news/content/farmer-donated-land-turned-into-data-center-36-222323.html





